Azadi Ka Amrit Mahotsav: గాంధీ గూగ్లీకి ఆ ఐపీఎల్‌ క్లీన్‌బౌల్డ్‌

author img

By

Published : Oct 12, 2021, 8:01 AM IST

Azadi Ka Amrit Mahotsav

జాతీయోద్యమాన్నే కాదు... భారత్‌లో నేడు మనం చూస్తున్న క్రికెట్‌ పరిణామ క్రమాన్నీ మార్చారు గాంధీజీ! పైకి ప్రజాకర్షణీయంగా కన్పించినా... బ్రిటిష్‌వారి కుటిలనీతి దాగిన నేపథ్యంలో ఆనాటి ఐపీఎల్‌లాంటి అత్యంత ఆదరణగల క్రికెట్‌ టోర్నీని ఆపించేశారాయన! (Cricket in British India)

బ్రిటిష్‌వారితో పాటు భారత్‌లో అడుగు పెట్టిన క్రికెట్‌కు (Cricket in British India) ముంబయిలో మంచి ఆదరణ లభించింది. తెల్లవారికి దీటుగా భారతీయులూ క్రికెట్‌ నేర్చుకున్నారు. దీంతో తొలుత తమలోతామే ఆడుకున్న ఆంగ్లేయులు ఆ తర్వాత భారతీయులతోనూ ఆడేందుకు సిద్ధమయ్యారు. అయితే, మతాల వారీగా జట్లను ప్రోత్సహించారు ఆంగ్లేయులు! ఫలితంగా యూరోపియన్లు, పార్సీలు, హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, బౌద్ధుల పేరిట జట్లు వెలిశాయి. ఈ జట్ల మధ్య ఏటా ముంబయిలో ఓ టోర్నీ (పెంటాంగ్యులర్‌) జరిగేది. 1892లో ఆరంభమైన ఈ టోర్నీకి అప్పట్లో ఇప్పటి ఐపీఎల్‌ అంతటి ఆదరణ ఉండేది. మ్యాచ్‌కు 25వేల మంది ప్రేక్షకులు హాజరయ్యేవారు. ఈ టోర్నీలో రాణించిన ఆటగాళ్ల పేర్లు దేశవ్యాప్తంగా మారుమోగేవి.

మతాల వారీగా ఆటగాళ్లు పోటీపడ్డా... మొదట్లో ఆ ప్రభావం అంతగా ఉండేది కాదు. కానీ మారుతున్న దేశ రాజకీయ, సామాజిక, జాతీయోద్యమ ప్రభావం ఈ టోర్నీపైనా పడటం ఆరంభమైంది. ముఖ్యంగా... 1930 తర్వాత మతాల ఆధారంగా సాగుతున్న ఈ టోర్నీని రద్దు చేయాలనే డిమాండ్‌ మొదలైంది. రెండో ప్రపంచ యుద్ధ మేఘాలు ఆవరించిన 1940లో (Cricket during World War 2) టోర్నీ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. టోర్నీని రద్దు చేయాలనే డిమాండ్‌ పెరిగింది. క్రీడాకారుల్లోనూ భిన్నమైన వాదనలు వినిపించసాగాయి. ఈ పరిస్థితుల్లో గాంధీజీ సలహా తీసుకోవాలని నిర్ణయించారు హిందూ జింఖానా నిర్వాహకులు. (Gandhi British raj)

గాంధీ సైతం క్రికెటరే..

క్రికెట్‌తో గాంధీజీకి ఏం సంబంధం అనేవారూ లేకపోలేదు. కానీ గాంధీజీ కూడా ఒకప్పుడు క్రికెటరే! (Gandhi Cricket player) చిన్నప్పుడు రాజ్‌కోట్‌లో ఆయన చదువుకున్నప్పుడు పాఠశాలలో క్రికెట్‌, వ్యాయామం తప్పనిసరిగా ఉండేవి. వ్యాయామం అంటే అంతగా ఇష్టపడని గాంధీజీ క్రికెట్‌ మాత్రం బాగానే ఆడేవారని ఆయన చిన్ననాటి పాఠశాల స్నేహితుడు రతిలాల్‌గేలాభాయ్‌ మెహతా గుర్తు చేసుకునేవారు. అంపైరింగ్‌ అంటే కూడా చాలా ఇష్టపడేవారట! ఇప్పుడు సరిగ్గా ఆ అంపైరింగ్‌నే నిర్వర్తించాల్సిన పరిస్థితి ఎదురైన గాంధీజీ తన నిర్ణయం తెలపటంలో ఏమాత్రం ఆలస్యం చేయలేదు.

"ఈ మ్యాచ్‌లను నేనంతగా చూడటం లేదు. కాబట్టి క్రీడాభిమానిగా కాకుండా భారత్‌లోని ఓ సామాన్యుడి అభిప్రాయంలా దీన్ని స్వీకరించాలని కోరుకుంటున్నాను. టోర్నీ రద్దు చేస్తే క్రీడాభిమానులెంత నిరాశచెందుతారో నాకు తెలుసు. కానీ ప్రపంచవ్యాప్తంగా యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఇక్కడ చూస్తే మన సత్యాగ్రహులంతా జైళ్లలో మగ్గుతున్నారు. మన శక్తియుక్తులను జాగ్రత్తగా వాడుకుంటూ, ప్రాధాన్యాలను ఆచితూచి ఎంచుకోవాల్సిన తరుణమిది. అందుకే ఈ మ్యాచ్‌లను ఆపేయాలని కోరుకుంటున్నాను.

ఇదే సమయంలో... ముంబయి ప్రజలందరికీ నాదో విజ్ఞప్తి. మతాలవారీగా మ్యాచ్‌లను ప్రోత్సహించే సంప్రదాయాన్ని వదలుకోవాలి. కాలేజీల మధ్య, సంస్థల మధ్య మ్యాచ్‌లు, పోటీలు జరగటాన్ని నేనర్థం చేసుకోగలను. కానీ హిందువులు, ముస్లింలు, పార్సీల పేరిట మతాల జట్లు కట్టి ఆడటం క్రీడాస్ఫూర్తికే విరుద్ధం. మతతత్వం లేని క్రీడారంగాన్ని ఆదరించలేమా? అందుకే విశాల దృక్పథంతో ఆలోచించి ఈ మతవాద టోర్నీని శాశ్వతంగా నిషేధించాలని కోరుకుంటున్నా" అంటూ గాంధీజీ తన మనసులో మాటను వివరించారు.

దీనికి అప్పటి భారత క్రికెట్‌ బోర్డులో అత్యంత కీలకమైన విజయనగరం మహారాజు విజ్జీ కూడా మద్దతు పలికారు. అనేక వాదనల అనంతరం కొద్దికాలం తర్వాత ఈ మతాలవారీ పెంటాంగ్యులర్‌ టోర్నీని శాశ్వతంగా నిలిపేశారు. అలా అలనాటి ఐపీఎల్‌ కాలగర్భంలో కలసిపోయింది.

ఒకవంక మతప్రాతిపదికన దేశవిభజనను, ప్రత్యేక పాకిస్థాన్‌ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ... మతాలవారీగా క్రికెట్‌ జట్లను అనుమతించటం సరికాదన్నది గాంధీజీ భావన. రాజకీయంగా, భౌగోళికంగా, సామాజికంగానే కాకుండా క్రీడల్లోనూ హిందూ-ముస్లిం ఐక్యతను కోరుకున్నారాయన!

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.