మేడపై పడుకోవద్దని గొడవ.. కూతుర్ని 17 సార్లు పొడిచి చంపిన తండ్రి!

author img

By

Published : May 20, 2023, 8:59 PM IST

A Father stabbed his daughter 17 times in silly matter

ఇంటి మేడ మీద పడుకుందామన్నందుకు కట్టుకున్న భార్యపై ఆగ్రహం వ్యక్తం చేశాడు ఓ భర్త. అనంతరం కత్తితో దాడి చేసేందుకు యత్నించాడు. ఆ సమయంలో అడ్డు వచ్చిన 19 ఏళ్ల కుమార్తెను 17 సార్లు దారుణంగా పొడిచి చంపాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

వేసవి తాపాన్ని తట్టుకోలేక.. ఎండాకాలంలో చాలా మంది తమ ఇంటి మేడపై నిద్రిస్తారు. అయితే ఈ విషయంలో భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ.. ఓ యువతి ప్రాణాన్ని బలితీసుకుంది. కోపంతో ఆ యువతిని కన్నతండ్రే 17 సార్లు పొడిచి చంపాడు. గుజరాత్​లోని సూరత్​ జిల్లాలో జరిగిందీ దారుణ ఘటన.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
జిల్లాలోని కడోదరలో బిహార్​కు చెందిన రామానుజ్​ మహదేవ్ సాహు కుటుంబం నివసిస్తోంది. స్థానికంగా మిల్లులో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మహదేవ్​ సాహుకు ముగ్గురు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. అయితే గురువారం రాత్రి.. మహదేవ్​ను అతడి భార్య రేఖాదేవి ఇంటి మేడపై పడుకుందామని అడిగింది. ఆ సమయంలో వారిద్దరి మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది.

భార్యతో గొడవ జరిగిన తర్వాత మహదేవ్​ సాహు.. ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కొద్ది సేపటి తర్వాత పదునైన కత్తితో మహదేవ్​.. పరిగెత్తుకుంటూ వచ్చి రేఖాదేవిపై దాడికి యత్నించాడు. అదే సమయంలో తల్లిని కాపాడేందుకు అటువైపుగా కుమార్తె చంద్​కుమారి వెళ్లింది. దీంతో ఆగ్రహానికి గురైన మహదేవ్.. ఆమెపై కత్తితో 17 సార్లు దాడి చేశారు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది.

భర్త దాడిని తప్పించుకునేందుకు రేఖాదేవి మేడపైకి వెళ్లింది. అక్కడికి వెళ్లి మరీ ఆమెపై కత్తితో దాడి చేశాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. తండ్రి దాడిలో ముగ్గురు కుమారులు సూరజ్, ధీరజ్, విశాల్ కూడా గాయాలపాలయ్యారు. భార్యాపిల్లలపై దారుణానికి ఒడిగొట్టిన మహదేవ్​.. ఘటన తర్వాత పరారయ్యాడు.

విషయం తెలుసుకున్న స్థానికులు.. వెంటనే అంబులెన్స్​కు ఫోన్​ చేశారు. క్షతగాత్రలను చికిత్స కోసం స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని పలు కోణాల్లో విచారణ జరిపారు.

4రోజుల క్రితం అదృశ్యమై.. అరటితోటలో శవమై..
నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన ఓ 9 ఏళ్ల బాలిక.. అరటితోటలో విగతజీవిగా కనిపించింది. మృతదేహంపై యాసిడ్ పోసి కాల్చినట్లు తెలుస్తోంది. బాలిక కుడి చేతి నాలుగు వేళ్లు కూడా తెగి ఉన్నాయి. దీంతో చిన్నారి మృతదేహం చూసి ఒక్కసారిగా అంతా షాకయ్యారు. బిహార్​లోని వైశాలి జిల్లాలో ఈ దారుణ ఘటన వెలుగుచూసింది

పోలీసుల సమాచారం ప్రకారం..
జిల్లాలోని జండాహ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఈ ఘటన జరిగింది. నాలుగు రోజుల క్రితం.. తొమ్మిదేళ్ల బాలిక అదృశ్యమైంది. దీంతో ఆమె కుటుంబసభ్యులు అంతా వెతికారు. ఎక్కడా ఆమె కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే శనివారం ఉదయం చిన్నారి మృతదేహం.. అరటితోటలో లభించింది. దుండగులు.. ఆమె శరీరంపై యాసిడ్​ పోసి కాల్చినట్లు తెలుస్తోంది. ఆమె శరీరం పూర్తిగా కాలిపోయి ఉంది. బాలిక కుడిచేతి నాలుగు వేళ్లు తెగి పడి ఉన్నాయి. సమాచారం అందుకున్న జండాహా పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. చిన్నారి మృతదేహాన్ని శవపరీక్షల కోసం హాజీపుర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శవపరీక్షల అనంతరం బాలిక మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.