'నోరు జారా.. క్షమించండి'.. రాష్ట్రపతి ద్రౌపదికి అధీర్ రంజన్​ లేఖ

author img

By

Published : Jul 29, 2022, 6:46 PM IST

Updated : Jul 29, 2022, 7:37 PM IST

adhir

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు క్షమాపణలు చెప్పారు కాంగ్రెస్​ నేత అధీర్ రంజన్ చౌదరి. పొరపాటున నోరు జారానని, తన క్షమాపణల్ని అంగీకరించాలని కోరుతూ లేఖ రాశారు. అంతకుముందు.. భాజపా నేతలపై విమర్శలు చేశారు అధీర్​. ఉగ్రవాద నిరోధక చట్టం కింద భాజపా నేతలు తనను అరెస్ట్​ చేసే క్షణం కోసం ఎదురుచూస్తున్నానని అన్నారు. కేంద్రం గిరిజనులకు వ్యతిరేకంగా పనిచేస్తోందని ధ్వజమెత్తారు.

అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు క్షమాపణలు చెప్పారు లోక్​సభలో కాంగ్రెస్​ పక్ష నేత. ఆమెను రాష్ట్రపత్ని అనడం రాజకీయంగా దుమారం రేపిన నేపథ్యంలో ఈమేరకు లేఖ రాశారు. "మీరు చేపట్టిన అత్యున్నత పదవి గురించి చెప్పేందుకు పొరపాటున తప్పుడు పదం వాడినందుకు విచారం వ్యక్తం చేసేందుకు ఈ లేఖ రాస్తున్నా. నోరు జారడం వల్లే ఇలా జరిగింది. నన్ను క్షమించండి" అని లేఖలో పేర్కొన్నారు అధీర్.

ఐ యామ్​ వెయిటింగ్​: అంతకుముందు.. భాజపాపై తీవ్ర విమర్శలు చేశారు అధీర్. తనపై భాజపా తీవ్రవాది ముద్ర వేసి ఉగ్రవాద నిరోధక చట్టం కింద అరెస్ట్​ చేసే సమయం కోసం ఎదురుచూస్తున్నానని అన్నారు. "గిరిజనులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ దేశంలో జరుగుతున్న కొన్ని హత్యలకు వెనుక కారణాలను కప్పిపుచ్చుతున్నారు. సోనియా గాంధీ హయాంలో రూపొందించిన చట్టాలను మార్చేస్తున్నారు. గిరిజనులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు." అని అధీర్​ వ్యాఖ్యానించారు.

ఇటీవల అధీర్​ రంజన్​ చౌదరి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ఉద్దేశిస్తూ 'రాష్ట్రపత్ని' అనే పదం వాడటం వివాదాస్పదమైంది. ఈ విషయంపై పార్లమెంటులో దుమారం చేలరేగింది. ముర్ముపై చేసిన వ్యాఖ్యలకు అధీర్​ క్షమాపణ చెప్పాలంటూ భాజపా నేతలు డిమాండ్​ చేశారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ కాంగ్రెస్​ అధినేత్రి సోనియా గాంధీపై తీవ్ర విమర్శలు చేయడం సభలో గందరగోళానికి దారి తీసింది. కాంగ్రెస్​ శ్రేణులు నిరసన చేపట్టాయి. సోనియాకు స్మృతీ ఇరానీ క్షమాపణ చెప్పాల్సిందే అని డిమాండ్​ చేశాయి. ఈ కారణంతోనే శుక్రవారం ఉభయసభలకు అంతరాయం కలిగింది.

ఇదీ చూడండి : 700 అడుగుల లోతు బోరుబావిలో బాలిక.. రక్షించిన ఆర్మీ

Last Updated :Jul 29, 2022, 7:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.