చింతన్ శిబిర్లో కాంగ్రెస్ మేధోమథనం.. కీలక నేతలతో సోనియా భేటీ!
Updated on: May 14, 2022, 9:34 PM IST

చింతన్ శిబిర్లో కాంగ్రెస్ మేధోమథనం.. కీలక నేతలతో సోనియా భేటీ!
Updated on: May 14, 2022, 9:34 PM IST
Chintan Shivir: రాజస్థాన్లోని ఉదయ్పుర్ వేదికగా జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ నవ సంకల్ప్ చింతన్ శిబిర్లో పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఏఐసీసీ కార్యదర్శులు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలతో భేటీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వంపై పోరాటంలో భాగంగా చేపట్టనున్న జనజాగరణ్ అభియాన్పై సోనియా, పార్టీ నేత రాహుల్ గాంధీ చర్చించారు. అటు వ్యవసాయం సహా వివిధ అంశాలపై ఏర్పాటైన 6 కమిటీలు చర్చలు కొనసాగిస్తున్నాయి.
Congress Meeting: వరుస ఓటములతో బలహీనమైన పార్టీలో జవసత్వాలు నింపడం, రాబోయే ఎన్నికలకు సమాయత్తం కావడంపై మేథోమథనం కోసం రాజస్థాన్లోని ఉదయ్పుర్లో నవసంకల్ప్ చింతన్ శిబిర్ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ రెండో రోజు కీలక అంశాలపై చర్చించింది. శుక్రవారం తొలి రోజు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన అధినేత్రి సోనియా....శనివారం పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. ఏఐసీసీ కార్యదర్శులు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలతో భేటీ అయిన సోనియా కేంద్ర ప్రభుత్వ తప్పుడు విధానాలను ప్రజలకు వివరించేందుకు చేపట్టనున్న జనజాగరణ్ అభియాన్పై చర్చించారు. పార్టీ నేత రాహుల్ గాంధీ కూడా ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.
congress chintan shivir: అటు, దేశ రాజకీయ, ఆర్థిక, సామాజిక, వ్యవసాయ, యువజన అంశాలు సహా పార్టీ సంస్థాగత అంశాలపై ఏర్పాటైన 6 కమిటీలు చర్చలు జరుపుతున్నాయి. దేశ రైతాంగ సమస్యలు, వ్యవసాయ రంగంపై పార్టీ నేత భూపీందర్ సింగ్ హుడా నేతృత్వంలోని కమిటీ చర్చించింది. కమిటీ ముందు పార్టీ నేతలు తమ అభిప్రాయాలు వెల్లడించారు.
Sonia Gandhi news: చింతన్ శిబిర్లో ఆరు కమిటీలు రాత్రి 8గంటల వరకు చర్చలు జరపనున్నాయి. ఆయా అంశాలపై కమిటీ సభ్యులు తీర్మానాలను ఖరారు చేసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి అందజేస్తారు. ఆదివారం ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుండగా, ఆరు కమిటీల తీర్మానాలపై అక్కడ చర్చ జరగనుంది. చర్చ తర్వాత సోనియా గాంధీ ఉదయ్పూర్ డిక్లరేషన్ను ప్రకటించనున్నారు.
ఇదీ చదవండి: కార్పొరేట్లకేమో 80% రుణాలు.. యువత, రైతులకు 9 శాతమా?: భాజపా ఎంపీ
