బోస్‌ కోసం భర్తను చంపిన సమరయోధురాలు

author img

By

Published : Sep 8, 2021, 8:39 AM IST

neera arya story

సర్వం కోల్పోయి భారత స్వాతంత్య్రోద్యమానికి ఊపిరి పోసినవారెందరో. చరిత్ర పెద్దగా గుర్తించకపోయినా.. వారందరిలో నీరా ఆర్య వ్యథ చెప్పుకోతగింది. ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ తొలి గూఢచారిగా పనిచేస్తూ, సుభాష్‌ చంద్రబోస్‌ను రక్షించేందుకు తన భర్తనే చంపేసిన సమరయోధురాలు ఆమె.

స్వాతంత్య్రోద్యమంలో త్యాగగాథలెన్నో! వాటన్నింటిలోకీ భిన్నమైంది... పెద్దగా చరిత్ర పుటలకెక్కనిది నీరా ఆర్య వ్యథ. ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ తొలి గూఢచారిగా పనిచేస్తూ, సుభాష్‌ చంద్రబోస్‌ను రక్షించేందుకు తన భర్తనే చంపేసిన సమరయోధురాలు ఆమె.

భాగ్‌పత్‌లో (ప్రస్తుత యూపీలోని) 1902లో పుట్టిన నీరా ఆర్య చాలా భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు. ఆమె తండ్రి సేఠ్‌ ఛజ్జుమల్‌ పేరున్న వ్యాపారి. పిల్లలు నీరా, బసంత్‌లను కోల్‌కతాలో చదివించారు. ఆ ప్రభావం వారిద్దరిపైనా ఉండేది. తండ్రి వ్యాపార రీత్యా జాతీయోద్యమానికి దూరంగా ఉన్నా, నీరాలో మాత్రం స్వాతంత్య్రోద్యమ చైతన్యం వెల్లివిరిసింది. అంతలో ఆమెకు బ్రిటిష్‌ ప్రభుత్వంలో ఉన్నతాధికారిగా పనిచేస్తున్న శ్రీకాంత్‌ జై రంజన్‌దాస్‌తో పెళ్లయింది. శ్రీకాంత్‌ బ్రిటిష్‌ ప్రభుత్వంలో సీఐడీ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసేవారు. ఆయనకు సుభాష్‌ చంద్రబోస్‌ను పట్టుకునే బాధ్యత అప్పగించింది బ్రిటిష్‌ ప్రభుత్వం! అదే సమయంలో నీరా రహస్యంగా ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ (ఐఎన్‌ఏ)లో చేరింది. బోస్‌ ఆమెకు గూఢచార బాధ్యతల్ని అప్పగించారు. శ్రీకాంత్‌కూ భార్య ఐఎన్‌ఏలో చేరిన సంగతి తెలిసింది. ఆమె సాయంతో బోస్‌ను పట్టుకునేందుకు శ్రీకాంత్‌ ఎత్తు వేశారు. ఓసారి ఆమె బోస్‌ వద్దకు వెళుతున్న సంగతి గుర్తించి వెంబడించారు. బోస్‌ను చూడగానే... ఆయనపై శ్రీకాంత్‌ కాల్పులు జరిపారు. బోస్‌ తృటిలో తప్పించుకున్నా... ఆయన డ్రైవర్‌కు గాయాలయ్యాయి. సంగతి అర్థమైన నీరాబోస్‌ వెంటనే తన కత్తితో భర్తను పొడిచి చంపేసింది.

వక్షోజాలపై కత్తెర

నీరాను అరెస్టు చేసిన బ్రిటిష్‌ ప్రభుత్వం విచారించి జీవితఖైదు విధించింది. జైలులోనూ ఆమెకు దారుణమైన అనుభవాలు ఎదురయ్యాయి. గొలుసులతో బంధించి ఓ చిన్నగదిలో ఉంచేవారు. జైలు అధికారులే ఓ రోజు గొలుసులు తెంపించారు. తెంపే క్రమంలో సుత్తితో వేసిన దెబ్బలు కాలికి తాకాయి. బాధతో, కోపంతో తిట్టింది తాను. జైలర్‌ దూసుకు వచ్చి 'బోస్‌ ఎక్కడున్నాడో చెప్పు. విడిచిపెడతా' అంటూ జుట్టుపట్టుకు ఈడ్చాడు. నా గుండెల్లో ఉన్నాడంటూ బదులిచ్చింది నీరా! అయితే అక్కడి నుంచీ బయటకు లాగుతా అంటూ అసభ్యంగా ప్రవర్తించాడు జైలర్‌. చెట్టు కొమ్మలు కత్తిరించే కత్తితో ఆమె వక్షోజాలను కత్తిరించమని ఆదేశించాడు. బాధతో విలవిల్లాడింది నీరా ఆర్య! "కత్తి పదునుగా లేనందువల్ల బతికిపోయావ్‌!" అంటూ వదిలేశాడు జైలర్‌!

స్వాతంత్య్రానంతరం జైలు నుంచి విడుదలైన నీరా ఆర్య హైదరాబాద్‌ పాతబస్తీలో పూలమ్ముకొని జీవించారు. భారత ప్రభుత్వం ఆమెకేమీ ఇవ్వలేదు. తనూ ప్రభుత్వం నుంచి ఏమీ ఆశించలేదు. 1998లో హైదరాబాద్‌లోనే కన్నుమూసింది నీరా ఆర్య!

ఇదీ చదవండి:Azadi Ka Amrit Mahotsav: భారత తెల్ల గూఢచారి మైఖేల్‌ జాన్‌ కారిట్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.