Covaxin: 'కొవాగ్జిన్ టీకా వెనుక.. 20 కోతులు'

author img

By

Published : Nov 15, 2021, 6:44 AM IST

covaxin

కొవాగ్జిన్​ టీకా(Covaxin Vaccine) రూపకల్పనలో భారత శాస్త్రవేత్తలకు కోతులు ఉపయోగపడ్డాయని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ(Balram Bhargava News) అంటున్నారు. "గోయింగ్‌ వైరల్‌.. మేకింగ్‌ ఆఫ్‌ కొవాగ్జిన్‌ ఇన్‌సైడ్‌ స్టోరీ" అనే పుస్తకాన్ని రాసిన ఆయన.. రీసస్‌ జాతికి చెందిన 20 వానరాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.

నాడు లంకను చేరడానికి రాముడికి వానరసేన సాయం చేసింది. నేడు స్వదేశీ టీకా 'కొవాగ్జిన్‌'(Covaxin Vaccine) రూపకల్పనలోనూ భారత శాస్త్రవేత్తలకు ఆ వానరాలే అండగా నిలిచాయి. అవే లేకపోతే ఈ రోజు లక్షల ప్రాణాలు నిలిచేవి కావని భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ బలరాం భార్గవ(Balram Bhargava News) అంటున్నారు. భారత్‌ స్వదేశీ వ్యాక్సిన్‌ 'కొవాగ్జిన్‌' ప్రయాణంపై ఆయన "గోయింగ్‌ వైరల్‌.. మేకింగ్‌ ఆఫ్‌ కొవాగ్జిన్‌ ఇన్‌సైడ్‌ స్టోరీ" అనే పుస్తకాన్ని రాశారు. ఇందులో రీసస్‌ జాతికి చెందిన 20 వానరాల గురించి ప్రత్యేకంగా భార్గవ ప్రస్తావించారు. కొవాగ్జిన్‌ విజయగాథలో హీరోలు.. మనుషులు మాత్రమే కాదని, కోతులూ ఉన్నాయని తెలిపారు. వాటిని ఎంత పొగిడినా తక్కువేనంటూ, రీసస్‌ జాతి వానరాలను పట్టుకోవడానికి శాస్త్రవేత్తలు పడిన తంటాలను.. ఆ ప్రయాణంలో ఎదురైన సవాళ్లను తన పుస్తకంలో వివరించారు.

"వ్యాక్సిన్‌ చిన్న జంతువుల్లో యాంటీబాడీస్‌ ఉత్పత్తి చేయగలదని తెలిసిన తర్వాత, తదుపరి దశ కోతుల వంటి పెద్ద జంతువులపై పరీక్షించడం. ఎందుకంటే వాటి శరీర నిర్మాణం, రోగ నిరోధక వ్యవస్థలు మానవులకు దగ్గరగా ఉంటాయి" అని భార్గవ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా వైద్య పరిశోధనల్లో రీసస్‌ కోతులనే ఉపయోగిస్తారు. వీటిని చైనా నుంచి చాలా దేశాలు దిగుమతి చేసుకుంటాయి. కొవిడ్‌-19 సమయంలో ఆ దిగుమతులు ఆగిపోవడంతో కోతులను ఎక్కడి నుంచి తేవాలన్న ఆందోళన భారత శాస్త్రవేత్తల్లో మొదలైంది. దీంతో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ఐవీ) పరిశోధకులు దేశవ్యాప్తంగా జంతు ప్రదర్శనశాలలను, వివిధ సంస్థలను సంప్రదించారు. వారి ప్రయత్నాలు ఫలించలేదు.

"ఎక్కువ రోగనిరోధక శక్తి ఉన్న యువ కోతులు కావాలి. ఎన్‌ఐవీ దగ్గర వయసు మళ్లినవి ఉన్నాయి. అవి ప్రయోగాలకు పనికిరావు. దీంతో ఐసీఎంఆర్‌-ఎన్‌ఐవీకి చెందిన ప్రత్యేక బృందం రీసస్‌ కోతులను వెతికేందుకు మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలకు వెళ్లింది. లాక్‌డౌన్‌ కారణంగా గ్రామాల్లో ఆహార వనరులును లేకపోవడంతో కోతులు అడవుల్లోకి వెళ్లిపోయాయి. దీంతో వీటిని పట్టుకోవటానికి మహారాష్ట్ర అటవీ విభాగం సాయం చేసింది. రోజుల తరబడి వేల చదరపు కిలోమీటర్లు గాలించి.. చివరకు రీసస్‌ కోతులను నాగ్‌పుర్‌ దగ్గర గుర్తించాం" అని పుస్తకంలో భార్గవ తెలిపారు. అయితే ఆ తర్వాత శాస్త్రవేత్తలకు ఇంకో పెద్ద సవాల్‌ ఎదురైంది. మనుషుల నుంచి సార్స్‌-కొవ్‌-2 సోకకుండా వాటిని రక్షించడం. "కోతుల సంరక్షకులకు, పశువైద్యులకు, పారిశుద్ధ్య సిబ్బందికి ఎప్పటికప్పుడు కొవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తూ జాగ్రత్తలు తీసుకున్నాం" అని భార్గవ తెలిపారు. చివరకు కథ సుఖాంతమైందని, ప్రయోగాలు విజయవంతమయ్యాయని, అయితే ఈ ప్రయాణంలో కోతులు పోషించిన పాత్రను ఎంత ప్రశంసించినా తక్కువనేని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

Covaxin: కొవాగ్జిన్‌తో 77.8 శాతం రక్షణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.