ఎస్టేట్ అధికారిగా పనిచేసిన ధర్మారెడ్డి తితిదే ఈఓ పోస్టుకు ఎలా అర్హుడు? : ఆనం
Anam Venkataramana Reddy Allegations on TTD EO Dharma Reddy: తిరుమల తిరుపతి దేవస్థానంలో ధర్మారెడ్డి ఫేక్ ఆఫీసరని.. ఈఓగా పనిచేయడానికి అతనికి అర్హత లేదని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి విమర్శించారు. ధర్మారెడ్డి ఛాలెంజ్కు తాను సిద్దమని, చర్చ ఎక్కడ పెట్టినా తాను ఒంటరిగానే వస్తానని ప్రకటించారు. ఈ విషయం తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను పూర్తిస్థాయి అదనపు విధులతో ఈఓగా నియమించిందన్నారు. దిల్లీలో ఎస్టేట్ అధికారిగా పనిచేసిన ధర్మారెడ్డి... సీనియర్ ఐఏఎస్లు ఉండాల్సిన తితిదే ఈఓ పోస్టుకు ఎలా అర్హుడో చెప్పాలని నిలదీశారు.
రాజశేఖర్ రెడ్ది ముఖ్యమంత్రి అయిన తరువాత ధర్మారెడ్డిని ఓఎస్డీగా నియమించారని.. జగన్ సీఎం అయిన అనంతరం తిరుమలలో కొత్త పోస్ట్ సృష్టించి అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమించారని తెలిపారు. ఎస్టేట్ ఆఫీసర్ అయిన ధర్మారెడ్డి చీఫ్ సెక్రటరీ అని చెప్పుకోవడం సిగ్గుచేటని వెంకట రమణారెడ్డి విమర్శించారు. నాలుగు వేల కోట్ల బడ్జెట్ ఉన్న తిరుమలకు చంద్రబాబు ఇండియన్ ఆడిట్ అకౌంట్స్ ఆఫీసర్ను అధికారిగా నియమిస్తే.. జగన్ మాత్రం కామర్స్ చదివిన వ్యక్తిని నియమించడం దారుణమన్నారు. ఐఆర్ఎస్ అధికారి ఉంటే దేవస్థానం సొమ్ము పక్క దారి పట్టించడం వీలుకాదనే చార్టెడ్ అకౌంటెంట్ను నియమించారని దుయ్యబట్టారు. తిరుమలలో జరుగుతున్న ఆర్ధిక లావాదేవీలపై విచారణ జరగాల్సిన అవసరం ఉందని వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు.