చల్లటి కబురు​.. దేశంలో ముగిసిన హీట్​వేవ్​.. మూడు రోజులు వర్షాలే వర్షాలు!

author img

By

Published : May 24, 2023, 8:14 PM IST

Updated : May 24, 2023, 8:39 PM IST

heatwave has ended in the country temperature will decrease from Wednesday onwards said by imd

వేసవి తాపంతో అనేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు గుడ్​న్యూస్​. దేశంలో హీట్​ వేవ్​ ముగిసిందని, ఇక ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని చెప్పింది.

గత కొద్దిరోజులుగా సూర్యుడి ప్రతాపంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న దేశ ప్రజలకు భారత వాతావరణ విభాగం శుభవార్త చెప్పింది. దేశంలో హీట్​ వేవ్​ ముగిసిందని తెలిపింది. బుధవారం నుంచే ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని పేర్కొంది.
"దేశంలో హీట్​ వేవ్​ ముగిసింది. బుధవారం నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయి. రాజస్థాన్, పంజాబ్, దిల్లీ, ఉత్తర్​ప్రదేశ్, హరియాణా, చండీగఢ్‌లో తుఫాను సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే ఆ రాష్ట్రాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశాం. రాబోయే 2-3 రోజుల పాటు కొండ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది" అని IMD శాస్త్రవేత్త ఆర్‌కే జెనామణి తెలిపారు. పశ్చిమ హిమాలయ ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మే 24,25,26 తేదీల్లో దేశవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.

అయితే దేశ రాజధాని దిల్లీలో ఉష్ణోగ్రతలు.. గురువారం 35 డిగ్రీలకు తగ్గే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. జూన్ 30 వరకు సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. మంగళవారం దిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో దిల్లీ వాసులు.. భారీగా 6,916 మెగావాట్ల విద్యుత్​ను వాడేశారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఇదే అత్యధిక వాడకమని అధికారులు తెలిపారు. దిల్లీలో గత వేసవిలో గరిష్ఠంగా 7,695 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైందని.. ఈ ఏడాది అది 8,100 మెగావాట్లకు చేరుకోవచ్చని వారు తెలిపారు.

2100 నాటికి అధిక వేడితో భారత్‌లో బతకలేమా?
2100 నాటికి భారత్‌, ఇండోనేసియా, నైజీరియా దేశాలలోని కొన్ని ప్రాంతాలలో అధిక వేడి వల్ల ప్రజలు నివసించలేని పరిస్థితులు తలెత్తుతాయని చైనా, ఐరోపా శాస్త్రవేత్తలు చేసిన ఉమ్మడి పరిశోధనల్లో తేలింది. ఈ శతాబ్దం చివరి నాటికి సగటు ఉష్ణోగ్రత పెరుగుదల 2.7 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. దీంతో 200 కోట్ల మంది ప్రజలు ప్రాణాంతకమైన వాతావరణ పరిస్థితుల్లో జీవిస్తారని హెచ్చరించారు.

విపరీతమైన వేడి వల్ల ఉపాధి కోల్పోయి.. మానవుడి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తలు తమ నివేదికలో పేర్కొన్నారు. ఐరోపాలో కూడా పొడి వాతావరణం నెలకొంటుందని ప్రొఫెసర్‌ టిమ్ లెన్‌టన్‌ తెలిపారు. అధిక వేడి వాతావరణంలో ఒక శాతం జనాభా మాత్రమే నివసించేవారని గతంలో అంచనాలు ఉండగా వాతావరణ మార్పులు దాన్ని పూర్తిగా మార్చివేశాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ప్రస్తుతం 9 శాతం మంది ప్రజలు అధిక వేడితో ఇబ్బందులు పడుతున్నారని టిమ్‌ పేర్కొన్నారు.

Last Updated :May 24, 2023, 8:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.