గుజరాత్​ ఎన్నికలు.. పటేల్​ ఓటు.. ఈసారి ఎటు?

author img

By

Published : Nov 22, 2022, 6:38 AM IST

patels role in casting gujarat votes

గుజరాత్‌లో ఎన్నికలంటే చాలు అందరి దృష్టినీ ఆకర్షించే వర్గం పాటీదార్లు! పటేల్‌లుగా పిలిచే వీరికి అన్ని పార్టీలూ పెద్దపీట వేస్తుంటాయి. వీరి ఆగ్రహం, అనుగ్రహాలపైనే రాష్ట్రంలో అధికారం ఆధారపడి ఉంటుందనుకుంటుంటాయి. 2017 ఎన్నికల్లో కమలనాథులను భయపెట్టింది ఈ పటేళ్లే! ఇంతకూ ఎవరీ పటేళ్లు? గుజరాత్‌లో వారి హవా ఎంత? ఈసారి వారి దారెటు?

Gujarat Elections 2022 Patels: గుజరాత్‌ జనాభాలో పాటీదార్ల సంఖ్య సుమారు 15 శాతం. రాష్ట్రంలో చాలామటుకు వ్యవసాయ భూమి వీరిచేతుల్లోనే ఉందంటారు. సౌరాష్ట్ర ప్రాంతంలో వేరుశనగ, పత్తిలాంటి వాణిజ్య పంటలతో పటేళ్లు ఆర్థికంగా పుంజుకున్నారు. క్రమంగా ఇత్తడి, సిరామిక్‌, వజ్రాలు, ఆటోమొబైల్‌, ఫార్మాలాంటి వ్యాపారాల్లోకీ ప్రవేశించి.. గుజరాత్‌లోని ఇతర ప్రాంతాలకూ విస్తరించారు. సహకార సంస్థలూ వీరి కనుసన్నల్లోకి వచ్చేశాయి. వీటన్నింటితో పాటు స్వామి నారాయణ్‌ ఆధ్యాత్మిక సంస్థలో, ఎన్‌ఆర్‌ఐల్లోనూ పాటీదార్లే భారీగా ఉంటారు.

ఆణంద్‌, ఖేడా, మెహ్‌సనా, పటాన్‌, అహ్మదాబాద్‌, సౌరాష్ట్ర ప్రాంతంలో రాజ్‌కోట్‌, అమ్రేలి, మోర్బీ జిల్లాల్లో వీరి ప్రాబల్యం ఎక్కువ. సూరత్‌ నగరంలో నాలుగు సీట్లను వీరు ప్రభావితం చేయగలరు. 182 సీట్ల అసెంబ్లీలో 50 చోట్ల వీరి ఓట్లు అత్యంత కీలకంగా చెబుతారు. మరో 40 సీట్లను ప్రభావితం చేస్తారనేది పార్టీల అంచనా! 50 నియోజకవర్గాల్లో పాటీదార్‌ ఓట్లు 20 శాతం పైగా ఉన్నాయి. అందుకే ఎన్నికల్లో పార్టీలన్నీ వీరిని ఆకట్టుకోవటానికి ప్రయత్నిస్తుంటాయి.

1990 నుంచి పాటీదార్లు భాజపాకు మద్దతుగా నిలిచారు. కాంగ్రెస్‌ పార్టీ క్షత్రియ, హరిజన్‌, ఆదివాసీ, ముస్లిం (ఖామ్‌) ఓట్లపై ఆధారపడటం ఆరంభించినప్పటి నుంచి పాటీదార్లు భాజపావైపు మొగ్గడం ప్రారంభించారు. అయితే తమకు ఓబీసీల తరహాలో విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కావాలంటూ పాటీదార్లు ఆందోళనకు దిగారు. 2007లోనే నరేంద్రమోదీకి వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రి కేశూభాయ్‌ పటేల్‌ ‘సర్దార్‌ పటేల్‌ ఉత్కర్ష్‌ సమితి’ని ఏర్పాటుచేశారు. ఆ తర్వాత పటేళ్ల సారథ్యంలో గుజరాత్‌ పరివర్తన్‌ పార్టీ వచ్చింది.

చివరకు 2015లో పాటీదార్‌ అనామత్‌ ఆందోళన్‌ సమితి (పాస్‌) పేరుతో హార్దిక్‌ పటేల్‌ సారథ్యంలో ఈ ఉద్యమం కొనసాగింది. ఈ ఉద్యమాన్ని భాజపా ప్రభుత్వం అణచివేసింది. పోలీసు కాల్పుల్లో అనేకమంది పాటీదార్‌ యువకులు చనిపోయారు. దీంతో పటేళ్లకు, భాజపాకు మధ్య అంతరం పెరిగింది. 2017 ఎన్నికల్లో ఆ ప్రభావం స్పష్టంగా కనిపించింది. అతికష్టం మీద అధికారాన్ని నిలబెట్టుకున్నా... ఎప్పుడూ మూడంకెల సీట్లు దాటే భాజపా 99కే పరిమితమైంది. పాటీదార్ల మద్దతు కారణంగా నాడు కాంగ్రెస్‌ సీట్లు 77కు పెరిగాయి.

ఇప్పుడు భాజపా దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్ల రూపంలో పటేల్‌లకు సాయం అందుతుందని భాజపా ప్రచారం చేస్తోంది. దానికి తోడు.. 2015లో ఆందోళన చేసిన హార్దిక్‌ పటేల్‌ను భాజపా తమ పార్టీలో చేర్చుకొని ఈసారి సీటిచ్చింది. పటేల్‌ల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు కొవిడ్‌ అనంతరం ముఖ్యమంత్రి రూపాణీని మార్చి... భూపేంద్ర పటేల్‌కు పగ్గాలు అప్పగించింది. ఈ చర్యలన్నీ పాటీదార్లను తిరిగి తమవైపు మొగ్గు చూపేలా చేస్తాయనేది కమలనాథుల ఆశ. కాంగ్రెస్‌ కూడా 2017నాటి మద్దతు కొనసాగుతుందని ఆశిస్తోంది.

తొలిసారి గుజరాత్‌ను ఊడ్చేయాలని ఉవ్విళ్లూరుతున్న ఆమ్‌ ఆద్మీపార్టీ కూడా పాటీదార్లను బుట్టలో వేసుకోవటానికి యత్నిస్తోంది. పాటీదార్లకు రాష్ట్రంలో కొత్త వేదికగా ఎదగాలన్నది ఆప్‌ ఎత్తుగడ. అందుకే భాజపా, కాంగ్రెస్‌లకంటే ఎక్కువగా పటేళ్లకు సీట్లిచ్చింది. భాజపా 45 మందికి, కాంగ్రెస్‌ 42 మందికి ఇవ్వగా.. ఆప్‌ 46 మంది పాటీదార్లను రంగంలోకి దించింది. వీరిలో 2015 నాటి ఉద్యమ నాయకులు ఎక్కువగా ఉన్నారు.

హార్దిక్‌ నెగ్గేనా?
గత ఎన్నికల్లో భాజపాపై తీవ్ర విమర్శలు గుప్పించిన పాటీదార్‌ నేత హార్దిక్‌ పటేల్‌ ఈసారి అదే పార్టీ టికెట్‌పై విరామ్‌గావ్‌ నుంచి పోటీ చేస్తున్నారు. స్థానికుడైన హార్దిక్‌కు కాంగ్రెస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే లఖభాయ్‌ భార్వాడ్‌ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. 3లక్షల ఓటర్లున్న నియోజకవర్గంలో ఓబీసీలవి 65 వేలు, పాటీదార్లు 50వేల ఓట్లున్నాయి. దళితులు 35వేలు, భార్వాడ్‌ వర్గానికి 20వేలు, ముస్లింలు 20వేలు, కోలిలు 18వేలు, రాజ్‌పుత్‌లు 10వేలున్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేపై వ్యతిరేకత, పాటీదార్ల మద్దతు తనకు లాభిస్తుందని హార్దిక్‌ భావిస్తున్నారు. ఆప్‌ ఓబీసీని నిలబెట్టింది. అయితే... మరో బలమైన ఓబీసీ అభ్యర్థి స్వతంత్రుడిగా బరిలో ఉన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.