Onam Festival in Visakhapatnam: భిన్నత్వంలో ఏకత్వానికి ఓనం పండుగ ప్రతీక: వెంకయ్యనాయుడు
Onam Festival In Visakhapatnam : భిన్నత్వంలో ఏకత్వానికి ఓనం పండుగ ప్రతీకగా నిలుస్తుందని, భారతీయ సంప్రదాయంలోని షేర్ అండ్ కేర్ సంస్కృతికి ఈ పండుగ నిదర్శనమని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. విశాఖపట్నంలో కేరళ కళాసమితి నిర్వహించిన ఓనం వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకయ్యనాయుడు.. దానగుణానికి స్ఫూర్తి అయిన బలిచక్రవర్తి తన రాజ్యాన్ని సందర్శించటానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారని, రంగురంగుల పూలతో చేసుకునే ఈ వేడుకలు ప్రకృతితో కలిసి జీవించటానికి నిదర్శనంగా నిలుస్తాయన్నారు.
Onam Celebrations : పది రోజుల వేడుకల్లో చేసే వంటకాలు కేరళ సంప్రదాయ ఆహారం, ఆరోగ్యకమైన జీవన విధానాలను ప్రతిబింబిస్తుందని,.. ఈ పండుగ సమయంలో ఆటలు, జానపద ప్రదర్శనలు, విశ్వాసాలు ప్రజల మధ్య బంధాలను బలపరుస్తాయని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేరళ కళాసమితి చేపడుతున్న కార్యక్రమాలను అభినందించిన ఆయన.. గత ఐదు దశాబ్ధాలుగా భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనంగా నిలుస్తూ, వరద బాధితులకు సహకారం అందించటం, ఇళ్లు నిర్మించటం, కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రజలకు అండగా నిలవటం వంటి కార్యక్రమాలను ప్రశంసించారు. యువతను మలయాళ సంప్రదాయానికి చేరువ చేసే సంకల్పంతో ప్రత్యేక తరగతులు నిర్వహించటాన్ని అభినందించారు. ఇదే స్ఫూర్తితో మన భాష, సంస్కృతులను పరిరక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సూచించారు.