గర్భిణీపై గ్యాంగ్​రేప్, పోలీసుల వేధింపులకు తాళలేక వ్యక్తి ఆత్మహత్య

author img

By

Published : Aug 19, 2022, 10:52 PM IST

rape

గర్భిణీపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు నలుగురు కామాంధులు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది. మరోవైపు లంచం ఇవ్వమని పోలీసులు వేధించడం వల్ల ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణం అసోంలో జరిగింది.

ఉత్తర్​ప్రదేశ్​ ​ఫరూఖాబాద్​లో దారుణం జరిగింది. నిండు గర్భిణీపై నలుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఫరూఖాబాద్ బస్టాండ్ సమీపంలో మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. బాధితురాల్ని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫరూఖాబాద్ బస్టాండ్ సమీపంలో ఉన్న గర్భిణీని నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అనంతరం ఆమెను ఓ గదిలో బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నాలుగు రోజులపాటు నిందితుల చేతిలో చిత్రహింసలు అనుభవించిన బాధితురాలు వారి నుంచి తప్పించుకుని.. 12 కిలోమీటర్లు నడిచి ఓ గ్రామానికి చేరుకుంది. గ్రామస్థులకు తనపై జరిగిన అఘాయిత్యం గురించి తెలిపింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం బాధితురాలికి వైద్య పరీక్షలు నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

"ఆగస్టు 16న బరేలీ నుంచి బస్సులో బయలుదేరి ఫరూఖాబాద్​ వచ్చాను. సాయంత్రం 6 గంటల సమయంలో నలుగురు యువకులు నా దగ్గరకు వచ్చి బలవంతంగా లాక్కెళ్లిపోయారు. ఓ గదిలో బంధించి నాపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. స్పృహ తప్పి పడిపోయా. నేను గర్భవతిని నన్ను వదిలేయండి అని ప్రాధేయపడినా కనికరించలేదు. నిందితులు నిద్రపోతుండగా వారి నుంచి తప్పించుకున్నా. 12 కిలోమీటర్లు నడిచి గ్రామస్థులకు జరిగిందంతా చెప్పా. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశా"

-బాధితురాలు

పోలీసులు వేధింపులు తట్టుకోలేక..: అసోం.. కామరూప్​లో దారుణం జరిగింది. పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం రాత్రి భువనేశ్వర్ పాల్​ తన భార్యతో గొడవపడ్డాడు. ఆ తర్వాత అతని భార్య అమిన్​​గావ్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. భార్య సమక్షంలో రాజీ కుదిర్చుకునేందుకు పోలీస్ స్టేషన్​కు భువనేశ్వర్​ను పిలిపించారు అమిన్​గావ్ పోలీసులు. భార్యాభర్తలు మధ్య గొడవ సద్దుమణిగినప్పటికీ పోలీసులు భువనేశ్వర్​ను డబ్బులు కోసం వేధించారు. రూ.40 వేలు ఇవ్వాలని లేదంటే జైలుకు పంపుతామని బెదిరించారు. అంత డబ్బు ఇచ్చే స్థోమత తనకు లేదని భువనేశ్వర్​ బతిమాలినా పోలీసులు ఒప్పుకోలేదు. తీవ్ర మనస్తాపానికి గురైన భువనేశ్వర్​ ఇంట్లోనే ఉరి వేసుకుని చనిపోయాడు.

ఇవీ చదవండి: సిసోదియా మనిషికి రూ.కోటి లంచం, ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ

సీఎం హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.