'శ్రద్ధను చంపినందుకు బాధేమీ లేదు'.. పాలిగ్రాఫ్ పరీక్షలో అఫ్తాబ్‌

author img

By

Published : Nov 30, 2022, 12:48 PM IST

AFTAB CASE UPDATE

శ్రద్ధా వాకర్‌ హత్యకు సంబంధించి దిల్లీ పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇటీవల నిందితుడికి పాలిగ్రాఫ్‌ పరీక్షలు నిర్వహించగా, అందులో అఫ్తాబ్‌ చెప్పిన మాటలు అతడి క్రూర మనస్థత్వాన్ని మరోమారు బయటపెట్టాయి. శ్రద్ధాను చంపినట్లు అంగీకరించిన నిందితుడు.. అందుకు తనకేమి బాధలేదని పేర్కొన్నారు. తనకు ఎంతో మంది అమ్మాయిలతో సంబంధాలున్నాయని అఫ్తాబ్‌ ఒప్పుకున్నట్లు దర్యాప్తు వర్గాలు స్పష్టం చేశాయి. డిసెంబరు 1, 5 తేదీల్లో అఫ్తాబ్‌కు నార్కోటిక్‌ పరీక్ష చేసే అవకాశముందని దర్యాప్తు భావిస్తున్నాయి.

సంచలనం సృష్టించిన కాల్‌ సెంటర్‌ ఉద్యోగి శ్రద్ధా వాకర్‌ హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్‌ అమీన్‌ పూనావాలాకు ఇటీవల పాలిగ్రాఫ్‌ పరీక్షలు నిర్వహించారు. ఈ టెస్టులో అఫ్తాబ్‌ తన నేరాన్ని అంగీకరించినట్లు తెలిసింది. పాలిగ్రాఫ్‌ టెస్టు సమయంలో శ్రద్ధాను తానే హత్య చేశానని అంగీకరించిన అఫ్తాబ్.. అందుకు తనకేమీ పశ్చాత్తాపం లేదని, బాధ పడటం లేదని చెప్పినట్లు దర్యాప్తు బృందం వర్గాలు వెల్లడించాయి. హత్య తర్వాత శ్రద్ధాను ముక్కలు చేసి ఆమె శరీర భాగాలను అడవిలో పడేసిన విషయాన్ని కూడా అఫ్తాబ్ ఒప్పుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. తనకు చాలా మంది అమ్మాయిలతో సంబంధాలున్నాయని నిందితుడు అంగీకరించినట్లు సదరు వర్గాలు చెప్పాయి. పాలిగ్రాఫ్‌ పరీక్షల సమయంలో అఫ్తాబ్ ప్రవర్తన చాలా సాధారణంగా ఉన్నట్లు తెలిపాయి. శ్రద్ధా హత్యకు సంబంధించిన అన్ని వివరాలను ఇప్పటికే పోలీసులకు చెప్పానని నిందితుడు పదేపదే చెప్పినట్లు సమాచారం.

అఫ్తాబ్ పాలిగ్రాఫ్‌ పరీక్షకు సంబంధించి తుది నివేదిక రానప్పటికీ అతడికి నార్కో పరీక్ష జరిపేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. డిసెంబరు 1, 5 తేదీల్లో దిల్లీలోని రోహిణి ఫోరెన్సిక్‌ సైన్స్‌ లాబొరేటరీలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో అఫ్తాబ్‌ ఇచ్చే సమాచారం కేసు దర్యాప్తునకు కీలకంగా మారుతుందని దర్యాప్తు వర్గాలు భావిస్తున్నాయి. అయితే, పాలిగ్రాఫ్‌, నార్కో అనాలసిస్‌లో నిందితుడు ఇచ్చే వాంగ్మూలాన్ని ప్రధాన సాక్ష్యాలుగా పరిగణించరు. కేవలం వాటిని ఆధారాలుగా మాత్రమే తీసుకుంటారు.

డీఎన్​ఏ రిపోర్టులో జాప్యం..
మరోవైపు, శ్రద్ధా డీఎన్‌ఏ పరీక్షకు సంబంధించిన నివేదికలు ఇంకా రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. వాటి కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ఫోరెన్సిక్‌ నివేదిక వస్తే కేసుకు సంబంధించిన ఎన్నో చిక్కుముళ్లు వీడిపోతాయని దర్యాప్తు వర్గాలు అభిప్రాయపడున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.