'కూటములు మార్చుతూ నీతీశ్​ ప్రధాని కాగలరా? 2025లో బిహార్​ మాదే!'

author img

By

Published : Sep 23, 2022, 3:38 PM IST

Updated : Sep 23, 2022, 5:05 PM IST

Amit Shah Nitish Kumar

రాజకీయాల్లోకి ప్రవేశించినప్పటి నుంచి బిహార్​ సీఎం నీతీశ్ కుమార్ చాలా మందిని వెన్నుపోటు పొడిచారని కేంద్ర హోం మంత్రి అమిత్​ షా ఆరోపించారు. రాజకీయ కూటములను మార్చడం ద్వారా నీతీశ్ ప్రధాని కాగలరా? అని ప్రశ్నించారు. కేవలం ప్రధాని అయ్యేందుకే నీతీశ్​.. భాజపాతో తెగదెంపులు చేసుకుని విపక్షాలతో జట్టు కట్టారంటూ విమర్శలు గుప్పించారు.

Amit Shah Nitish Kumar : బిహార్​ ముఖ్యమంత్రి నీతీశ్​ కుమార్​పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా విరుచుకుపడ్డారు. ప్రధాని పదవి కోసమే నీతీశ్​.. ఆర్జేడీ అధినేత లాలూతో జట్టు కట్టారని ఆరోపించారు. బిహార్​లో భాజపా అధికారం కోల్పోయాక.. ఆ రాష్ట్రంలో తొలిసారి పర్యటించారు అమిత్ షా. పూర్ణియాలో ఏర్పాటు చేసిన భాజపా 'జన భావన మహాసభ'లో పాల్గొన్న ఆయన.. నీతీశ్​ కుమార్​పై విమర్శలు గుప్పించారు.

"కాంగ్రెస్​ వ్యతిరేక రాజకీయాలకు వెన్నుపోటు పొడిచి నీతీశ్​.. విపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కేవలం ప్రధాని అయ్యేందుకే లాలూ, కాంగ్రెస్​తో ​జట్టు కట్టారు. అధికార కాంక్షతో రాజకీయ కూటములు మార్చుతూ నీతీశ్​ ప్రధాని కాగలరా? అసలు ఈ ప్రభుత్వం బిహార్​ను పాలించగలదా?.. రాజకీయాల్లోకి ప్రవేశించినప్పటి నుంచి ఆయన చాలా మందిని వెన్నుపోటు పొడిచారు. లాలూ జీ.. మీరూ జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నీతీశ్ రేపు మిమ్మల్ని వెనక్కినెట్టే అవకాశమూ ఉంది."

-- అమిత్​ షా, కేంద్ర హోంశాఖ మంత్రి

'విభేదాలు సృష్టించడానికి మీరు ఉన్నారు కదా!'
రాష్ట్రంలో మహాగట్ బంధన్​ సర్కార్ అధికారంలో వచ్చినప్పటి నుంచి భయాందోళన వాతావరణం ఏర్పడిందని అమిత్​ షా ఆరోపించారు. "బిహార్​లో విభేదాలు సృష్టించడానికి నేను వస్తున్నానని లాలూ యాదవ్, నీతీశ్​ కుమార్​ అంటున్నారు. అంత అవసరం నాకు లేదు. ఎందుకంటే అందుకు మీరు ఉన్నారు కదా. అది సరిపోతుంది. మీ ప్రభుత్వం వచ్చాక భయపడుతున్న ప్రజలకు ధైర్యం చెప్పేందుకు వచ్చాను" అని అన్నారు షా.

'2025లో బిహార్​లో అధికారంలోకి భాజపా..'
2014 లోక్​సభ ఎన్నికలకు ముందు నీతీశ్ కుమార్ పార్టీకి రెండు సీట్లు మాత్రమే ఉన్నాయని అమిత్​ షా గుర్తుచేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో లాలూ ప్రసాద్ యాదవ్, నితీశ్ కుమార్​ను బిహార్ ప్రజలు చిత్తుగా ఓడిస్తారని జోస్యం చెప్పారు. 2025 బిహార్ ఎన్నికల్లో భాజపా పూర్తి మెజార్టీతో రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని అమిత్​ షా ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి: మాజీ సీఎంకు సుప్రీంకోర్టులో ఊరట.. అవినీతి కేసు విచారణపై స్టే

'కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తా.. ఎన్నికలకు గాంధీ కుటుంబం దూరం'

Last Updated :Sep 23, 2022, 5:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.