రెచ్చిపోయిన వైసీపీ శ్రేణులు - ప్రశ్నించాడని టీడీపీ కార్యకర్తపై కర్రలతో దాడి
YCP Activists Attacked on TDP Activist in Nandikotkur: రాష్ట్రంలో రోజురోజుకీ వైసీపీ నాయకుల ఆకృత్యాలు, అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. వైసీపీ నాయకులు యథేచ్ఛగా దాడులు, నేరాలకు తెగబడుతుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారు. అధికారం, అరాచకం కలగలిస్తే నేరగాళ్లు ఎంతలా పేట్రేగిపోతారనేదానికి ఒకప్పుడు.. బిహార్, లాంటి రాష్ట్రాలు ఉదాహరణగా ఉండేవి. కానీ ఇప్పుడు వాటిని తలదన్నేలా రాష్ట్రంలో గత వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అరాచకం సృష్టిస్తోంది. హత్యలు, దాడులు, భూకబ్జాలు, అత్యాచారాలు, కిడ్నాప్లు, సెటిల్మెంట్లు, బెదిరింపులు, వంటివి విచ్చలవిడిగా చేస్తున్నారు.
తాజాగా నంద్యాల జిల్లా నందికొట్కూరులో వైసీపీ శ్రేణులు రెచ్చిపోయారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో అభివృద్ధి జరగలేదని స్థానిక నేతలను టీడీపీ కార్యకర్త సురేష్ నిలదీశాడు. దీంతో ఆగ్రహించిన వైసీపీ శ్రేణులు.. సురేష్పై కర్రలతో దాడికి పాల్పడ్డారు. తప్పించుకుని పారిపోతున్నా వదలకుండా వెంబడించి మరీ దాడి చేశారు. ఈ క్రమంలో ఓ ఇంట్లోకి వెళ్లినా.. అక్కడి నుంచి బయటకు లాక్కొచ్చి దాడి చేసి.. తీవ్రంగా గాయపరిచారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.