Heavy Rains in Alluri Seetharamaraju District: అల్లూరి జిల్లాలో భారీ వర్షం.. 30 గ్రామాలకు స్తంభించిన రాకపోకలు
Heavy Rains in Alluri Seetharamaraju District: రాష్ట్రంలో గతకొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు, వంకలు, గెడ్డలు పొంగి పొర్లుతున్నాయి. మరికొన్ని చోట్ల వరదల ధాటికి కల్వర్టులు కొట్టుకుపోతున్నాయి. దీంతో నగరాలకు, గ్రామాలకు మధ్య రాకపోకలు నిలిచిపోయి.. ప్రజలు, వాహనాదారులు నానా అవస్థలు పడుతున్నారు. తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ వర్షం కురిసింది. దీంతో కొండ వాగులు, గెడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి. నదీ పరివాహక ప్రాంతాల్లో వందల ఎకరాల వరి పంటలు నీట మునిగాయి. పాడేరు మండలం రాయగెడ్డ వద్ద వరదనీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో రోడ్డు కోతకు గురయ్యింది. జి. మాడుగుల మండలం మద్దుగరువు-బొయితలి మార్గంలో కల్వర్టు కొట్టుకుపోవటంతో.. చుట్టుప్రక్కల ప్రాంతాలకు వాహన రాకపోకలు స్తంభించిపోయాయి.
Meteorological Department Releases Statement on Heavy Rains: అల్లూరి సీతారామరాజు జిల్లాలో బుధవారం కురిసిన భారీ వర్షాలకు సంబంధించి వాతావరణ శాఖ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో..''అల్లూరి జిల్లాలో 269.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా ముంచింగిపుట్టులో 63.5, మి.మీ, పెదబయలులో 48.3 మి.మీ, డుంబ్రిగూడలో 26.1 మి.మీ, గంగవరంలో 17.1 మి.మీ, అనంతగిరి మండలంలో 13.9 మి.మీ, అత్యల్పంగా పాడేరులో 0.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముంచింగిపుట్ మండలం లక్ష్మీపురం బాబుసాలా సుత్తిగుడ గెడ్డ, కరిముఖిపుట్టు గెడ్డలు, పెదబయలు మండలం గేది గడ్డ, హుకుంపేట మండలం రంగశీల గెడ్డ పొంగి ప్రవస్తోంది. పాడేరు మండలం రాయగెడ్డ ఉధృతంగా ప్రవహిస్తుంది. జి మాడుగుల మండలం మద్దుగరువు-బొయితలి మార్గంలో కల్వర్టు కొట్టుకుపోయింది. 30 గ్రామాల రాకపోకలు నిలిచిపోయాయి. పలుచోట్ల వాహనాలు ప్రజలు చిక్కుకున్నారు'' అని అధికారులు వెల్లడించారు.