గుజరాత్ త్రిముఖం: సెంటిమెంట్​తో మోదీ.. రాజస్థాన్ మోడల్​తో కాంగ్రెస్.. తాయిలాలతో ఆప్!

author img

By

Published : Nov 24, 2022, 3:03 PM IST

gujrat assembly elections

గుజరాత్‌ శాసనసభ ఎన్నికల్లో ఈసారి త్రిముఖ పోటీ నెలకొంది. 27ఏళ్ల నుంచి అప్రతిహతంగా అధికారంలో కొనసాగుతున్న భాజపా మునుపెన్నడూ లేనంత గట్టి పోటీ ఎదుర్కొంటోంది. ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొనేందుకు అభివృద్ధి నినాదంతోపాటు ప్రధాని మోదీ స్థానిక కార్డు ప్రయోగిస్తున్నారు. గత ఎన్నికల్లో అధికారానికి చేరువగా వచ్చిన కాంగ్రెస్‌.. రాజస్థాన్‌ నమూనాతో, ఆమ్‌ఆద్మీ పార్టీ.. దిల్లీ మోడల్‌లో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ప్రధానపార్టీలు వివిధ అంశాల ప్రతిపాదికన ఓటర్లను ఆకట్టుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి.

గుజరాత్‌ శాసనసభ ఎన్నికల ప్రచారం పతాకస్థాయికి చేరింది. తొలిదశ పోలింగ్‌కు ముందే....ప్రధాని నరేంద్ర మోదీ మూడు విడతల ప్రచారం నిర్వహించారు. పలు జిల్లాల్లో జరిగిన ప్రచారసభలు, ర్యాలీల్లో పాల్గొన్నారు. రాహుల్‌గాంధీ కూడా 2సార్లు గుజరాత్‌లో పర్యటించారు. ఆప్‌ ప్రవేశంతో ఈసారి త్రిముఖ పోటీ నెలకొన్నప్పటికీ భారతీయ జనతా పార్టీ తన ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా కాంగ్రెస్‌ లక్ష్యంగా ఆరోపణలు చేస్తోంది. గత ఎన్నికల్లో గట్టిపోటీ ఇచ్చిన హస్తం పార్టీ... ఈసారి ఎలాగైన గుజరాత్‌ పగ్గాలు చేపట్టాలని సర్వశక్తులు ఒడ్డుతోంది. భాజపా, ఆప్‌లను లక్ష్యంగా చేసుకొని ప్రచారం నిర్వహిస్తోంది. భాజపాకు తామే పోటీ అని చెప్పుకొంటున్న ఆప్‌... దిల్లీ తరహాలో ఉచిత విద్యుత్‌, విద్య, వైద్యం అంశాలను ప్రచారంలో ప్రస్తావిస్తోంది. ఆప్‌ నేతలు కాంగ్రెస్‌, కమలం పార్టీ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు.

మోదీ సెంటిమెంట్ కార్డ్..
గుజరాత్‌లో 27ఏళ్ల నుంచి అప్రతిహతంగా అధికారంలో కొనసాగుతున్న భాజపా... ప్రభుత్వ వ్యతిరేక ఓటును అధిగమించేందుకు ఈసారి కూడా అభివృద్ధి నినాదాన్ని నమ్ముకుంది. అలాగే ఆ పార్టీ స్టార్‌ క్యాంపెయినర్‌ ప్రధాని మోదీ... తన ప్రచారంలో గుజరాత్‌ అభివృద్ధితోపాటు భావోద్వేగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. సెంట్‌మెంటు కార్డ్‌తో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తన హయాంలో జరిగిన గుజరాత్‌ అభివృద్ధిని వివరిస్తున్నారు. గుజరాత్‌లో ఓటు అడిగే హక్కు భాజపాకు మాత్రమే ఉందని, అందువల్ల కమలంగుర్తుకే ఓటు వేయాలని ప్రధాని మోదీ తన ప్రచార సభల్లో ప్రజలకు పిలుపునిస్తున్నారు. ప్రజలకు సమాధానం చెప్పేందుకే గుజరాత్‌లో ప్రచారం చేస్తున్నట్లు చెబుతున్నారు. గుజరాత్‌ ఓటు దేశంతోపాటు భూగ్రహంపై ప్రభావం చూపుతుందని సెంటిమెంటుకార్డ్‌ ప్రయోగిస్తున్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మధుసూదన్‌ మిస్త్రీ చేసిన వ్యాఖ్యలను కూడా.. ప్రధాని మోదీ తన ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. సాధారణ కుటుంబానికి చెందిన తనకు ఎలాంటి హోదాలేదని, కాంగ్రెస్‌ తనను నీచుడు, మృత్యుబేహారీ అని తూలనాడినట్లు గుర్తుచేస్తున్నారు. కేంద్రహోంమంత్రి అమిత్‌ షాసహా ఇతర భాజపా నేతలు తమ ప్రచారంలో అభివృద్ధి అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు.

కాంగ్రెస్ రాజస్థాన్ మోడల్
గత ఎన్నికల్లో కొద్దిలో అధికారానికి దూరమైన కాంగ్రెస్‌.. ఈసారి ఎలాగైన గుజరాత్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రచారం నిర్వహిస్తోంది. రాజస్థాన్‌ మోడల్‌ అభివృద్ధి ప్రధానంగా ప్రస్తావిస్తోంది. తాము అధికారంలోకి వస్తే... రాజస్థాన్‌ ప్రజలకు అందుతున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలను గుజరాత్‌లోను అమలు చేయనున్నట్లు గుజరాత్‌ కాంగ్రెస్‌ బాధ్యుడు రఘుశర్మ, రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌ హామీ ఇస్తున్నారు. రాహుల్‌గాంధీ కూడా తన రెండు విడతల ప్రచారంలో ఎనిమిది హామీలు ఇచ్చారు. అభివృద్ధి ఫలాలు కేవలం 5 నుంచి 25మంది వ్యాపారవేత్తలకు మాత్రమే అందుతున్నట్లు రాహుల్‌ ఆరోపించారు. మోదీ సర్కార్‌ది ప్రచార ఆర్భాటం తప్ప ప్రజల గురించి పట్టించుకోవటం లేదని కాంగ్రెస్‌ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

ఆప్ సైతం..
పంజాబ్‌ తరహాలోనే గుజరాత్‌లోనూ పాగా వేసేందుకు ఆమ్‌ ఆద్మీ పార్టీసర్వశక్తులు ఒడ్డుతోంది. దిల్లీ మోడల్‌ అభివృద్ధితోపాటు ఉచిత హామీలతో ఉద్ధృతంగా ప్రచారం నిర్వహిస్తోంది. ఎన్నికలనోటిఫికేషన్‌కు ముందే ఆప్‌ జాతీయ సమన్వయకర్త కేజ్రీవాల్‌... ముందస్తు ప్రచారంతో గుజరాత్‌ను ఓ విడతచుట్టేశారు. దిల్లీ, పంజాబ్‌ తరహాలో 300యూనిట్ల ఉచిత విద్యుత్తు హామీతో గుజరాత్‌ ఓటర్లను ఆకర్షించాలని ఆప్‌ భావిస్తోంది. ప్రభుత్వ పాఠశాలలను అద్భుతంగా అభివృద్ధి చేసి ఉచిత విద్య అందించనున్నట్లు ఆప్‌ నేతలు ప్రచారం చేస్తున్నారు. కార్పోరేట్‌కు దీటుగా ప్రభుత్వాస్పత్రులను అభివృద్ధి చేసి ఉచిత వైద్యం అందించనున్నట్లు హామీ ఇస్తున్నారు. 27ఏళ్లు అధికారంలో ఉన్న భాజపా... అవేవీ చేయలేకపోయిందని ఆప్‌ నేతలు తమ ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు.

తాము అధికారం చేపట్టిన వెంటనే పాత పింఛన్‌ విధానాన్ని పునరుద్ధరించనున్నట్లు ఆప్‌ నేతలుహామీ ఇస్తున్నారు. భాజపాకు 27ఏళ్లు అవకాశం ఇచ్చినందున తమకు ఐదేళ్లు అవకాశం ఇస్తే గుజరాత్‌ను సమూలంగా అభివృద్ధి చేయనున్నట్లు ఆప్‌ నేతలు పేర్కొంటున్నారు. మార్పు అనివార్యమని సూచిస్తున్నారు. అయితే గుజరాత్‌ ఓటర్లు మరోసారి భాజపాకే అధికారం అప్పగిస్తారా లేక మార్పు ఓటేస్తారా అన్నది వేచి చూడాలి.

ఇదీ చదవండి: అంతా తానై గుజరాత్‌లో మోదీ ప్రచారం.. రికార్డు స్థాయి విజయం సాధించడమే వ్యూహమా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.