యువతకు మోదీ 'దీపావళి' గిఫ్ట్.. 75వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు

author img

By

Published : Oct 20, 2022, 2:21 PM IST

PM Modi

దేశవ్యాప్తంగా 10లక్షల ఉద్యోగాలను సృష్టిస్తామని ఇటీవల హామీ ఇచ్చిన ప్రధాని మోదీ ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. పలు ప్రభుత్వ విభాగాల్లో ఖాళీల భర్తీ చేపట్టి 75వేల మంది యువతకు ఉద్యోగాలు కల్పించారు. వారికి ప్రధాని స్వయంగా నియామక పత్రాలు అందజేయనున్నారు.

దేశవ్యాప్తంగా వేలాది మంది యువతకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీపావళి కానుకలు అందించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ శనివారం (అక్టోబరు 22) ప్రధాని మోదీ 75వేల మంది యువతతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి వారికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. పలు మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాలకు ఎంపికైన యువతకు ఈ అపాయింట్‌మెంట్‌ లెటర్లను అందించనున్నారని తెలుస్తోంది.

రక్షణ, రైల్వే, హోం, కార్మిక-ఉపాధి శాఖలు, తపాలా శాఖ, సీఐఎస్‌ఎఫ్‌, సీబీఐ, కస్టమ్స్‌, బ్యాంకింగ్‌ తదితర రంగాల్లో ఉద్యోగాలకు ఎంపికైన యువతతో మోదీ ముచ్చటించనున్నారు. దేశవ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు, భాజపా ఎంపీలు కూడా పాల్గొననున్నారు. విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌.. ఒడిశా నుంచి, ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ.. గుజరాత్‌ నుంచి, సమాచార-ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌.. చండీగఢ్‌ నుంచి, వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌.. మహారాష్ట్ర నుంచి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌.. తమిళనాడు నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు సదరు వర్గాలు వెల్లడించాయి.

దేశంలో నిరుద్యోగంపై విపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు ఎదురవుతున్న నేపథ్యంలో ఈ ఏడాది జూన్‌లో ప్రధాని మోదీ కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. రానున్న 18 నెలల్లో 10లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగానే పలు ప్రభుత్వ విభాగాల్లో ఇటీవల ఉద్యోగాల భర్తీ చేపట్టారు.

ఇవీ చదవండి: భుజంపై చిన్నారి మృతదేహం.. అంబులెన్సు లేక బస్సులో ఇంటికి ప్రయాణం

భర్త ఈఎంఐలో మొబైల్ కొన్నాడని.. విషం తాగిన భార్య.. చివరికి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.