గుజరాత్‌లో కేజ్రీవాల్​కు చేదు అనుభవం.. కావాలనే చేయించారని దిల్లీ సీఎం ఫైర్

author img

By

Published : Sep 20, 2022, 10:41 PM IST

arvind-kejriwal-heckled

గుజరాత్ పర్యటనలో ఆప్ అధినేత కేజ్రీవాల్​కు చేదు అనుభవం ఎదురైంది. ఎయిర్​పోర్టు నుంచి బయటకు రాగానే కొందరు వ్యక్తులు ఆయన ముందే 'మోదీ.. మోదీ..' అంటూ నినాదాలు చేశారు. దీనిపై కేజ్రీవాల్ మండిపడ్డారు.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్. గుజరాత్​లో ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున.. ఆ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం ఆయన వడోదర ఎయిర్​పోర్టుకు చేరుకున్నారు. అయితే, అక్కడ ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. ఎయిర్​పోర్ట్ నుంచి కేజ్రీవాల్ బయటకు వచ్చీరాగానే.. కొందరు వ్యక్తులు 'మోదీ.. మోదీ..' అని నినాదాలు చేశారు. ఈ ఘటనపై స్పందించిన కేజ్రీవాల్.. భాజపా కావాలనే ఇలా చేయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీపైనా విమర్శలు చేశారు.

"వడోదర విమానాశ్రయానికి నేను రాగానే.. కొందరు 'మోదీ.. మోదీ' అంటూ నినాదాలు చేశారు. రాహుల్‌ గాంధీ గుజరాత్‌లో పర్యటిస్తే ఆయనకు వ్యతిరేకంగా భాజపా ఎన్నడూ ఇలా నినాదాలు చేయలేదు. నన్ను, ఆమ్‌ ఆద్మీ పార్టీని వేధించేందుకు భాజపా, కాంగ్రెస్‌ ఏకమై ఇలాంటి కుట్రలు చేస్తున్నాయి. గుజరాత్‌లో భాజపాకు మా నుంచి పెను సవాల్‌ ఎదురవనుంది. గతంలో పట్టణ ప్రాంతాల్లోని 66 సీట్లలో కాషాయ పార్టీ ఎన్నడూ ఓడిపోలేదు. కానీ, రాబోయే ఎన్నికల్లో ఆ సీట్లను వారు సొంతం చేసుకోలేరు" అని కేజ్రీవాల్‌ దుయ్యబట్టారు.

వడోదర పర్యటనలో భాగంగా ఆయన పలు వర్గాల ప్రజలతో ఆయన టౌన్ హాల్‌ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గుజరాత్‌ ప్రజలకు కేజ్రీవాల్‌ హామీలు కురిపించారు. వచ్చే ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ విజయం సాధిస్తే.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మళ్లీ పాత పింఛను విధానాన్ని తీసుకొస్తామని హామీ ఇచ్చారు. గుజరాత్‌లో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.