ఎయిర్​ఇండియా కీలక నిర్ణయం.. 'వారికి ఇకపై మద్యం ఇవ్వం' అంటూ..

author img

By

Published : Jan 25, 2023, 7:36 AM IST

Updated : Jan 25, 2023, 9:12 AM IST

Air India has made amendments on serving alcohol to passengers

ఎయిర్​ఇండియాకు వారంలోనే రెండు జరిమానాలు విధించడం వల్ల ఆ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు మద్యం అందించడంపై సిబ్బందికి కొన్ని సూచనలు చేసింది.

వారంలోనే రెండుసార్లు జరిమానాల పాలైన విమానయాన సంస్థ ఎయిర్​ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులలో ఎవరైనా ఒక స్థాయికి మించి మద్యం సేవించారని భావిస్తే.. వారికి ఆపైన సెర్వ్ చేసేందుకు నిరాకరించవచ్చని సిబ్బందికి సూచించింది. మద్యం విషయంలో జనవరి 19న కొన్ని సవరణలు చేపట్టింది ఎయిర్​ఇండియా. అయితే మద్యం ఇవ్వమని చెప్పే విషయంలో గౌరవప్రదమైన పద్ధతిలో ప్రయాణికులతో నడుచుకోవాలని సూచించింది. వారిని తాగుబోతు అని పిలవడం, వాదనకు దిగటం, వారితో హెచ్చుగా మాట్లాడటం లాంటివి చేయకూడదని స్పష్టం చేసింది. దీంతోపాటు మద్యం తెచ్చుకుని తాగే ప్రయాణికులను గుర్తించే బాధ్యత సిబ్బందిదేనని సూచించింది.

మరో రూ. 10 లక్షలు జరిమానా
గతేడాది పారిస్- దిల్లీ విమానంలో ప్రయాణికుల అనుచిత ప్రవర్తనలకు సంబంధించిన రిపోర్టును అందించని కారణంగా డీసీజీఏ రూ. 10 లక్షల జరిమానా విధించింది. విమానంలో డిసెంబరు 6న ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికురాలు వాష్​రూమ్​కు వెళ్లిన సమయంలో.. మరో వ్యక్తి ఆమె సీట్​పై ఉన్న దుప్పటిపై మూత్రవిసర్జన చేశాడు. అదే రోజు మరో ఘటనలో ఓ ప్రయాణికుడు మద్యం మత్తులో ఉండి పొగ తాగుతూ మరుగుదొడ్ల గదిలో సిబ్బందికి పట్టుబడ్డాడు. అయితే ఈ విషయాలపై నివేదిక కోరేంతవరకు ఎయిర్ఇండియా రిపోర్ట్ అందించలేదని డీజీసీఏ ఇదివరకే తప్పుబట్టింది. ఈ మేరకు షోకాజ్ నోటీసులు పంపించి తాజాగా రూ. 10 లక్షల జరిమానా విధించింది. అంతకుముందు ఈ ఘటనలో బాధిత మహిళ పట్ల విమాన సిబ్బంది వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో ఈ ఘటనపై డీసీజీఏ రూ.30 లక్షల జరిమానా విధించింది. వారంలోనే రెండు జరిమానాలు విధించిడంపై ఎయిర్​ఇండియా మద్యం విషయంలో ఈ మేరకు కీలక నిర్ణయాలను తీసుకుంది.

ఇదిలా ఉండగా.. నవంబరు 26న న్యూయాన్ నుంచి దిల్లీ వచ్చిన విమానంలో ఓ మహిళపై ప్రయాణికుడు మూత్ర విసర్జన చేశాడు. బిజినెస్ క్లాసులో జరిగిన ఈ ఘటన తీవ్ర దుమారం రేపింది. ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత నిందితుడు శంకర్​ను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేసి అతడిని 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీకి పంపించారు. అమెరికన్ ఫైనాన్షియల్ సంస్థ వెల్స్ ఫార్గో భారత విభాగానికి ఉపాధ్యక్షునిగా ఉన్న అతడిని సంస్థ విధుల నుంచి తొలగించింది.

Last Updated :Jan 25, 2023, 9:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.