భాజపాకు​ గుడ్​బై.. బిహార్‌ సీఎంగా నితీశ్​ ప్రమాణస్వీకారానికి ముహుర్తం ఫిక్స్​

author img

By

Published : Aug 9, 2022, 3:56 PM IST

Updated : Aug 9, 2022, 9:11 PM IST

jdu rjd alliance news

JDU BJP alliance breakup : రాజకీయ పునరేకీకరణతో బిహార్​ పాలిటిక్స్ మరోసారి కీలక మలుపు తిరిగాయి. కేంద్రంలో, రాష్ట్రంలో మిత్రపక్షంగా ఉన్న భాజపాకు రెండోసారి షాక్ ఇస్తూ.. ఎన్​డీఏ నుంచి బయటకు వచ్చేసింది జేడీయూ. ఇప్పటివరకు ప్రత్యర్థులుగా ఉన్న ఆర్​జేడీ, కాంగ్రెస్​, వామపక్షాలతో చేతులు కలిపింది. ఆ పార్టీలతో కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నారు జేడీయూ అధినేత నితీశ్ కుమార్. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఆయన​ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

JDU BJP alliance breakup : అనుకున్నట్టే జరిగింది. నితీశ్​ కుమార్​ ఎత్తుగడతో బిహార్ రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. మిత్రపక్షం భాజపాకు రెండోసారి షాక్ ఇచ్చింది జనతాదళ్​ యునైటెడ్​(జేడీయూ). జాతీయ ప్రజాస్వామ్య కూటమి నుంచి నిష్క్రమించింది. ఇప్పటివరకు ప్రత్యర్థులుగా ఉన్న రాష్ట్రీయ జనతా దళ్​(ఆర్​జేడీ), కాంగ్రెస్​, వామపక్షాలతో కూడిన మహాకూటమితో జట్టు కట్టింది. ఆ పార్టీలతో కలిసి సరికొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది నితీశ్​ సేన. ఇందుకు అనుగుణంగా.. ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగారు నితీశ్ కుమార్. మంగళవారం పట్నాలో గవర్నర్​ ఫాగూ చౌహాన్​ను కలిసి రాజీనామా లేఖ అందజేశారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలందరి ఏకగ్రీవ సూచన మేరకు ఇలా చేసినట్లు.. గవర్నర్​ను కలిసిన అనంతరం చెప్పారు నితీశ్.

నితీశ్​ ప్రమాణస్వీకారానికి ముహుర్తం ఫిక్స్​
భాజపాతో తెగదెంపులు చేసుకున్న జేడీయూ అధినేత నితీశ్‌ ఆర్జేడీ-లెఫ్ట్‌-కాంగ్రెస్‌ సారథ్యంలోని మహాఘట్‌బంధన్‌తో జట్టుకట్టారు. దీంతో బిహార్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరేందుకు ముహూర్తం ఫిక్స్‌ అయింది. బుధవారం మధ్యాహ్నం 2గంటలకు బిహార్‌ సీఎంగా నితీశ్‌ కుమార్‌ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది.

అంతకుముందు, రాజ్​భవన్​ నుంచి నేరుగా రబ్రీ దేవి నివాసానికి వెళ్లారు జేడీయూ అధినేత. తేజస్వీ యాదవ్​ సహా ఇతర ఆర్​జేడీ నేతల్ని కలిశారు. ప్రభుత్వం ఏర్పాటుకు మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు చెప్పారు. "2017లో ఏం జరిగిందో మర్చిపోదాం. ఇప్పుడు సరికొత్త అధ్యాయం ప్రారంభిద్దాం" అని తేజస్వీ యాదవ్​తో నితీశ్​ అన్నట్లు తెలిసింది. తర్వాత కాసేపటికి.. నితీశ్, తేజస్వీ కలిసి రాజ్​భవన్​కు వెళ్లారు. ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం కల్పించాలని కోరారు. తమకు సంఖ్యాబలం ఉందని చెబుతూ.. అందుకు సంబంధించిన పత్రాల్ని సమర్పించారు. స్వతంత్రులు, ఏడు పార్టీల సభ్యులు కలిపి.. తనకు మొత్తం 164 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ప్రకటించారు నితీశ్. మరోవైపు.. భాజపాపై తీవ్ర విమర్శలు గుప్పించారు తేజస్వీ. "హిందీ బెల్ట్​లో భాజపాకు మిత్రపక్షం ఏదీ లేదు. పొత్తు పెట్టుకున్న ప్రతి పార్టీనీ భాజపా దెబ్బతీస్తుందని చరిత్ర చెబుతోంది. పంజాబ్, మహారాష్ట్రలోనూ అదే జరిగింది." అని అన్నారు ఆర్​జేడీ నేత.

కావాలనే చేశారు..!
నితీశ్​ రాజీనామా ప్రకటనకు ముందు.. హైఓల్టేజ్ రాజకీయానికి వేదికైంది బిహార్. ప్రధాన పార్టీలన్నీ విడివిడిగా సమావేశాలు నిర్వహించి.. భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించాయి. జేడీయూ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పట్నాలో భేటీ అయ్యారు నితీశ్. "ముందు చిరాగ్ పాసవాన్ తిరుగుబాటు, తర్వాత ఆర్​సీపీ సింగ్ రూపంలో జేడీయూను బలహీనపరిచేందుకు భాజపా ప్రయత్నించింది. కూటమి నుంచి నేను వైదొలగాల్సిన పరిస్థితిని భాజపానే సృష్టించింది" అని పార్టీ నేతలకు నితీశ్​ చెప్పినట్లు తెలిసింది. సానుకూలంగా స్పందించిన జేడీయూ ఎమ్మెల్యేలు, ఎంపీలు.. నితీశ్​ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం.

పదండి చూసుకుందాం..!
JDU RJD alliance news : అదే సమయంలో.. ఆర్​జేడీ నేతృత్వంలోని మహాకూటమి పార్టీల నేతలు పట్నాలోని రబ్రీ దేవి నివాసంలో సమావేశమయ్యారు. పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే అధికారాన్ని తేజస్వీ యాదవ్​కు అప్పగించారు ఆర్​జేడీ, కాంగ్రెస్​, వామపక్షాల నేతలు. "కొత్త ప్రభుత్వంలో మంత్రుల శాఖల కేటాయింపులో జేడీయూతో ఎలాంటి ఇబ్బందులు లేవు. మనందరికీ కలిపి 160 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. రాష్ట్రంలో రాజకీయ అస్థిరత సృష్టించేందుకు లేదా రాష్ట్రపతి పాలన విధించేందుకు భాజపా ప్రయత్నిస్తే.. మనం దీటైన జవాబు ఇవ్వొచ్చు" అని ఈ సందర్భంగా తేజస్వీ మహాకూటమి నేతల వద్ద ధీమా వ్యక్తం చేసినట్లు తెలిసింది. మరోవైపు.. లౌకిక శక్తులకు అండగా నిలవాలనే భాజపాయేతర ప్రభుత్వం ఏర్పాటుకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది కాంగ్రెస్.

ప్రతివ్యూహ రచనలో భాజపా!
Bihar BJP JDU news : ఎన్​డీఏ నుంచి వైదొలిగి, మహాకూటమి పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న నితీశ్ కుమార్ నిర్ణయాన్ని తప్పుబట్టింది భాజపా. ఆయన్ను అవకాశవాదిగా అభివర్ణించింది. "2020లో ఎన్​డీఏ పేరుతో మేము(భాజపా, జేడీయూ) కలిసి పోటీ చేశాం. మాకు ఎక్కువ సీట్లు వచ్చినా.. నితీశ్​ కుమార్​నే ముఖ్యమంత్రిని చేశాం. కానీ.. ఇప్పుడు ఇలా చేయడం బిహార్ ప్రజల్ని, భాజపాను మోసం చేయడమే" అని మండిపడ్డారు భాజపా బిహార్ అధ్యక్షుడు సంజయ్ జయస్​వాల్.

ఎన్​డీఏ నుంచి జేడీయూ నిష్క్రమణ వార్తల నేపథ్యంలో అప్రమత్తమైన భాజపా.. సోమవారం సాయంత్రం నుంచి వరుస భేటీలు నిర్వహించింది. అదే సమయంలో.. 18 మంది ఆర్​జేడీ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దుపై అనేక ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. 2021 మార్చి 23న అసెంబ్లీలో 'పోలీసు బిల్లు'పై చర్చ సందర్భంగా అనుచితంగా ప్రవర్తించిన ఆర్జేడీ సభ్యులపై వేటు వేయడంపై బిహార్ అసెంబ్లీ స్పీకర్ విజయ్ సిన్హా కసరత్తు ప్రారంభించినట్లు వార్తలు వినిపించాయి.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వేర్వేరు పార్టీల బలాబలాలపై చర్చ మొదలైంది. బిహార్ అసెంబ్లీలో 243 సీట్లు ఉన్నాయి. అతిపెద్ద పార్టీ ఆర్జేడీకి అసెంబ్లీలో 80 స్థానాలు ఉండగా.. భాజపా 77, జేడీయూ 45, కాంగ్రెస్ 19 సీట్లతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఒకవేళ 18 మంది ఆర్జేడీ ఎమ్మెల్యేలపై వేటు పడ్డా.. నితీశ్ కుమార్​కు ఎలాంటి ఇబ్బందులు ఉండవని విశ్లేషకులు చెబుతున్నారు.

భాజపాకు రెండు సార్లు ఝలక్​ ఇచ్చిన నితీశ్​
'రాజకీయ పునరేకీకరణ'కు నితీశ్ కారకులు కావడం ఇది రెండోసారి. ఆయన నేపథ్యాన్ని గమనిస్తే రాజకీయంగా ఆయన ఎటువంటి నిర్ణయాన్నైనా తీసుకోగలరని స్పష్టమవుతుంది. మోదీని విమర్శిస్తూ భాజపాతో పొత్తు పెట్టుకోగలిగారు. అనంతరం ఎన్‌డీఏను వీడి ఆర్జేడీతోనూ జట్టుకట్టారు. మళ్లీ ఆర్జేడీని మధ్యలోనే(2017) వదిలేసి కమలనాథుల చెంతకు చేరారు. ఇప్పుడు మళ్లీ భాజపాకు గుడ్​బై చెప్పి.. మహాకూటమితో చేతులు కలిపారు.

Last Updated :Aug 9, 2022, 9:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.