గణతంత్ర వేడుకలకు భారతావని సంసిద్ధం.. ఈసారి పరేడ్‌ ప్రత్యేకతలు ఇవే

author img

By

Published : Jan 25, 2023, 4:50 PM IST

india-republic-day-celebration-2023

గణతంత్ర వేడుకలకు భారతావని సిద్ధమైంది. దేశ రాజధాని దిల్లీ ఇప్పటికే నిఘా నీడలోకి వెళ్లగా.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కనీవినీ ఎరుగని భద్రతా ఏర్పాటు చేశారు. రిపబ్లిక్ డే సందర్భంగా కర్తవ్యపథ్‌లో నిర్వహించే ఆర్మీ పరేడ్‌లో త్రివిధ దళాలు తమ సత్తాను ప్రపంచానికి చాటి చెప్పనున్నాయి. ఈసారి గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి.

దేశ రాజధాని దిల్లీ గణతంత్ర వేడుకలకు సిద్ధమైంది. కర్తవ్యపథ్‌లో నిర్వహించే ఆర్మీ డే పరేడ్‌తో భారత ఆయుధ సత్తాను ప్రపంచానికి చాటి చెప్పేందుకు త్రివిధ దళాలు సిద్ధమయ్యాయి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన యుద్ధ ట్యాంకులు ఈసారి పరేడ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఉదయం పదిన్నరకు పరేడ్‌.. విజయ్‌ చౌక్‌ వద్ద ప్రారంభమై ఎర్రకోట వరకు సాగుతుంది. ఈ ఏడాది కర్తవ్యపథ్‌లో జరిగే రిపబ్లిక్‌ డే కార్యక్రమంలో ఆత్మనిర్భర్‌ భారత్‌ ఆయుధాలను ప్రదర్శించనున్నారు. ఆయుధాలే కాకుండా ఆర్మీకి చెందిన నాలుగు బృందాలు, వాయుసేన, నేవీకి చెందిన ఒక్కో బృందం ఈ పరేడ్‌లో పాల్గొంటాయి.

ఈ ఏడాది రిపబ్లిక్‌ డే ఆర్మీ పరేడ్‌ ఎన్నో ప్రత్యేకతలకు నెలవు కానుంది. సంప్రదాయ 21 గన్‌ సెల్యూట్‌కు ఉపయోగించే పురాతన బ్రిటిష్‌ పౌండర్‌ గన్స్‌ను 105MMఇండియన్‌ ఫీల్డ్‌ గన్స్‌తో భర్తీ చేయనున్నారు. ఈజిప్ట్‌ నుంచి వచ్చిన ప్రత్యేక సైనిక పటాలం కూడా ఈ పరేడ్‌లో పాల్గొననుంది. ఈ పటాలంలో 120 మంది ఈజిప్ట్‌ సైనికులు ఉంటారు. కొత్తగా సైన్యంలో చేరిన అగ్నివీరులు ఈ పరేడ్‌లో భాగస్వాములు కానున్నారు. ఆర్మీ సిగ్నల్‌ కోర్‌, ఎయిర్‌ డిఫెన్స్‌, ఆర్మీ డేర్‌ డెవిల్స్‌ విభాగాల నుంచి మహిళా అధికారులు మార్చ్‌లో పాల్గొంటారు. ఆకాశ్‌ క్షిపణుల విభాగానికి లెఫ్టినెంట్‌ చేతన శర్మ నేతృత్వం వహిస్తారు. BSF క్యామెల్‌ కంటెజెంట్‌లోని మహిళా సభ్యులు ఈ వేడుకల్లో పాల్గొంటారు.

india-republic-day-celebration-2023
కర్తవ్యపథ్​లో ఆర్మీ పరేడ్ (పాత చిత్రం)

నారీశక్తి ప్రదర్శనలో భాగంగా నేవీలో 144 సెయిలర్స్‌ బృందానికి మహిళా అధికారిణులు నేతృత్వం వహించనున్నారు. ఈ పరేడ్‌ కోసం నేవీకి చెందిన IL38 విమానం చివరిసారిగా గాల్లోకి ఎగరనుంది. ఈ విమానం 42 ఏళ్లుగా నౌకాదళానికి సేవలు అందించింది. రిపబ్లిక్‌ డే ఫ్లై పాస్ట్‌లో మొత్తం 44 విమానాలు పాల్గొననున్నాయి. వీటిల్లో తొమ్మిది రఫేల్‌ జెట్‌ విమానాలు కూడా ఉండనున్నాయి. దేశీయంగా తయారు చేసిన తేలికపాటి అటాక్‌ హెలికాప్టర్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. 44 విమానాలు, యుద్ధ విమానాలతో వైమానిక దళం ఫ్లై పాస్ట్ జరుపుతుంది. తొలిసారిగా బీఎస్ఎఫ్ మహిళా ఒంటెల దళం రిపబ్లిక్ డే పరేడ్ లో భాగం కానుంది.

india-republic-day-celebration-2023
కర్తవ్యపథ్​లో ఆర్మీ పరేడ్ (పాత చిత్రం)

రిపబ్లిక్‌ డే వేడుకల్లో మొత్తం 16 మార్చింగ్ కంటింజెంట్లు పాల్లొంటాయి. వాటిలో 8 త్రివిధ దళాలకు చెందినవి. మిగిలినవి పారామిలీటరీ బలగాలు, దిల్లీ పోలీస్, ఎన్​సీసీ, ఎన్​ఎస్​ఎస్​ చెందిన కంటింజెంట్స్ ఉంటాయి. పరేడ్​లో వివిధ రాష్ట్రాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలు, సాయుధ బలగాలకు చెందిన 27 శకటాలు ప్రదర్శన చేస్తాయి. వందేభారతం కార్యక్రమంలో ఎంపికైన 475 మంది కళాకారులు వేడుకల్లో కళారూపాలు ప్రదర్శిస్తారు. బాల పురస్కార్ అవార్డులు పొందిన 25 మంది పరేడ్​లో పాల్గొంటారు. అదే విధంగా మురికి వాడల నుంచి వచ్చిన 11-18 ఏళ్ల వయస్సున్న 40 మంది పిల్లలు సైతం పరేడ్​లో పాల్గొంటారు. వీరంతా ట్రాఫిక్​ సిగ్నల్​ వద్ద బిక్షాటన చేసే పిల్లలు. చేతిలో బెగ్గర్​ టూ ఎడ్యుకేషన్​ అనే ప్లకార్డ్​తో వీరు పదర్శన చేస్తారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.