పెంపుడు శునకాన్ని 'కుక్క' అని పిలిచినందుకు దారుణం.. కత్తితో పొడిచి రైతు హత్య

author img

By

Published : Jan 21, 2023, 7:26 PM IST

Updated : Jan 21, 2023, 8:31 PM IST

farmer died in tamilnadu

పెంపుడు శునకాన్ని పేరు పెట్టి పిలవకుండా 'కుక్క' అని పిలిచాడని ఓ రైతును హత్య చేశారు ఇద్దరు యువకులు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. మరోవైపు, వేరుశనగ గోడౌన్​ గోడ కూలి నలుగురు కూలీలు మరణించారు. ఈ ప్రమాదం మధ్యప్రదేశ్​లో జరిగింది.

తన పెంపుడు శునకాన్ని పేరు పెట్టి పిలవకుండా 'కుక్క' అని పిలిచాడని ఓ వ్యక్తిని హత్యచేశారు ఇద్దరు యువకులు. ఈ ఘటన తమిళనాడులోని దిండిగల్​లో జరిగింది. మృతుడిని రాయప్పన్​(65)గా పోలీసులు గుర్తించారు. మృతుడు రైతు అని పోలీసులు తెలిపారు. శుక్రవారం జరిగిందీ ఘటన.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
దిండిగల్‌కు చెందిన రాయప్పన్.. డేనియల్ ఇరుగుపొరుగువారు. వీరిద్దరికి బంధుత్వం కూడా ఉంది. రాయప్పన్ తన మనవడితో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ సమయంలో డేనియల్ సోదరుడు విన్సెంట్ పెంచుకుంటున్న కుక్క అరుస్తూ రాయప్పన్​ వైపు దూసుకొచ్చింది. దీంతో రాయప్పన్ 'గో డాగ్​' అని కుక్కను వారించాడు. కుక్కను తరిమికొట్టేందుకు కర్రను తీసుకురావాలని తన మనవడికి చెప్పాడు. దీంతో డేనియల్​కు, రాయప్పన్​కు వాగ్వాదం జరిగింది. కోపోద్రిక్తుడైన డేనియల్​​.. కత్తితో రాయప్పన్ ఛాతీపై పొడిచాడు. ఈ హత్యలో డేనియల్​కు అతడి సోదరుడు విన్సెంట్ సాయపడ్డాడు. రాయప్పన్ ఘటనాస్థలిలోనే కుప్పకూలి మృతి చెందాడు. నిందితులిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు.

గోడౌన్ గోడ కూలి..
మధ్యప్రదేశ్​ శివపురిలో ఘోర ప్రమాదం జరిగింది. వేరుశనగ నిల్వ చేసే గోడౌన్ గోడ కూలి నలుగురు కూలీలు మృతి చెందగా.. మరో ఆరుగురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. గోడౌన్​లో సామర్థ్యం కంటే ఎక్కువ వేరుశనగ నిల్వ చేయడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. శనివారం సాయంత్రం జరిగిందీ ఘటన.

హెరాయిన్ స్వాధీనం..
మహారాష్ట్రలో భారీగా హెరాయిన్ పట్టుబడింది. ముంబయిలోని శాంతాక్రూజ్​లో ఓ వ్యక్తి దగ్గరి నుంచి 325 గ్రాముల హెరాయిన్​ను ముంబయి నార్కోటిక్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని శుక్రవారం సాయంత్రం వకోలా వంతెన సమీపంలోని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న హెరాయిన్ విలువ దాదాపు రూ.1.3 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.

Last Updated :Jan 21, 2023, 8:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.