minister peddireddy ramachandra reddy held a meeting with officials: సర్వేరాళ్ల కొనుగోళ్ల కోసం రూ.1153 కోట్లు చెల్లించిన ప్రభుత్వం..!
minister peddireddy ramachandra reddy held a meeting with officials: రాష్ట్రంలోని 305 గ్రానైట్ కట్టింగ్ పాలిషింగ్ యూనిట్లకు సరిహద్దు రాళ్ల ఆర్డర్లను ఇస్తున్నట్టు రాష్ట్ర గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. ఈమేరకు గ్రానైట్ కటింగ్ యూనిట్లు, పాలిషింగ్ యూనిట్ల ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. సంక్షోభంలో కూరుకుపోయిన గ్రానైట్ ఫ్యాక్టరీలకు చేయూత ఇస్తూ స్లాబ్ సిస్టమ్ అమలుతో పాటు విద్యుత్ రాయితీలను కల్పిస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. భూహక్కు-భూరక్ష పథకం కోసం అవసరమైన సర్వేరాళ్లను కూడా గ్రానైట్ ఫ్యాక్టరీల నుంచే కొనుగోలు చేయడం ద్వారా ఆయా యూనిట్లకు ఆర్దికంగా చేయూత లభిస్తోందని అన్నారు. సర్వే రాళ్ల తయారీ ద్వారా నిరంతరం గ్రానైట్ ఫ్యాక్టరీలకు పని ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. రీసర్వే కోసం ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయాలని భావించిన శాండ్ స్టోన్స్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్నట్టు మంత్రివెల్లడించారు. బయట రాష్ట్రాల ట్రేడర్ల నుంచి సర్వేరాళ్ల కొనుగోళ్లను నిలిపివేస్తున్నట్టు మంత్రి తెలిపారు. మొదటి దశలో 25.80 లక్షల సర్వేరాళ్లను కొనుగోలు చేశామని.. రెండో విడతగా 26.15 లక్షల సర్వేరాళ్లను జూలై నెల వరకు సరఫరా జరిగిందనన్నారు. మూడోదశలో ప్రస్తుతం రెండువేల గ్రామాలకు మరో 25.42 లక్షల సర్వేరాళ్లను అందించాల్సి ఉందని అన్నారు. ఇప్పటి వరకూ సర్వేరాళ్ల కొనుగోళ్ల కోసమే 1153.2 కోట్ల రూపాయలను సరఫరాదారులకు చెల్లించినట్టు తెలిపారు. సర్వే రాళ్ల రవాణా కోసం రూ.63.8 కోట్ల రూపాయలను చెల్లించినట్టు తెలిపారు. ప్రస్తుతం ఒక్కో సర్వేరాయి కొనుగోలు ధరను రూ.300 కి పెంచినట్టు మంత్రి తెలిపారు.