రూ.8కోట్లు ఖర్చు.. కరోనాపై 8 నెలల పోరాటం.. అయినా దక్కని రైతు ప్రాణం!

author img

By

Published : Jan 13, 2022, 2:00 PM IST

farmer

Farmer died due to Covid 19: ఓ రైతు కరోనా మహమ్మారిపై ఎనిమిది నెలల పాటు పోరాటం సాగించి ఓడిపోయారు. దేశవిదేశాల నుంచి వైద్యులను రప్పించినా ఆయనను రక్షించలేకపోయారు కుటుంబ సభ్యులు. చికిత్స కోసం తమకు ఉన్న 50 ఎకరాలు అమ్మేసి, రోజుకు రూ.3 లక్షలు ఖర్చు చేసినా ఫలితం లేకపోయింది.

Farmer died due to Covid 19: కరోనా మహమ్మారితో 8 నెలలుగా పోరాటం సాగించారు ఓ రైతు. చికిత్స కోసం ఆయన కుటుంబ సభ్యులు ఖర్చుకు వెనకాడలేదు. అపోలో ఆసుపత్రిలో రోజుకు రూ.3 లక్షలు ఖర్చు చేసి చికిత్స చేయించారు. అందుకోసం తమకు ఉన్న 50 ఎకరాలను అమ్మేశారు. అయినా.. ఫలితం దక్కలేదు, ఆ రైతు ప్రాణాలను దక్కించుకోలేకపోయారు. చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. గత మంగళవారం రాత్రి కన్నుమూశారు ఆ రైతు.

మధ్యప్రదేశ్​లోని రీవా జిల్లాలోని రకరీ గ్రామానికి చెందిన రైతు ధర్మజయ్​ సింగ్​(50) అనారోగ్యానికి గురవగా.. 2021, ఏప్రిల్​ 30న కరోనా పరీక్షలు చేయించారు. వైరస్ సోకినట్లు మే 2న తెలిసింది. దీంతో ఆయనను జిల్లా కేంద్రంలోని సంజయ్​ గాంధీ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. ధర్మజయ్​ బీపీ పడిపోగా.. ఐసీయూకు తరలించి చికిత్స ప్రారంభించారు వైద్యులు. వెంటిలేటర్​ అమర్చారు. ఆయన పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించకపోవటం వల్ల మే 18న చెన్నైలోని అపోలో ఆసుపత్రికి ఎయిర్​ అంబులెన్స్​ ద్వారా తరలించారు. అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్నారు ధర్మజయ్​.

farmer died due to corona
ఎయిర్​ అంబులెన్స్​లో చెన్నైకి తరలిస్తున్న కుటుంబ సభ్యులు

దెబ్బతిన్న ఊపిరితిత్తులు

ఆయన ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయని అపోలో ఆసుపత్రి వైద్యులు తెలిపారు. చికిత్స ప్రారంభించిన నాలుగు రోజుల తర్వాతే ఆయన కరోనా నుంచి కోలుకున్నా.. ఊపిరితిత్తుల సమస్యతో ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు. 8 నెలల పాటు చికిత్స అందించారు. అందుకు రోజుకు రూ.3 లక్షల చొప్పున ఖర్చు చేశారు కుటుంబ సభ్యులు. ఇలా 8 నెలల్లో చికిత్స కోసం దాదాపు రూ.8కోట్లు ఖర్చు అయింది.

లండన్​ నుంచి వైద్యులు

ధర్మజయ్​ సింగ్​ చికిత్స కోసం దేశంలోని ప్రముఖ వైద్యులతో పాటు లండన్​ నుంచి డాక్టర్లను తీసుకొచ్చారు కుటుంబ సభ్యులు. వర్చువల్​గానూ మరికొంత మంది విదేశీ వైద్యుల సూచనలు తీసుకున్నారు. ఎక్స్​ట్రాకార్పోరీల్​ మెంబ్రేన్​ ఆక్సిజనేషన్​(ఎక్​మో) అనే మిషన్​ను అమర్చి ఎనిమిది నెలల పాటు చికిత్స కొనసాగించారు.

స్ట్రాబెర్రీ సాగుతో..

రీవాకు చెందిన ధర్మజయ్​ సింగ్​.. స్ట్రాబెర్రీ, గులాబీలు సాగు చేస్తూ మంచి గుర్తింపు పొందారు. 2021, జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజున ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్​ చౌహాన్​ ఆయను సత్కరించారు. కరోనా సమయంలో ఇతరులకు సాయం చేసే క్రమంలో ఆయన వైరస్​ బారినపడ్డారు. ఆయన చికిత్స కోసం ప్రభుత్వ సాయం కోరగా.. రూ.4 లక్షలు అందించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఇదీ చూడండి: కరోనాతో పోరాడి ఓడిన ధీర యువతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.