దిల్లీలో మళ్లీ 'ఆపరేషన్ బుల్డోజర్'.. అడ్డుకున్న ఎమ్మెల్యే అరెస్ట్
Updated on: May 10, 2022, 3:27 PM IST

దిల్లీలో మళ్లీ 'ఆపరేషన్ బుల్డోజర్'.. అడ్డుకున్న ఎమ్మెల్యే అరెస్ట్
Updated on: May 10, 2022, 3:27 PM IST
Delhi Encroachment Drive: దిల్లీలో అక్రమ నిర్మాణాల కూల్చివేత కొనసాగుతూనే ఉంది. షాహీన్బాగ్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం వల్ల సోమవారం వెనక్కితగ్గిన అధికారులు.. దేశ రాజధానిలోని పలు ప్రాంతాల్లో తిరిగి కూల్చివేతలను ప్రారంభించారు. అడ్డుకోబోయిన స్థానిక ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారు పోలీసులు.
Delhi Encroachment Drive: దేశ రాజధానిలోని దక్షిణ దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో (ఎస్డీఎంసీ) అక్రమ నిర్మాణాల కూల్చివేత కొనసాగుతోంది. షాహీన్బాగ్లో సోమవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం వల్ల వెనుదిరిగిన అధికారులు.. మంగళవారం న్యూ ఫ్రెండ్స్ కాలనీ గురుద్వారా రోడ్డులోని అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఆక్రమణల కూల్చివేతపై స్థానిక ఎమ్మెల్యే ముఖేష్ అహ్లావత్ బుల్డోజర్లను అడ్డుకుని తిరిగి ఎందుకు వచ్చారంటూ ప్రశ్నించారు. దీంతో పరిస్థితి అదుపు తప్పకుండా ఆయనను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు ఉత్తర దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లోని మంగోల్పురిలోనూ ఆక్రమ నిర్మాణాల కూల్చివేతలు సాగుతున్నాయి.
"గురుద్వారా రోడ్డు, న్యూ ఫ్రెండ్స్ కాలనీ ప్రాంతాల్లోని అక్రమ నిర్మాణాలపై డ్రైవ్ చేపట్టాం. మా ఎన్ఫోర్స్మెంట్ బృందాలు తగిన పోలీసు బలగాలు, బుల్డోజర్లతో వెళ్లి కూల్చివేతలను ప్రారంభించాయి"
- రాజ్పాల్ సింగ్, ఎస్డీఎంసీ సెంట్రల్ జోన్ ఛైర్మన్
ఎస్డీఎంసీ మొదటి కూల్చివేత డ్రైవ్లో భాగంగా మే 4 నుంచి 13 వరకు దక్షిణ దిల్లీలోని అనేక ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది. షాహీన్బాగ్లో నిర్మాణాల కూల్చివేతను వ్యతిరేకిస్తూ సీపీఐ(ఎం) దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాజకీయ పార్టీ విజ్ఞప్తి మేరకు ఇలాంటి వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. అందుకు సుప్రీంకోర్టు వేదిక కాదని, కావాలంటే దిల్లీ హైకోర్టును ఆశ్రయించవచ్చని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: షాహీన్బాగ్కు మళ్లీ బుల్డోజర్లు.. సుప్రీంలో వారికి చుక్కెదురు!
