కొత్త ట్విస్ట్.. నీతీశ్​తో పీకే భేటీ.. కొత్త కూటమి కోసమేనా?

author img

By

Published : Sep 14, 2022, 7:06 PM IST

Nitish Kumar Prashant Kishor

Nitish Kumar Prashant Kishor : ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్​తో బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. 2024 సార్వత్రిక ఎన్నికల కోసం వీరిద్దరూ కలిసి పనిచేస్తారా అనే ప్రశ్నలకు తావిచ్చింది. ఈ నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు నీతీశ్.

Nitish Kumar Prashant Kishor : ఎన్నికల వ్యూహకర్త, ఐప్యాక్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్​తో భేటీ అయిన మాట వాస్తవమేనని స్పష్టం చేశారు బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నీతీశ్ కుమార్. అయితే.. ఈ సమావేశానికి రాజకీయ ప్రాధాన్యం ఉందా అనే ప్రశ్నలకు సూటిగా సమాధానం ఇచ్చేందుకు ఆయన నిరాకరించారు.
నీతీశ్​ కుమార్, ప్రశాంత్​ కిశోర్​ మంగళవారం సాయంత్రం పట్నాలో భేటీ అయ్యారు. ఈ సమావేశం రాజకీయ వర్గాల దృష్టిని ఆకర్షించింది. ఇదే విషయమై బుధవారం నీతీశ్​ను మీడియా మరింత స్పష్టత కోరగా.. ఆయన దాటవేశారు. పీకేతో తనకు ఎప్పటి నుంచో అనుబంధం ఉందని, అలాంటి వ్యక్తిని కలవడంలో ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. ఎన్నికల కోసం ప్రశాంత్​తో మళ్లీ కలిసి పనిచేస్తారా అని అడగ్గా.. ఆ ప్రశ్నను పీకేనే అడగాలని మీడియా ప్రతినిధులకు సూచించారు బిహార్ సీఎం.

కొత్త ట్విస్ట్.. నీతీశ్​తో పీకే భేటీ.. కొత్త కూటమి కోసమేనా

గతంలో ఎన్నికల వ్యూహకర్తగా నీతీశ్​ కుమార్​ నేతృత్వంలోని జేడీయూకు సేవలు అందించారు ప్రశాంత్ కిశోర్. 2015లో బిహార్​లో మహాకూటమి ప్రభుత్వం ఏర్పడడంలో కీలక భూమిక పోషించారు. 2018 సెప్టెంబరులో పీకే.. జేడీయూ పార్టీలో చేరారు. నితీశ్‌ ఆయనను పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమించారు. అయితే కొంత కాలానికే వీరి మధ్య విభేదాలు వచ్చాయి. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని 2020లో పీకేను జేడీయూ నుంచి బహిష్కరించారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని, సురాజ్య మంత్రంతో బిహార్​లో ప్రత్యామ్నాయ శక్తిగా నిలుస్తానని కొన్ని నెలల క్రితం ప్రకటించారు పీకే. త్వరలోనే పాదయాత్ర కూడా చేస్తానని చెప్పారు.మరోవైపు.. భాజపాను ఎదుర్కోగల ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటే లక్ష్యంగా విశ్వప్రయత్నాలు చేస్తున్నారు నీతీశ్. కొంతకాలంగా దేశంలోని భాజపాయేతర పార్టీల నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో నీతీశ్​ కుమార్​తో ప్రశాంత్ కిశోర్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

కొసమెరుపు..
మంగళవారం నీతీశ్​ను కలిసిన పీకే.. అందుకు రెండు రోజుల ముందే జేడీయూ అధినేతపై తీవ్ర విమర్శలు గుప్పించడం కొసమెరుపు. కూటములు మార్చినా అనేక ఏళ్లుగా సీఎం కుర్చీలో నీతీశ్​ కొనసాగుతుండడాన్ని ప్రస్తావిస్తూ.. "ఫెవికాల్ ఆయన్ను బ్రాండ్ అంబాసిడర్​ను చేసుకోవాలి. అది ఫెవికాల్ బాండ్, అస్సలు విడిపోదు" అని అన్నారు. గత నెలలో భాజపాతో జేడీయూ తెగదెంపులు చేసుకున్నా.. ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి అలానే ఉందని విశ్లేషించారు. అది వచ్చే ఎన్నికల్లో కనిపిస్తుందని జోస్యం చెప్పారు పీకే. ప్రస్తుతం ఏడు పార్టీలు(జేడీయూ, ఆర్​జేడీ, కాంగ్రెస్​ వామపక్షాలు) ఒకవైపు, భాజపా మరోవైపు ఉండగా.. రానున్న ఎన్నికల నాటికి ఈ రాజకీయ సమీకరణాలు మారిపోతాయని అంచనా వేశారు.
జాతీయ రాజకీయాలు, 2024 ఎన్నికలపై పీకే తాజా విశ్లేషణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇవీ చదవండి: యడియూరప్పకు షాక్.. 'రూ.కోట్ల స్కామ్'​పై దర్యాప్తునకు కోర్టు ఆదేశం

'రాహుల్ యాత్ర విజయం చూడలేకే భాజపా 'ఆపరేషన్​ బురద''

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.