మన్యం కొండల్లో మంచు అందాలు - మైమరిచిపోతున్న జనం
Published: Nov 16, 2023, 3:32 PM

Rampachodavaram Beauty in Alluri District : అల్లూరి జిల్లా రంపచోడవరం మన్యం మంచు అందాలతో ఆకట్టుకుంటోంది. రంపచోడవరం నుంచి మారేడుమిల్లి, భద్రాచలం వెళ్లే దారిని మంచు కమ్మేసింది. ఆ మార్గంలో ఉదయం 9 గంటల వరకు కూడా మంచుపొరలు వీడలేదు. కొండలు, జలాశయాల వద్ద పొగ మంచు సోయగాలు పర్యటకులను ఆకర్షిస్తున్నాయి. రంపచోడవరం-మారేడుమిల్లి రహదారిలో ప్రయాణించే ప్రజలు ప్రకృతి ఒడిలో సేద తీరుతున్నారు. ఎంతో ఆహ్లాదకరంగా ఉన్న రంపచోడవరం కొండలు, జలపాతాలను పర్యటకులు వీక్షిస్తూ, ప్రకృతి సోయగాలకు మైమరచిపోతున్నారు.
Rampachodavaram water falls : హేమంత ఋతువు ప్రారంభం అయినప్పటి నుంచి ప్రకృతి రోజురోజుకూ మంచు పొరలతో అందంగా మారుతోంది. పచ్చని చెట్లు, ఆకాశాన్ని తాకుతాయనిపించే కొండలతో నిండి ఉన్న మన్యం మరింత అందంగా కనబడుతోంది. ఉదయం తొమ్మిది గంటల వరకు వీడని మంచుతో రంపచోడవరం మన్యం పర్యటకులకు కనువిందు చేస్తోంది. ప్రయాణాలకు మంచు అడ్డంకి అయినా ప్రకృతిని చూసి మైమరచిపోతున్నారు జనాలు.