TDP Parliamentary Meeting Under Nara Lokesh లోకేశ్ అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ నేతల భేటీ.. ఉభయసభల్లో ఎజెండగా చంద్రబాబు అరెస్టు
TDP Parliamentary Meeting Under Nara Lokesh టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ సమావేశం నేడు దిల్లీలో జరగనుంది. ఎంపీ గల్లా జయదేవ్ నివాసంలో తెలుగుదేశం ఎంపీలందరు మధ్యాహ్నం మూడు గంటలకు భేటీ కానున్నారు. పార్లమెంట్ ఉభయసభ చర్చల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు గురించే ఉండేలా ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం నిర్వహించనున్నారు.
పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహం పై ప్రధానంగా చర్చిస్తారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు, ఏపీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు గురించి పార్లమెంటు దృష్టికి తీసుకెళ్లేలా నేతలు వ్యూహ రచన చేయనున్నారు. వివిధ పార్టీల మద్దతుతో చంద్రబాబు నాయుడు అరెస్టు విషయంపై పార్లమెంట్ ఉభయసభల్లో చర్చకు తీసుకురావటం కోసం కసరత్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు టీడీపీ పార్లమెంటరీ సమావేశాలు చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగాయి. ఇప్పుడు ఆయన జైలులో ఉండటంతో తొలిసారిగా నారా లోకేశ్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. జాతీయ స్థాయిలో చంద్రబాబు అక్రమ అరెస్టును ఎత్తి చూపుతూనే, రాష్ట్రంలో ఏలుతున్న నియంత పాలనను ఎండగట్టాలని నేతలు వ్యూహ రచన చేస్తున్నారు.