TDP on House Sites: 'అమరావతిని ఎడారితో పోల్చి.. నేడు పట్టాలు ఇవ్వడం హాస్యాస్పదం'
Nakka Anand Babu On House Site Pattas Distribution: ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమరావతిలో పేదలకు పట్టాలు అని హడావుడి చేస్తుండటం చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు ఎద్దేవా చేశారు. గుంటూరు, మంగళగిరి, విజయవాడలో ఉన్నటువంటి పేదలకు అమరావతిలో పట్టాలిస్తానంటున్నారు. నిన్నటి వరకూ వీళ్ల మంత్రులు అమరావతిని శ్మశానం, ఎడారితో పోల్చారు. అక్కడ ఉన్న కట్టడాలు గ్రాఫిక్స్ అని చెప్పారు. మరి అటువంటి ఎడారిలో ఈరోజు పేదలకు పట్టాలు అంటూ హడావిడి చేస్తున్నారని విమర్శించారు.
తాడేపల్లిలో ముఖ్యమంత్రి నివాసం వద్ద ఉంటున్న పేదలను బలవంతంగా ఖాళీ చేయించిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిదని ఆక్షేపించారు. ఇటువంటి వ్యక్తులు పేదల గురించి మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉందని దుయ్యబట్టారు. కోర్టు చాలా క్లియర్గా చెప్పింది.. మీరు ఇచ్చే పట్టాలు కోర్టు తీర్పునకు లోబడి ఉండాలి అని.. మరి తర్వాత జడ్జిమెంట్ తేడా వస్తే ఏం చేస్తారు అని ప్రశ్నించారు. ఇవన్నీ తెలిసి కూడా ఎవరిని మోసం చేద్దాం అని పట్టాలు ఇస్తున్నారని మండిపడ్డారు.
పేదలకు, రాజధాని రైతులకు మధ్య గొడవలు పెట్టడం తప్ప వేరే అంశం లేదన్నారు. ఇది పేదలకు కీడు చేసే ఆలోచన తప్ప.. వేరే ఏమీ లేదని తెలిపారు. అమరావతిని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని.. ఓట్ల కోసం డ్రామాలాడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజలు సమయం కోసం ఎదురుచూస్తున్నారని.. తరిమికొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని హెచ్చరించారు.