తిన్న వెంటనే నిద్రపోతున్నారా? అయితే ప్రమాదంలో ఉన్నట్లే!

author img

By

Published : Mar 12, 2023, 7:55 AM IST

Short Walks After Meals Can Cut Diabetes

మనలో చాలామందికి తిన్న వెంటనే నిద్రపోయే అలవాటు ఉంటుంది. కానీ ఈ అలవాటు మంచిది కాదు అని పెద్దలు చెబుతారు. తిన్న తర్వాత కాస్త అటూ, ఇటూ తిరగాలని, వాకింగ్ చేయాలని సలహా ఇస్తుంటారు. మరి ఇంతకీ తిన్న వెంటనే నిద్రపోవడం ప్రమాదమా, దాని వల్ల ఏం జరుగుతుందనే విషయాలను తెలుసుకుందాం.

ఉరుకుల పరుగుల జీవితంలో సరైన సమయానికి భోజనం చేయకపోవడం, వ్యాయామం చేయకపోవడం, అధిక ఒత్తిడి లాంటి వాటి వల్ల రోగాలను కొనితెచ్చుకుంటున్నారు. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలి ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు కారణం అవుతున్నాయి. అలాంటి వాటిల్లో మధుమేహం కూడా ఒకటి. దీని వల్ల గుండెకు సంబంధించిన సమస్యలు కూడా పెరుగుతున్నాయి. వీటన్నింటికి చెక్ పెట్టేందుకు భోజనం తర్వాత నడవడం చక్కటి మార్గమని ఇటీవల ఓ పరిశోధన తెలియజేసింది. ఆ పరిశోధనల ఫలితాలేంటి? భోజనం తర్వాత నడక ఏయే సమస్యలను దూరం చేస్తుందో తెలుసుకుందాం.

సాధారణంగా చాలా మంది తిన్న తర్వాత భుక్తాయాసం పేరుతో కాసేపు నడుం వాలుస్తారు. కొంతమంది విశ్రాంతి తీసుకుంటే ఇంకొంతమంది ఓ కునుకు వేస్తారు. ఇలాంటి వాటి వల్ల టైప్–2 మధుమేహం, గుండెపోటు ప్రమాదం పొంచి ఉందని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీనికి చెక్ పెట్టాలంటే తిన్న తర్వాత కాసేపు నడవాలని సూచిస్తున్నారు. ఒక నివేదిక ప్రకారం.. తిన్న తర్వాత కాసేపు నడిస్తే టైప్–2 మధుమేహంతో పాటు గుండెపోటు సమస్యలను తగ్గించవచ్చట. భోజనం తర్వాత కనీసం 2 నుంచి 5 నిమిషాల పాటు నడిచినా, శరీరంలోని రక్తంలో ఉండే చక్కెర, ఇన్సులిన్ స్థాయిలను తగ్గించొచ్చని పరిశోధకులు కనుగొన్నారు.

రోజులో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఆహారం తిన్న వెంటనే కనీసం రెండు నుంచి ఐదు నిమిషాల పాటు నడవాలని ప్రముఖ వైద్యులు శ్రావణి రెడ్డి కరుమూరు అన్నారు. కుదిరితే 10 నిమిషాల పాటు నడవొచ్చన్నారు. 'తిన్న తర్వాత గంట నుంచి గంటన్నర లోపు మనం భుజించిన ఆహారంలో నుంచి గ్లూకోజ్ విడుదలవుతుంది. అంతస్థాయిలో విడుదలయ్యే గ్లూకోజ్​ను తగ్గించాలంటే నడవడం అలవాటు చేసుకోవాలి' అని డా.శ్రావణి రెడ్డి అంటున్నారు. 'కాస్త నడవడం వల్ల కండరాలు కదులుతాయి. దీని వల్ల శరీరంలో గ్లూకోజ్ అవసరం పడుతుంది. తద్వారా ఇన్సులిన్ విడుదల అవుతుంది. ఇన్సులిన్ అనే హార్మోన్ గ్లూకోజ్​ను తీసుకెళ్లి కండరానికి సరఫరా చేస్తుంది. దీని వల్ల అధికంగా ఉండే గ్లూకోజ్​ను తగ్గించొచ్చు. అలాగే మధుమేమం, గుండె సమస్యల బారిన పడకుండా ఉండొచ్చు' అని ఆమె వివరించారు.

నడక కుదరకపోతే ఇలా చేయండి:
ఈరోజుల్లో చాలా మంది ఆఫీసుల్లో పనిచేస్తుంటారు. అందునా డెస్క్ జాబ్స్ ఈమధ్య ఎక్కువైపోయాయి. దీంతో గంటల కొద్దీ కుర్చీల్లోనే కూర్చోవాల్సి వస్తోంది. అలాంటి వారికి ఆఫీసుల్లో తిన్న తర్వాత నడవడం కుదరదు. అలా నడిచేందుకు ఇబ్బంది ఉన్న వారు కాసేపు నిలబడి అటూ, ఇటూ కదలడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది.

ఇలా చేయడం వల్ల రక్తంలో గ్లూకోజ్, చక్కెర స్థాయిలు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తిన్నాక నడకతో పాటు కాసేపు శారీరక శ్రమ చేయగలిగితే గరిష్ట స్థాయిలో ఉన్న గ్లూకోజ్ పూర్తిగా కరిగి.. మధుమేహం లాంటి సమస్య తప్పుతుంది. అందుకే తిన్న తర్వాత శారీరక శ్రమ చేసేవారిలో మధుమేహం సమస్య కనిపించడం లేదట. దీనికి సంబంధించి ఐదు రకాల అధ్యయనాలు జరిగాయి. వీటి ప్రకారం తిన్నాక 2 నుంచి 20 నిమిషాల పాటు నడిస్తే మధుమేహం లాంటి సమస్యలు దరిచేరవు.

'ఆఫీసుల్లో ఉండే వారు నడవడం కుదరకపోతే కాసేపు నిల్చోవచ్చు. అయితే నిలబడటం కంటే కూడా నడవడం అనేది చాలా ముఖ్యం అని గుర్తుంచుకోవాలి. దీని వల్ల శరీరంలోని కొవ్వు కరుగుతుంది. నడిస్తే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఒంట్లో కొవ్వు శాతం, చక్కెర స్థాయిలను తగ్గించడానికి నడక ఎంతగానో ఉపయోగపడుతుంది. తరచూ చేసే వ్యాయామంతో పాటు తిన్నాక కాసేపు నడకను అలవాటు చేసుకోవాలి' అని డా.శ్రావణి రెడ్డి చెబుతున్నారు.

భోజనం చేసిన తర్వాత కుటుంబ సభ్యులతో లేదంటే స్నేహితులతో రెండు, మూడు నిమిషాలు నడవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. ఒకవేళ అది సాధ్యంకాని పక్షంలో ఉన్నచోటే నిలబడేందుకు ప్రయత్నించాలని, ఇలా చేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు.

తిన్న వెంటనే నిద్రపోతున్నారా? అయితే ప్రమాదంలో ఉన్నట్లే!
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.