Farmer Crop Loss inn Anantapuram: అనంతలో వర్షాభావ పరిస్థితులు.. సాగు నీరందక ఎండిన పంటలు
Published: Sep 15, 2023, 6:01 PM

Farmer Crop Loss In Anantapuram : కరవు ప్రాంతంగా పేరున్న అనంతపురం జిల్లాలో వర్షాభావ పరిస్థితులు రైతులను తీవ్ర నష్టాల్లోకి నెడుతున్నాయి. ఉరవకొండ మండలం లత్తవరం గ్రామానికి చెందిన బెల్లం తిమ్మప్ప అనే రైతు తన 8 ఎకరాల పొలంలో మూడు నెలల క్రితం మొక్కజొన్న పంటను సాగు చేశాడు. దానికి రూ.1,60,000 వరకు పెట్టుబడి పెట్టాడు. పంట వేసిన తరవాత వర్షాలు పడలేదు. దీంతో పంట పెరుగుదల ప్రశ్నార్థకంగా మారింది.
హంద్రీనీవా ప్రధాన కాలువ నుంచి నీరు అలస్యంగా రావడంతో మొక్కజొన్న పంట ఎండిపోయిందని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. సరైన సమయంలో పంటకు నీరందించక పోవడంతో మంచి దిగుబడి వచ్చే పంటను పశువులకు మేతగా ఉపయోగిస్తున్నానని రైతు వాపోయాడు. మూడు నెలల క్రితం పంట సాగు కోసం రూ. 1,60,000 లను పెట్టుబడిగా పెట్టినట్లు రైతు తిమ్మప్ప చెప్పాడు. ఇప్పుడు పంటను తొలగించడంతో పెట్టిన పెట్టుబడి మొత్తం నష్టపోయానని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రభుత్వం తమకు జరిగిన నష్టాన్ని గుర్తించి, పరిహారాన్ని అందించాలి రైతు కోరుతున్నాడు.