Elimination of Votes of TDP Supporters in Attalur: మారని తీరు.. అత్తలూరులోని ఒకే వార్డులో 30 ఓట్లు తొలగింపు.. బాధితుల ఆందోళన
Elimination of Votes of TDP Supporters in Attalur: పల్నాడు జిల్లా అత్తలూరులో టీడీపీ మద్దతుదారుల ఓట్లు తొలగించారని అమరావతిలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద బాధిత ఓటర్లు ఆందోళనకు దిగారు. స్థానికంగా ఉంటూ ఉపాధి కోసం గుంటూరు, సత్తెనపల్లి నరసరావుపేట పట్టణాలకు వెళ్లి వస్తున్న తమకు తెలియకుండా, ముందస్తు నోటీసులు (Advance notices) ఇవ్వకుండా ఓట్లు తొలగించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అత్తలూరు 205వ వార్డులో టీడీపీ మద్దతుదారులైన (TDP supporters) వడ్డెర కులస్తుల 30 మంది ఓట్లను తొలగించారు.
ఈ విషయమై బీఎల్ఓని కలిసి అడిగితే నిర్లక్ష్యపు సమాధానం చెప్పారని బాధితులు వాపోయారు. తారు రోడ్ల నిర్మాణం, సిమెంట్ కాలువలు పనులకు వెళ్లి ఉపాధి పొందుతున్న తమ ఓట్లు స్థానిక వైసీపీ నేతల (YCP Leaders) ఒత్తిడితో తొలగించారని మండిపడ్డారు. తొలగించిన ఓట్లు పునరుద్ధరించాలంటూ అమరావతి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ విజయశ్రీకి వినతిపత్రం అందజేశారు. ఓట్ల తొలగింపు అంశంపై స్థానికంగా విచారించి చర్యలు చేపడతానని తహసీల్దార్ విజయశ్రీ బాధితులకు హామీ ఇచ్చారు.