పాదయాత్రకు సర్వం సిద్ధం.. నేడు ఎన్టీఆర్ ఘాట్లో నివాళులర్పించనున్న లోకేశ్
Updated on: Jan 25, 2023, 12:12 PM IST

పాదయాత్రకు సర్వం సిద్ధం.. నేడు ఎన్టీఆర్ ఘాట్లో నివాళులర్పించనున్న లోకేశ్
Updated on: Jan 25, 2023, 12:12 PM IST
Everything is ready for Lokesh Padayatra: యువత భవిత కోసం యువగళం అంటూ.. 400రోజుల సుదీర్ఘ పాదయాత్రకు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సిద్ధమయ్యారు. నేడు హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్లో నివాళులు అర్పించి.. కడపలో సర్వమత ప్రార్థనలు నిర్వహిస్తారు. రేపు తిరుమల శ్రీవారి ఆశీస్సులు తీసుకుంటారు. పోలీసుల అడ్డంకులను, షరతులను లెక్కచేసేది లేదంటున్న నేతలు.. ఎల్లుండి కుప్పం నుంచి ప్రారంభమయ్యే యాత్రకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
Everything is ready for Lokesh Padayatra: ఈ నెల 27 నుంచి 400 రోజుల సుదీర్ఘ పాదయాత్ర చేయనున్న తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. ఇవాళ హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్లో తాత నందమూరి రామారావు సమాధికి నివాళులర్పిస్తారు. మధ్యాహ్నం కడప బయలుదేరి వెళ్తారు. అక్కడ తిరుమల తొలిగడప దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకుటారు. అనంతర అమీన్పీర్ దర్గాను దర్శించుకుని ప్రార్ధనల్లో పాల్గొంటారు. తర్వాత రోమన్ కేథలిక్ చర్చికి వెళ్లి.. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. ఆ తర్వాత తిరుమల చేరుకోనున్న లోకేశ్.. రాత్రికి అక్కడే బస చేస్తారు. 26న శ్రీవారిని దర్శించుకుంటారు. 27వ తేదీ మధ్యాహ్నానికి.. కుప్పం చేరుకుంటారు. లక్ష్మీపురంలోని వరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి.. పాదయాత్ర ప్రారంభిస్తారు. అదే రోజు భారీ బహిరంగ సభకు.. పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. కుప్పం నియోజకవర్గంలో 3 రోజులపాటు లోకేశ్ యాత్ర కొనసాగనుంది.
లోకేశ్ పాదయాత్రకు షరతులను లెక్కచేసేది లేదని తెలుగుదేశం నేతలు తేల్చిచెప్పారు. జగన్ పాదయాత్ర చేసినప్పుడు.. తెలుగుదేశం ప్రభుత్వం పులివెందుల నుంచి ఇచ్ఛాపురం వరకు ఒకేసారి అనుమతిస్తే.. ఇప్పుడు లోకేశ్కు మొదటి 3రోజులకే అనుమతివ్వడం దేనికి సంకేతమని ధ్వజమెత్తారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగాయనే ఫిర్యాదులొస్తే.. ఎప్పుడైనా అనుమతి రద్దు చేయవచ్చని పేర్కొనడాన్నీ తప్పుపట్టారు.
మరోవైపు.. లోకేశ్ పాదయాత్రకు సంఘీభావంగా తెదేపా నేతల ర్యాలీలు కొనసాగుతున్నాయి కృష్ణా జిల్లా పామర్రులో వర్ల కుమార్ రాజా భారీ ర్యాలీ నిర్వహించారు. గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ వద్దనున్న ఎన్టీఆర్ విగ్రహం నుంచి హిందూ కళాశాల కూడలి..దాకా నేతలు పాదయాత్ర చేశారు. కర్నూలు బుధవారపేటలోని కనకదుర్గమ్మ దేవాలయంలో 101 టెంకాయాలు కొట్టారు. కడపలో ఎన్టీఆర్ విగ్రహం నుంచి దేవుని కడప వరకూ పాదయాత్రగా వెళ్లి 101 కొబ్బరికాయలు కొట్టారు
"జగన్మోహన్ రెడ్డి.. నువ్వు కూడా పాదయాత్ర చేశావు కదా.. నీ చెల్లి షర్మిల కూడా పాదయాత్ర చేసింది. ప్రస్తుతం తెలంగాణలో కూడా పాదయాత్రలు జరుగుతున్నాయి. రాహుల్ గాంధీ కూడా పాదయాత్ర చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలకు ప్రచారం చేసుకునే హక్కు లేదా.. అధికారం పోతుంది ఏమో అనే భయంతోనే ఇవన్నీ చేస్తున్నారు. ఎవరు ఎన్ని చేసినా.. పాదయాత్ర కొనసాగుతుంది". - నక్కా ఆనంద్బాబు, టీడీపీ నేత
ఇవీ చదవండి:
