High Temperatures: మండుతున్న ఎండలు.. హడలిపోతున్న ప్రజలు
Published: May 16, 2023, 6:47 PM

Summer Effect: విజయవాడలో ఎండలు మండుతున్నాయి. ఉదయం 8గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఎండకు భయపడి అత్యవసరమైతేనే ప్రజలు బయటకు వస్తున్నారు. ఇంటి వద్దనున్న వారు సైతం ఎండ తీవ్రత, వేడి గాలులతో అవస్థలు పడుతున్నారు. ఏదైనా అత్యవసరమైన పనులు ఉంటే తప్ప బయటకు రావడం లేదు. ఉష్ణోగ్రతలు ఒక్కోరోజు ఒక్కో స్థాయిలో నమోదవుతున్నాయి. నగరంలో గత 2రోజులుగా సుమారు 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రోడ్లకి ఇరవువైపులా చెట్లు లేకపోవడంతో ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందడానికి అవకాశం లేదని ప్రజలు చెబుతున్నారు. విజయవాడ నగర పాలక సంస్థ అధికారులు ఎండ తీవ్రత దృష్ట్యా మరిన్ని చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని నగరవాసులు కోరుతున్నారు. ఎండ తీవ్రతను తట్టుకోలేక చల్లనిపానీయాలు అధిక మొత్తంలో ప్రజలు తాగుతున్నారు. నగరంలోని ప్రధాన కూడళ్లలు, బస్ స్టాప్ల వద్ద చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రజలు ప్రభుత్వ అధికారులను కోరుతున్నారు.
విజయవాడలో ఎండ తీవ్రత చాలా ఉంది. పిల్లల పరీక్షల దృష్ట్యా బయటకు రావలసి వస్తుంది. ఈ వారం రోజుల నుంచి ఎండ తీవ్రత ఎక్కువన్న కారణంగా దేనికైనా బయటికి రావడానికి చాలా కష్టంగా ఉంది. -మహిళ
ఎండలు విపరీతంగా ఉన్నాయి. సేద తీరడానికి చెట్లు కూడా లేనందున చాలా ఇబ్బందులు పడుతున్నాం.. సాయంత్రం 5, 6 అయినా ఎండ తీవ్రత తగ్గడం లేదు.- స్థానికుడు