రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అసలు పేరు ఏంటో తెలుసా?

author img

By

Published : Jul 26, 2022, 5:12 AM IST

murmu original name

Draupadi Murmu Original Name: భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్ము ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్​వీ రమణ సమక్షంలో ఆమె బాధ్యతలు స్వీకరించారు. అయితే ద్రౌపదీ ముర్ము అసలు పేరు అది కాదంట. ముర్ముకు తల్లిదండ్రులు వేరే పేరు పెట్టారట. మరోపైపు, మాజీ రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​.. 12 జన్‌పథ్‌లోని నూతన నివాసానికి మారారు.

Draupadi Murmu Original Name: దేశ తొలి గిరిజన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేరు ఇప్పుడు ఆసేతు హిమాచలం మారుమోగుతోంది. అయితే ఇది ఆమె అసలు నామధేయం కాదు. ఒక టీచర్‌ ఆమెకు ఈ పేరు పెట్టారు. ముర్ముకు తల్లిదండ్రులు.. 'పుటి' అనే సంతాళీ పేరు పెట్టారు. ఆమె స్వస్థలం ఒడిశాలోని మయూర్‌భంజ్‌. ఈ జిల్లాలో గిరిజనులు ఎక్కువగా ఉండేవారు. 1960లలో అక్కడ పనిచేసిన టీచర్లలో ఎక్కువ మంది పొరుగు జిల్లాల వారే. 'పుటి' అధ్యాపకుడూ ఇలా వేరే ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తే. ఆయనకు ఈ పేరు నచ్చలేదు.

అందువల్ల మహాభారతంలోని ద్రౌపది పేరును తనకు పెట్టారని ఆమె ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఆ తర్వాత అది పలు సందర్భాల్లో 'దురుపది','దొర్పది'గా మారిందని, చివరికి ద్రౌపదిగా తిరిగి స్థిరపడిందని చెప్పారు. సంతాళి తెగలో అమ్మాయికి నానమ్మ పేరు, అబ్బాయికి తండ్రి పేరు పెట్టడం ఆనవాయితీ. మొదట్లో ఆమెకు 'తుడు' అనే ఇంటిపేరు ఉండేది. శ్యామ్‌ చరణ్‌ ముర్మును వివాహమాడాక ఆమె పేరు పక్కన ముర్ము చేరింది.

రాజకీయాల్లో మహిళలకు రిజర్వేషన్‌ ఉండాలి
రాజకీయాల్లో పురుషాధిపత్యం ఎక్కువైందని ముర్ము ఓ సందర్భంలో పేర్కొన్నారు. పార్టీలు దీన్ని మార్చాలన్నారు. ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, టికెట్ల పంపిణీ విషయంలో ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. మహిళలు విలువలతో కూడిన రాజకీయాలపై దృష్టిసారించాలని కోరారు. సాధికారత కోసం పార్లమెంటు, అసెంబ్లీల్లో గొంతుక వినిపించాలని సూచించారు. ప్రజా సమస్యలను నిర్దిష్ట వేదికలపై ప్రస్తావించాలన్నారు.

రామ్‌నాథ్‌ @ 12 జన్‌పథ్‌..
మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సోమవారం 12 జన్‌పథ్‌లోని నూతన నివాసానికి మారారు. సంప్రదాయం ప్రకారం రాష్ట్రపతి భవన్‌ నుంచి ఆయన్ని ఈ నివాసానికి తీసుకువెళ్లేటప్పుడు నూతన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో పాటు, కేంద్ర మంత్రులు కిరణ్‌ రిజిజు, హర్దీప్‌సింగ్‌ పురి, వి.కె.సింగ్‌, భాజపా అధ్యక్షుడు జె.పి.నడ్డా తదితరులు హాజరయ్యారు. 12 జన్‌పథ్‌లో దాదాపు మూడు దశాబ్దాల పాటు కేంద్ర మాజీ మంత్రి రాంవిలాస్‌ పాసవాన్‌ నివాసం ఉన్నారు. 2020 అక్టోబరులో ఆయన కన్నుమూశాక తనయుడు చిరాగ్‌ పాసవాన్‌ దానిలో ఉండేవారు. ప్రభుత్వం ఈ ఏప్రిల్‌లో ఆయన్ని ఖాళీ చేయించింది. పదవీ విరమణ అనంతరం కోవింద్‌ దీనిలో ఉండేందుకు ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేసింది.

.

రాష్ట్రపతి హోదాలో నెలకు రూ.5 లక్షల జీతం అందుకున్న కోవింద్‌కు ఇకపై రూ.2.5 లక్షలు పింఛన్‌ లభిస్తుంది. ఇది జీవితాంతం కొనసాగుతుంది. ఫోన్లు, కారుతో పాటు ఒక ప్రైవేటు కార్యదర్శి, ఒక అదనపు ప్రైవేటు కార్యదర్శి, ఒక పర్సనల్‌ అసిస్టెంట్‌, ఇద్దరు ప్యూన్లను మాజీ రాష్ట్రపతి కోసం ప్రభుత్వం కేటాయించింది. ఉచిత వైద్య చికిత్సకు, దేశంలో ఎక్కడికైనా మరొకరిని వెంట తీసుకువెళ్లి ఉచితంగా ప్రయాణించడానికి ఆయనకు అర్హత ఉంటుంది.

ఇదీ చదవండి: 'అధికారం కోసమే రాజకీయాలా?.. వదిలేయాలని అనిపిస్తోంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.