మరో విద్యుత్​ సంక్షోభం దిశగా భారత్​.. జులై- ఆగస్టులో చుక్కలే!

author img

By

Published : May 29, 2022, 3:57 PM IST

India heading towards another power crisis in July-August: Report

Power Crisis India: గతేడాది విద్యుత్​ సంక్షోభాన్ని ఎదుర్కొన్న భారత్​.. మరోసారి అలాంటి పరిస్థితులను చూడనుందా? తగినంత బొగ్గు ఉత్పత్తి జరుగుతున్నా.. థర్మల్​ పవర్​ ప్లాంట్లకు తరలించడంలో అధికారుల ఉదాసీనతే దీనికి కారణమా? అంటే అవుననే తెలుస్తోంది. నైరుతి రుతుపవనాలకు ముందు అప్రమత్తం కాకుంటే.. 2022 జులై- ఆగస్టులో మరో విద్యుత్​ సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని పరిశోధన సంస్థలు చెబుతున్నాయి.

Power Crisis India: భారత్​ జులై- ఆగస్టులో మరో విద్యుత్​ సంక్షోభం ఎదుర్కోనుందని అంచనా వేసింది పరిశోధన సంస్థ క్రియా (సీఆర్​ఈఏ- సెంటర్​ ఫర్​ రీసర్చ్​ ఆన్​ ఎనర్జీ అండ్​ క్లీన్​ ఎయిర్). థర్మల్​ పవర్​ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు తగ్గడమే దీనికి కారణమని పేర్కొంది.

దేశవ్యాప్తంగా అన్ని పవర్​ ప్లాంట్లలో కలిపి ప్రస్తుతం 20.7 మిలియన్​ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి. అయితే.. విద్యుత్​ డిమాండ్ కొంత పెరిగినా పరిష్కరించే స్థితిలో ప్రస్తుతం విద్యుత్​ ప్లాంట్లు లేవని, ఇవి సంక్షోభానికి సంకేతాలని క్రియా తన తాజా నివేదికలో స్పష్టం చేసింది.

2022 ఆగస్టులో భారత్​లో గరిష్ఠ విద్యుత్​ డిమాండ్​ 214 గిగా వాట్లు ఉంటుందని సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఆఫ్​ ఇండియా(సీఈఏ) అంచనా వేసింది. సగటు ఇంధన డిమాండ్​ కూడా మేలో ఉన్న 1,33,426 మిలియన్​ యూనిట్స్​ కంటే అధికంగా ఉంటుందని గణాంకాలు చెబుతున్నాయి.

'నైరుతి రుతుపవనాల ఆగమనం బొగ్గు తవ్వకాలకు, గనుల నుంచి విద్యుత్​ కేంద్రాలకు బొగ్గు రవాణాకు మరింత ఆటంకం కలిగిస్తోంది. రుతుపవనాలకు ముందే బొగ్గును తగిన స్థాయిలో రవాణా చేయకుంటే.. 2022 జులై- ఆగస్టులో దేశం మరో విద్యుత్​ సంక్షోభం వైపు పయనించే అవకాశం ఉంది.' అని క్రియా తన నివేదికలో స్పష్టం చేసింది.

దేశంలో ఇటీవల తలెత్తిన విద్యుత్​ సంక్షోభం కూడా బొగ్గు ఉత్పత్తి వల్ల కాదని, పంపిణీలో నిర్లక్ష్యం, అధికారుల ఉదాసీనత కారణమని పేర్కొంది. పెరుగుతున్న విద్యుత్​ డిమాండ్​కు తగ్గట్లుగా బొగ్గు రవాణా చేయట్లేదని, నిర్వహణ సరిపోట్లేదని అధికారిక గణాంకాల నుంచి స్పష్టమైనట్లు సీఆర్​ఈఏ తెలిపింది.

2021-22 భారత్​లో 777.26 మిలియన్​ టన్నుల బొగ్గు ఉత్పత్తి అయింది. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో(716.08 MT) పోలిస్తే 8.54 శాతం అధికం. అయితే ఈ పరిస్థితి ఇప్పటికిప్పుడు వచ్చింది కాదని, 2020 మే నుంచే క్రమంగా పవర్​ స్టేషన్లలో బొగ్గు నిల్వలు తగ్గుతూ వస్తున్నాయని క్రియా విశ్లేషకులు సునిల్​ దహియా పేర్కొన్నారు.

"నైరుతి రుతుపవనాల ప్రారంభానికి ముందు.. తగినంత బొగ్గు నిల్వ చేయకుండా పవర్​ ప్లాంట్​ ఆపరేటర్లు నిర్లక్ష్యంగా, ఉదాసీనంగా ఉండటమే గతేడాది విద్యుత్​ సంక్షోభానికి ప్రధాన కారణం. తర్వాత వరదలు బొగ్గు గనులను ముంచెత్తడం వల్ల.. ఉత్పత్తికి అంతరాయం కలిగింది. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు రవాణా చేయడంలో ఆటంకం కలిగింది.''

- సీఆర్​ఈఏ రిపోర్ట్​

ఇవీ చూడండి: ఏపీలో అనూహ్యంగా పెరిగిన విద్యుత్తు డిమాండు... వాయుదేవుడే దిక్కు!

తీవ్ర విద్యుత్​ సంక్షోభం.. 1100 ప్యాసింజర్‌ రైళ్లు రద్దు

పెరిగిన విద్యుత్ డిమాండ్.. అంధకారంలో పట్టణాలు, పల్లెలు !

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.