'దేశంలో ఆ ఇద్దరి 'నియంత' పాలన.. ప్రశ్నిస్తే దాడులే!'

author img

By

Published : Aug 5, 2022, 10:23 AM IST

Updated : Aug 5, 2022, 11:14 AM IST

rahul gandhi on modi

Rahul Gandhi on Modi : ఎన్​డీఏ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. దేశంలో ప్రజాస్వామ్యం చనిపోతోందని అన్నారు. ఇద్దరు-ముగ్గురు బడా వ్యాపారవేత్తల ప్రయోజనాల కోసం ఇద్దరు కలిసి దేశంలో నియంతృత్వ పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు రాహుల్.

Rahul Gandhi on Modi : శతాబ్ద కాలంగా నిర్మించుకున్న భారత దేశాన్ని మన కళ్ల ముందే ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. దేశంలో ప్రజాస్వామ్యం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాసమస్యలపై గళం ఎత్తితే ప్రభుత్వం అణిచివేస్తోందని ఆరోపించారు. శుక్రవారం దిల్లీలో ప్రత్యేకంగా మీడియా సమావేశం నిర్వహించి రాహుల్.. భాజపాపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

"ప్రజాస్వామ్యం మరణాన్ని మనం చూస్తున్నాం. శతాబ్దకాలంపాటు ఇటుక ఇటుక పోగేసి నిర్మించిన భారత దేశం మన కళ్ల ముందే ధ్వంసమైపోతోంది. నియంతృత్వానికి ఎదురు నిలిచినవారిపై దాడులు చేస్తున్నారు, జైల్లో వేస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు, కొడుతున్నారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, హింస.. ఇలా ప్రజాసమస్యలేవీ ప్రస్తావించరాదన్నదే వారి ఆలోచన. నలుగురు, ఐదుగురు ప్రయోజనాల కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తోంది. ఇద్దరు, ముగ్గురు బడా వ్యాపారవేత్తల ప్రయోజనాల కోసం ఇద్దరు వ్యక్తులు నియంత పాలన సాగిస్తున్నారు." అని మండిపడ్డారు రాహుల్ గాంధీ.

నేషనల్ హెరాల్డ్​ కేసులో కాంగ్రెస్​ అగ్రనేతల్ని విచారించడంపై స్పందించారు రాహుల్. తమను ఎంతైనా ప్రశ్నించుకోవచ్చని అన్నారు. అసలు అక్కడ(హెరాల్డ్ కేసులో) ఏమీ లేదన్న విషయం అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. ఆర్​ఎస్​ఎస్​ సిద్ధాంతాన్ని వ్యతిరేకించడమే తన పని అని.. అందుకు ప్రతిగా తనపై దాడి చేసినా ఏమాత్రం తగ్గబోనని స్పష్టం చేశారు.

"వారు గాంధీ కుటుంబంపై ఎందుకు దాడి చేస్తారు? ఎందుకంటే.. మేము ఒక సిద్ధాంతం కోసం పోరాడతాం కాబట్టి. మాలాంటి వారు కోట్ల మంది ఉన్నారు. మేము ప్రజాస్వామ్యం కోసం, సమాజంలో సామరస్యం కోసం పోరాడతాం. ఎన్నో ఏళ్లుగా ఇలానే చేస్తున్నాం. మా కుటుంబం ప్రాణత్యాగాలు చేసింది. ఈ సిద్ధాంతం కోసం పోరాడేటప్పుడు అది మా బాధ్యత కూడా. రెండు వర్గాల మధ్య గొడవలు పెడుతుంటే, దళితుల్ని చంపేస్తుంటే, మహిళల్ని కొడుతుంటే చాలా బాధ కలుగుతుంది. అందుకే మేము పోరాడతాం. ఇది ఒక కుటుంబం కాదు.. ఒక సిద్ధాంతం" అని అన్నారు రాహుల్ గాంధీ.

నిరుద్యోగం, ధరల పెరుగుదల విషయమై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు కాంగ్రెస్ అగ్రనేత. దేశ ఆర్థిక రంగంలో అసలు ఏం జరుగుతుందో ఆమెకు తెలియడం లేదని ఎద్దేవా చేశారు. ఆమె రాజకీయ పార్టీకి అధికార ప్రతినిధిగా మాత్రమే ఉన్నారని విమర్శించారు. ఎన్నికల్లో భాజపా వరుస విజయాలపైనా తనదైన శైలిలో స్పందించారు రాహుల్. "హిట్లర్ కూడా ఎన్నికల్లో గెలిచేవాడు. ఎలా గెలిచాడు? జర్మనీలోని వ్యవస్థలన్నీ అతడి నియంత్రణలోనే ఉండేవి. నాకు వ్యవస్థ మొత్తాన్ని అప్పగించండి. ఎన్నికలు ఎలా గెలవాలో నేను చూపిస్తా" అని అన్నారు కాంగ్రెస్ అగ్రనేత.

భాజపా కౌంటర్: 'గాంధీ అంటే ఓ కుటుంబం కాదు, సిద్ధాంతం' అన్న రాహుల్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించింది భాజపా. "ఆయన(రాహుల్) మహాత్మా గాంధీ వారసుడేమీ కాదు. ఆయన 'నకిలీ' గాంధీ. వారిది నకిలీ సిద్ధాంతం" అని విమర్శించారు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి.
మరోవైపు.. ధరల పెరుగుదల, నిరుద్యోగంపై కాంగ్రెస్​ నిరసనల నేపథ్యంలో దిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. విజయ్​ చౌక్ వద్ద భారీగా పోలీసుల్ని మోహరించారు. జంతర్​ మంతర్​ మినహా న్యూదిల్లీలోని ఇతర అన్ని ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు.

Last Updated :Aug 5, 2022, 11:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.