వేడెక్కిన రాజకీయం- చిన్న పార్టీలతోనే అసలు చిక్కులు

author img

By

Published : Jul 4, 2021, 5:01 PM IST

up assembly polls

చిన్నపార్టీల రాకతో ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. కుల, మత సమీకరణల కారణంగా ఎవరి ఓటు బ్యాంకుకు నష్టం జరుగుతుందో అని పలు ఊహాగానాలు వెలువడుతున్నాయి.

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడం, ప్రస్తుతం జరుగుతున్న జిల్లా పరిషత్‌ అధ్యక్షుల ఎన్నికలతో ఉత్తర్‌ప్రదేశ్‌లో రాజకీయాలు వేడెక్కాయి. వివిధ వర్గాలకు ప్రాతినిధ్యం వహించేలా చిన్న పార్టీలు ఏర్పాటవుతుండడం, ఇప్పటికే ఉన్న చిన్న పార్టీలు ఏకమవుతుండడం కీలక పరిణామం. దాంతో ఇవి ఏ ప్రధాన పార్టీ ఓటు బ్యాంకుకు నష్టం కలిగిస్తాయోనన్న విశ్లేషణలు మొదలయ్యాయి. ఆ పార్టీలకు ఇవి కలవరం కలిగిస్తున్నాయి. ఈ వారంలో జరిగిన పరిణామాలను పరిశీలిస్తే.. ఎస్సీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న భీమ్‌ ఆర్మీ వ్యవస్థాపకుడు చంద్రశేఖర్‌ తన రాజకీయ పార్టీ 'ఆజాద్‌ సమాజ్‌ పార్టీ' కార్యాలయాన్ని ప్రారంభించారు. భాజపా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సైకిల్‌ యాత్ర ప్రారంభించారు. ఇది ఈ నెల 21వరకు కొనసాగనుంది. భావ సారూప్యతగల పార్టీలతో పొత్తుకు సిద్ధమేనని సంకేతాలిచ్చారు.

నిషాద్‌ల ఏకీకరణకు యత్నాలు

ఇంతవరకు బిహార్‌కు పరిమితమైన వికాస్‌ ఇన్సాన్‌ పార్టీ (విఐపి) కూడా రంగంలో ఉండనుంది. బాలీవుడ్‌ డిజైనర్‌గా పేరుపొందిన ముఖేశ్‌ సాహ్నీ దీని అధ్యక్షుడు. నిషాద్‌లకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలన్నదే ఎన్నికల నినాదంగా ఉండనుంది. రాష్ట్రంలో 14 శాతం ఉన్న నిషాద్‌లను ఏకం చేయాలని ఆయన భావిస్తున్నారు. 75 వేల కన్నా ఎక్కువగా నిషాద్‌ల జనాభా ఉన్న నియోజకవర్గాలు 70 వరకు ఉన్నాయి. దాంతో ఏకంగా 150 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టాలని భావిస్తున్నారు. ఆయన కూడా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.

బందిపోటు రాణిగా పేరుపొందిన ఫూలన్‌దేవి ఒకప్పుడు నిషాద్‌లకు పెద్దదిక్కుగా ఉండేవారు. నిషాద్‌ల్లోని ఉపకులాలను ఏకం చేసి ఆమె సెంటిమెంట్‌ను ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. ఈ నెల 25న ఆమె వర్ధంతి సందర్భంగా ప్రతి జిల్లాలోనూ 'ఫూలన్‌దేవి జ్ఞాపకాలు' పేరిట కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన కార్యక్రమాన్ని గోరఖ్‌పుర్‌లో నిర్వహిస్తారు. ఇప్పటికే రాష్ట్రంలో నిషాద్‌ల నాయకునిగా డాక్టర్‌ సంజయ్‌ నిషాద్‌ గుర్తింపు పొందారు. సాహ్నీ రాకతో ఇద్దరి మధ్య సంబంధాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. ఈ పరిణామం ఏ పార్టీపై ఎలాంటి ప్రభావం చూపుతున్నదన్నది చర్చనీయాంశమైంది. ఇంతవరకు నిషాద్‌ల మద్దతు అన్ని పార్టీలకూ లభిస్తుండడం గమనార్హం.

రంగంలోకి ఆమ్‌ ఆద్మీ

తాజాగా ఆమ్‌ ఆద్మీ పార్టీ యూపీపై ఆసక్తి చూపుతోంది. ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్‌ సింగ్‌ ఇటీవల ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌తో భేటీ అయ్యారు. రెండు పార్టీల మధ్య ఎలాంటి సైద్ధాంతిక విభేదాలు లేకపోవడం, భాజపా వ్యతిరేకతే ఏకైక లక్ష్యం కావడం వల్ల రెండింటి మధ్య పొత్తు కుదురుతుందన్న ఊహాగానాలు వ్యాపించాయి. భాజపాను కట్టడి చేసేందుకు చిన్న పార్టీలతో కలిసి పనిచేస్తామని అఖిలేశ్‌ ప్రకటించిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం లభించింది.

కూటమి ఏర్పాటు

బిహార్‌లో 20 స్థానాల్లో పోటీ చేసి అయిదు చోట్ల గెలుపొందిన ఎంఐఎం ఉత్తర్‌ప్రదేశ్‌పై గురిపెట్టింది. 100 సీట్లలో పోటీ చేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ ప్రకటించారు. అభ్యర్థుల ఎంపిక కోసం ఇప్పటికే దరఖాస్తులు ఇవ్వడం ప్రారంభించారు. షెడ్యూల్డ్‌ భారతీయ సమాజ్‌ వాదీ (ఎస్‌బీఎస్‌పీ), చిన్న పార్టీల కూటమైన భాగీదార్‌ సంకల్ప్‌ మోర్చాతో కలిసి పనిచేస్తామని ఆయన ప్రకటించారు. సుహల్దేవ్‌ భారతీయ సమాజ్‌పార్టీ అధ్యక్షుడు ఓంప్రకాష్‌ రాజ్‌భర్‌ పలు చిన్న పార్టీలతో భాగీదరి సంకల్ప్‌ మోర్చా ఏర్పాటు చేశారు. ఈ పార్టీల పొత్తు కారణంగా పలు జిల్లాలో బలంగా ఉన్న ముస్లింలు, ఇతర వర్గాలు కలిస్తే దాని ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఇంతవరకు ముస్లిం ఓట్లు ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్‌లకు పడుతుండగా, ఎంఐఎం రాకతో వాటికి నష్టం జరిగే అవకాశం ఉంది. దీనిపైనే రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి.

ఇదీ చూడండి: UP: 'స్థానికం'లో భాజపా దూకుడు.. అఖిలేశ్‌కు షాక్‌!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.