దిల్లీ లిక్కర్ స్కామ్​పై ఈడీ నజర్.. హైదరాబాద్​ సహా 30 ప్రాంతాల్లో సోదాలు

author img

By

Published : Sep 6, 2022, 10:36 AM IST

Updated : Sep 6, 2022, 2:09 PM IST

ED raid

దిల్లీ ప్రభుత్వ ఆల్కహాల్ విధానంలో అవకతకవకల కేసులో ఈడీ దాడులు చేపట్టింది. దేశవ్యాప్తంగా 30 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్​లో సైతం దాడులు చేపట్టినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

దిల్లీ ప్రభుత్వ మద్యం కుంభకోణం ఆరోపణల కేసులో ఎన్ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ దేశవ్యాప్త దాడులు చేపట్టింది. దేశంలోని 30 ప్రదేశాల్లో సోదాలు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దిల్లీతో పాటు ఉత్తర్​ప్రదేశ్, పంజాబ్, హరియాణ, తెలంగాణ, మహారాష్ట్ర సహా పలు ప్రాంతాల్లో ఈ దాడులు కొనసాగుతున్నాయని వెల్లడించాయి. అయితే, ఈ కేసులో ప్రధానంగా వినిపిస్తున్న దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా ఇంట్లో దాడులు చేయడం లేదని సంబంధిత వర్గాలు చెప్పాయి. దిల్లీ, గురుగ్రామ్, లఖ్​నవూ, హైదరాబాద్, ముంబయి, బెంగళూరు నగరాల్లో సోదాలు చేపట్టినట్లు వివరించాయి. మద్యం వర్తకులు ఉండే ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దిల్లీ, జోర్​బాగ్​లోని ఇండో స్పిరిట్స్ కంపెనీ ఎండీ సమీర్ మహేంద్రుకు సంబంధించిన ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయని ఈడీ వర్గాలు తెలిపాయి. ఆయన యూసీఓ బ్యాంకు నుంచి కోటి రూపాయలను ట్రాన్స్​ఫర్ చేశారని ఈడీ ఆరోపిస్తోంది.

ED raid
మహంద్రు ఇంట్లో సోదాలు
ED raid
మహేంద్రు ఇంట్లో సోదాలు

'ఈడీకీ ఏం దొరకదు'
తాజా సోదాలపై దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా స్పందించారు. తొలుత సీబీఐతో దాడులు చేయిస్తే వారికి ఏం లభించలేదని, ఇప్పుడు ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారని.. వారికీ ఏం దొరకదని తెలిపారు. దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్ చేస్తున్న మంచి పనులను ఆపేందుకు చేసే ప్రయత్నాలే ఇవన్నీ అని విమర్శించారు. సీబీఐ, ఈడీలను ఉపయోగించినా సరే తమను అడ్డుకోలేరని సిసోదియా కేంద్రంపై ధ్వజమెత్తారు. ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి గత నెల సిసోదియా నివాసం సహా ఏడు రాష్ట్రాల్లో 31 చోట్ల సీబీఐ సోదాలు నిర్వహించింది.

ఏంటీ కేసు?
దిల్లీలో గతేడాది నవంబరులో కేజ్రీవాల్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన అబ్కారీ విధానంలో అనేక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి. మద్యం విధానంలో నిబంధనల ఉల్లంఘన జరగడం సహా విధానపరమైన లోపాలున్నట్లు దిల్లీ ప్రధాన కార్యదర్శి నివేదిక ఇచ్చారు. టెండర్ల విధానంలో కొందరికి ఆయాచిత లబ్ధి చేకూరేలా నిర్ణయాలు తీసుకున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. ఈ ఉల్లంఘనలపై దర్యాప్తు చేపట్టాలని దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా.. కేంద్ర దర్యాప్తు సంస్థకు సిఫార్సు చేశారు. ఈ వ్యవహారంలో ఎక్సైజ్‌శాఖకు ఇన్‌ఛార్జ్‌గా ఉన్న మనీశ్‌ సిసోదియా పాత్రనూ అందులో ప్రస్తావించారు.

ఈ క్రమంలోనే సీబీఐ కేసు నమోదు చేసి, రంగంలోకి దిగింది. ఈ కేసులో సిసోదియా సహా మొత్తం 15 మంది వ్యక్తులు, ఓ కంపెనీ పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది. ఈ క్రమంలోనే ఆగస్టు 19న సిసోదియా నివాసం సహా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఇటీవల ఘాజియాబాద్‌లోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో ఉన్న సిసోదియా బ్యాంకు లాకర్‌ను కూడా ఆయన సమక్షంలో సీబీఐ పరిశీలించింది. ఆప్‌ సీనియర్‌ నేత సిసోదియా విద్యాశాఖతో పాటు ఎక్సైజ్‌ శాఖనూ చూస్తున్నారు. ఇప్పటికే నూతన అబ్కారీ విధానాన్ని వెనక్కి తీసుకున్నారు.

Last Updated :Sep 6, 2022, 2:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.