భాజపాకు విరాళాల వరద- ఐదు పార్టీలకు వచ్చినదానికి ట్రిపుల్!

author img

By

Published : Aug 4, 2021, 7:04 PM IST

BJP declared donations

భారతీయ జనతా పార్టీకి 2019-20 ఆర్థిక ఏడాదిలో భారీగా విరాళాలు అందాయి. అవి, కాంగ్రెస్​, టీఎంసీ, ఎన్​సీపీ, సీపీఐ, సీపీఎం మొత్తం విరాళాలతో పోల్చితే మూడు రెట్లుగా ఉండటం గమనార్హం. ఈ మేరకు జాతీయ పార్టీల విరాళాలపై నివేదిక విడుదల చేసింది అసోసియేషన్​ ఫర్​ డెమొక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్​).

కాంగ్రెస్​, టీఎంసీ, ఎన్​సీపీ వంటి 5 పార్టీల మొత్తం విరాళాలకు మూడు రెట్లు విరాళాలు భారతీయ జనతా పార్టీకి అందినట్లు అసోసియేషన్​ ఫర్​ డెమొక్రటిక్ రిఫామ్స్​(ఏడీఆర్​) నివేదిక తెలిపింది. మేయర్​, డిప్యూటీ మేయర్ తమ​ పార్టీ నుంచే ఉన్న మహారాష్ట్రలోని అమరావతి మున్సిపల్​ కార్పొరేషన్​ నుంచి వచ్చిన విరాళాలను సైతం భాజపా వెల్లడించినట్లు పేర్కొంది. పార్టీ తెలిపిన వివరాల్లో ముగ్గురు దాతల నుంచి భూమిని సైతం పొందినట్లు ఉందని తెలిపింది.

" భాజపా వెల్లడించిన విరాళాలు.. కాంగ్రెస్​, ఎన్​సీపీ, సీపీఐ, సీపీఎం, టీఎంసీకి వచ్చిన మొత్తం విరాళాలకు మూడింతలు ఉన్నాయి. 5 పార్టీలు కలిపి రూ.228.035 కోట్ల విరాళాలు చూపించగా.. భాజపా రూ.785.77 కోట్లు వచ్చినట్లు తెలిపింది. భాజపా తెలిపిన 570 విరాళాలు(రూ.149.875 కోట్లు), టీఎంసీ పొందిన 52 విరాళాలు (రూ.7.1035కోట్లు), కాంగ్రెస్​కు వచ్చిన​ 25 విరాళాలు(రూ.2.6875కోట్లు), ఎన్​సీపీకి అందిన 2 డొనేషన్లు (రూ.3.005 కోట్లు)కు చెక్​, డీడీల పూర్తిస్థాయి వివరాలు లేవు."

- ఏడీఆర్​ నివేదిక.

2019-20 ఆర్థిక ఏడాదిలో ఎన్నికల సంఘానికి సమర్పించిన లెక్కల ప్రకారం.. జాతీయ పార్టీలు అందుకున్న విరాళాలపై(ఒక్కో విరాళం కనీసం రూ.20వేలు) నివేదిక రూపొందించింది ఏడీఆర్​.

నివేదిక ప్రకారం.. అమరావతి పురపాలక సంఘం నుంచి భాజపాకు రూ.4.80 లక్షల విరాళాలు అందాయి. 'ఈ విరాళాలకు సంబంధించి చిరునామా​, బ్యాంక్​ పేరు, పాన్​ వంటి ఏ ఇతర వివరాలను పార్టీ అందించలేదు. అంతర్జాలంలో సర్చ్​ చేస్తే.. దాత మహారాష్ట్ర ప్రభుత్వం స్థానిక విభాగం అని ఉంటుంది. అది మున్సిపల్​ కార్పొరేషన్ అందించిన నిధుల చట్టబద్ధతపై పలు ప్రశ్నలకు తావిస్తోంది.' అని నివేదిక పేర్కొంది. అలాగే.. ముగ్గురి నుంచి భాజపా పొందిన భూమి విలువ రూ.1.516 కోట్లుగా ఉందని తెలిపింది ఏడీఆర్​. ఆ మూడు విరాళాలు బిహార్​ ఝంఝార్​పుర్​కు చెందినవేనని పేర్కొంది. అయితే.. వారి వివరాలు సైతం లేవని స్పష్టం చేసింది.

మరోవైపు.. సీపీఎం, సీపీఐ సైతం తాము పొందిన విరాళాలకు సంబంధించి చెక్​, డీడీల పూర్తి వివరాలు వెల్లడించటంలో విఫలమయ్యాయని ఏడీఆర్ తెలిపింది. సీపీఎం రూ.1.0786 కోట్లు విలువైన 39 విరాళాలు, సీపీఐ 29 మంది నుంచి రూ.52.17 లక్షల విరాళాలు పొందినట్లు చెప్పింది.

ఇదీ చూడండి: ఎలక్ట్రోరల్ ట్రస్టుల ద్వారా భాజపాకు రూ.276.45 కోట్లు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.