Nadendla Manohar on YSRCP Provocative Actions: జగన్ను ఇంటికి పంపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు: నాదెండ్ల మనోహర్
Nadendla Manohar on YSRCP Provocative Actions: ప్రతిపక్షాలపై దాడులు చేయటంతో పాటు తప్పుడు కేసులు పెట్టే కొత్త సంప్రదాయాన్ని వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిందని.. జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. గతంలో భీమవరం, విశాఖలో పవన్ కల్యాణ్ పర్యటనల్లో.. వైసీపీ నేతలు రెచ్చగొట్టడంతో పాటు.. దాడులు చేశారని.. ఆరోపించారు. ఇప్పుడు లోకేశ్ పాదయాత్రలో సైతం వైసీపీ అల్లరి మూకలు ఆటంకాలు సృష్టించారన్నారు. వైసీపీ నేతల చర్యల్ని, పోలీసు కేసుల్ని జనసేన తరపున ఖండించారు. సభలు పెడుతున్న ఇతర జిల్లాల్లో లేని ఇబ్బందులు ఒక్క భీమవరంలో ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు.
ఇతర పార్టీలకు చెందిన జెండా పట్టుకున్న క్రింది స్థాయి నుంచి పైస్థాయి వ్యక్తుల వరకు కేసులు పెట్టి వేధిస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్షాల సభలు, ర్యాలీల్లో వైసీపీ వారు రెచ్చగొట్టే బ్యానర్లు కడుతున్నారన్న.. దీనిపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. ఆరు నెలలు ఓపిక పడితే జగన్ని ఇంటికి పంపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్ఛరించారు. మా మొదటి ఓటు జనసేనకే అన్న నినాదంతో ప్రజల్లోకి వెళ్లనున్నట్లు నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికను మనోహర్ ఆవిష్కరించారు.