Father and Daughter Died : బతుకు పోరాటంలో తండ్రీ, కూతురు బలి.. పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లి మృత్యువాత
Father and Daughter Died after Slipping in the Pond : పొలానికి తడులు అందించేందుకు చెరువులో దిగి పైపులు అమరుస్తున్న రైతు ప్రమాదవశాత్తు మృతి చెందగా, ఆయన్ను కాపాడే ప్రయత్నంలో కుమార్తె సైతం ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం పోతునాయుడుపేటలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కామేశ్వరరావు(66) రెండు ఎకరాల పొలంలో వ్యవసాయం చేస్తున్నాడు. వంశధార కాలువ నుంచి నీరు రాకపోవడంతో సమీపంలోని చెరువు నుంచి ఇంజిన్ సాయంతో నీటిని తోడేందుకు చిన్న కుమార్తె గిన్ని రాజేశ్వరితో(46) కలిసి వెళ్లారు.
పైపులు అమర్చే క్రమంలో ఆయన చెరువులో జారిపడి మునిగిపోయారు. గట్టు మీద ఉన్న కుమార్తె కాపాడే ప్రయత్నంలో ఆమె కూడా మునిగిపోయింది. దీంతో ఇద్దరు ప్రాణాలను కోల్పోయారు. రాజేశ్వరి భర్త కృష్ణారావు రెండేళ్ల కిందట మృతి చెందడంతో పోతునాయుడుపేటలో మూడు ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వంశధార కాలువ నుంచి సాగుకు నీరు ఇచ్చి ఉంటే ఇద్దరు ప్రాణాలతో ఉండేవారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.