ఎస్సీ వర్గీకరణపై జగన్ ఎందుకు నోరుమెదపట్లేదు? : మాజీమంత్రి జవహర్
TDP Leader Jawahar allegations against Jagan: ఎస్సీ వర్గీకరణపై సీఎం జగన్ విదానం ఏంటో చెప్పాలని టీడీపీ మాజీ మంత్రి కె.ఎస్.జవహర్ డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై జగన్ రెడ్డి ఎందుకు నోరుమెదపడం లేదని జవహర్ నిలదీశారు. ఎస్సీ వర్గీకరణకు జగన్ రెడ్డి పూర్తి వ్యతిరేకమని మండిపడ్డారు. వర్గీకరణకు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చినా... జగన్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. దళితుల చిరకాల వాంఛ అయిన వర్గీకరణకు అడ్డంకులు సృష్టిస్తున్న ద్రోహి జగన్ రెడ్డి అని జవహర్ ధ్వజమెత్తారు.
సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన ఈ నాలుగున్నరేళ్లలో వర్గీకరణపై ఒక్కరోజు కూడా స్పందించలేదని జవహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం తెలుగుదేశంతోనే సాధ్యమని ఆయన పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం వివిధ పేర్లతో కార్పొరేషన్లు ఏర్పాటు చేసినా... మాదిగ, మాల, రెల్లి కార్పొరేషన్లకు జగన్ ప్రభుత్వం ఒక్క రూపాయి సైతం కేటాయించలేదని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో జగన్ కు బుద్ధి చెప్పేందుకు ఎస్సీలు ఎదురుచూస్తున్నారని జవహర్ పేర్కొన్నారు.