'కార్గిల్' విజయ గర్వానికి 21 ఏళ్లు

author img

By

Published : Jul 25, 2020, 7:02 PM IST

kargil

శాంతి.. సహనం.. ఇదే భారతదేశ విధానం. కానీ, ఆ స్వభావాన్ని తక్కువ అంచనా వేసి.. ఎవరైనా దుస్సాహసానికి దిగితే సమాధానం కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఇటీవల గల్వాన్‌ లోయలో సైనికుల వీరోచిత పోరాటమే అందుకు నిదర్శనం. అలా బుద్ధిచెప్పటం, అవసరమైతే బాంబులతో బుదులు చెప్పటం దేశానికి కొత్తేమి కాదు. 21ఏళ్ల క్రితమే దురాక్రమణలకు పాల్పడ్డ దాయాదిని.. రణక్షేత్రంలో తరిమితరిమి కొట్టింది భారత సైన్యం. కార్గిల్‌ యుద్ధంలో భారత సైన్యం తెగువకు.... చావు తప్పి కన్ను లొట్టబోయిన పాక్‌ తోకముడిచింది. అక్రమంగా తిష్టవేసిన ప్రాంతాలను తిరిగి అప్పగించింది. ఆ కష్ట సమయంలో, క్లిష్టమైన వాతావరణంలో భారత సైన్యం చూపిన తెగువ, పరాక్రమానికి 21ఏళ్లు పూర్తయిన సందర్భంగా 'ఈటీవీ భారత్​' ప్రత్యేక కథనం.

జూలై 26.. దేశప్రజల హృదయాలు విజయగర్వంతో పులకించిపోయే రోజు ఇది. దాయాది పాకిస్థాన్‌పై అసామాన్య విజయం సాధించిన సందర్భమిది. యావత్ భారత పౌరులు దేశభక్తితో జై జవాన్ అని నినదించే రోజు ఇది.

పాకిస్థానీ సైన్యం, వారి దన్నుతో దేశంపైకి దాడికి వచ్చిన ముష్కరమూకను భారత సైన్యం తోకముడుచుకునేలా చేసిన నాటి పోరాటం ఇప్పటికీ కళ్లముందు కదలాడుతునే ఉంటుంది. 1999లో దేశంలోకి చొరబడి మంచుకొండలపై మాటు వేసి దొంగ దెబ్బ తీయాలన్న పాక్ పన్నాగాన్ని భారత సైన్యం దీటుగా ఎదుర్కోవటమే కాదు... వాళ్లను చావుదెబ్బ కొట్టింది.

విజయగర్వానికి అనేక కారణాలు

కార్గిల్ యుద్ధం ప్రస్తావన వస్తే దేశం గుండెలు విజయగర్వంతో ఉప్పొంగటానికి అనేక కారణాలున్నాయి. కార్గిల్ యుద్ధంలో భారత జవాన్లు చూపిన అసమాన పోరాట పటిమ దేశానికి కొత్త శక్తినిచ్చింది. పాకిస్థాన్​కే కాదు భారత్‌ అంటేనే కన్నుకుట్టినట్లు వ్యవహరించే అనేక దేశాలకు గట్టి సందేశాన్నిచ్చింది ఆ విజయం. అంతగొప్ప పోరాటం అమరులైన జవాన్ల పోరాటాన్ని స్మరించుకునేందుకు కేంద్రం ఏటా జులై 26న 'విజయ్ దివస్' నిర్వహిస్తోంది.

మహాపోరాటం మొదలైందిలా..

సరిహద్దుల్లో ఓ గొర్రెల కాపరి ఇచ్చిన సమాచారంలో మొదలైంది ఈ మహా పోరాటం. సైనిక దుస్తుల్లో భారత్ భూభాగంలోకి చొరబడిన ముష్కరులను బంకర్లు తవ్వడాన్ని గమనించటం.. వారి దుస్తులను బట్టి పాకిస్థాన్ సైనికులని నిర్ధరించుకున్న గొర్రెల కాపరి వెంటనే భారత సైనిక శిబిరం వద్దకు వెళ్లి విషయం చెప్పాడు. కెప్టెన్‌ సౌరభ్‌ కాలియా ఐదుగురు సైనికులతో కలిసి అక్కడికి చేరుకొని.. వారించే ప్రయత్నం చేయగా.. పాక్‌ సైన్యం, మరికొంత ముష్కరుల సాయంతో వారిని బంధించి తీసుకుపోయి చిత్రహింసలకు గురిచేసి చంపేసింది. ఆ ప్రాంతం కార్గిల్‌కు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 2 దేశాల మధ్య యుద్ధానికి పడిన తొలి అడుగు ఈ ఘటన.

130 శిబిరాల ఆక్రమణ

దాయాది నమ్మకద్రోహమే ఈ యుద్ధానికి కారణంగా చెబుతుంటారు విశ్లేషకులు. భారత్-పాక్ నియంత్రణ రేఖ వెంబడి హియాలయ శిఖరాలపై ఉన్న శిబిరాలను శీతాకాలానికి ముందు 2 దేశాలు ఖాళీ చేస్తుంటాయి. వాతావరణ పరిస్థితుల రీత్యా రెండు దేశాలు ఆ విషయంలో ఒక అంగీకారానికి కూడా వచ్చాయి. 1999లో అదే అదునుగా చేసుకుని కుయుక్తులకు దిగింది పాక్. శీతాకాలానికి ముందు ముష్కో, ద్రాస్, కార్గిల్, బతాలిక్, తుర్‌తుక్ సబ్ సెక్టార్ల నుంచి భారత బలగాలు వైదొలిగాక తన కుట్రను అమలు చేయటం ప్రారంభించింది. భారత భూభాగంలోకి 4-5 కిలోమీటర్ల మేర చొచ్చుకుని వచ్చి 130 భారత శిబిరాలను ఆక్రమించింది. శాంతి కోసం 'లాహోర్‌ ప్రకటన' చేసిన సమయంలోనే ఆ దేశ సైన్యాధ్యక్షుడు ముషారఫ్‌ ఈ కుట్రకు తెరదీశారు.

భారత్ ప్రతిఘటన

చివరకు.. ఎన్ని హెచ్చరికలు చేసినా పాక్ సైన్యం పట్టించుకోకపోవడం వల్ల భారత్ సైనిక చర్య చేపట్టింది. 'ఆపరేషన్ విజయ్' పేరుతో 1999, మే 3న రంగంలోకి దిగింది భారత సైన్యం. శత్రువుల కాల్పులను ఎదుర్కొంటూనే అత్యంత ఎత్తుగా ఉన్న పర్వత శ్రేణుల్లోని శిబిరాలను చేరుకునేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలోనే వందల సంఖ్యలో సైనికులు ప్రాణాలు కోల్పోయారు. పాక్ సైనికులతో పాటు ఉగ్రవాదులు ఉన్నారని నిర్ధరించుకున్న భారత్.. 'ఆపరేషన్ సఫేద్ సాగర్' పేరుతో వైమానికదళాన్ని రంగంలోకి దించింది.

బహుముఖ వ్యూహాలతో

32వేల అడుగుల ఎత్తులో పోరాటం చేయాల్సి రావడం వల్ల ఎయిర్‌ఫోర్స్‌‌కు మొదట ఎదురుదెబ్బలు తగిలాయి. శత్రువుల దాడిలో రెండ్రోజుల్లో 3 యుద్ధ విమానాలు నేలకూలాయి. పరిస్థితులు అంచనా వేసిన వాయుసేన మిరాజ్-2000 యుద్ధవిమానాల ద్వారా బాంబుల వర్షం కురిపించింది. భారత సైన్యం భీకర దాడులతో పాక్ సైన్యం కకావికలమైంది. సైనిక శిబిరాలు ఒక్కొక్కటిగా భారత వశమయ్యాయి. దీనికి తోడు అంతర్జాతీయంగా దేశాలన్నీ పాక్‌కు వ్యతిరేకంగా మారేలా భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. దీంతో దారికొచ్చిన పాక్ శిబిరాల నుంచి తన సైన్యాన్ని వెనక్కి తీసుకుంది.

విజయం దాసోహం..

భారత సైనికుల పోరాట పటిమతో హిమాలయ పర్వతాల్లో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. ఈ యుద్ధం అధికారికంగా 1999 జులై 26న ముగిసింది. ఈ పోరులో 559 మంది భారత సైనికులు వీర మరణం పొందగా.. 1536 మంది గాయపడ్డారు. పాకిస్థాన్‌కు చెందిన 3 వేల మంది సైనికులు, ఉగ్రవాదులు హతమయ్యారు. కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన సైనికుల త్యాగాలను స్మరించుకుంటూ భారత్ ఏటా జులై 26న 'విజయ్ దివస్' నిర్వహిస్తోంది. దేశం కోసం పోరాడిన అమర జవాన్లను స్మరించుకుంటుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.