MPTC, ZPTC RESULTS: కడప జిల్లాలో వైకాపా విజయదుందుభి

author img

By

Published : Sep 19, 2021, 11:32 AM IST

Updated : Sep 19, 2021, 10:25 PM IST

కడప జిల్లాలో కొనసాగుతున్న పరిషత్ ఓట్ల లెక్కింపు

కడప జిల్లాలో ఎంపీటీసీ, జడ్పిటిసి ఫలితాల్లో వైకాపా విజయదుందుభి మోగించింది. ఏకగ్రీవాలతో కలిపి ఇవాళ జరిగిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాల్లో వైకాపా హవా కొనసాగింది. 117 స్థానాలకు జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో 93 స్థానాలను వైకాపా గెలుచుకుంది. అదేవిధంగా 12 స్థానాలకు జరిగిన జడ్పీటీసి ఎన్నికల్లో 11స్థానాలను వైకాపా గెలుచుకోగా... ఒక స్థానాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. మొత్తం మీద ఓట్ల లెక్కింపు ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది.

కడప జిల్లాలో మొత్తం 554 ఎంపీటీసీ స్థానాలకు గాను 432 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం కాగా... మార్చిలో 117 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అదేవిధంగా జిల్లాలో 50 జడ్పీటీసీలు ఉండగా 38 జడ్పీటీసి స్థానాలు ఇదివరకే వైకాపా ఏకగ్రీవం చేసుకోగా 12 స్థానాలకు మాత్రమే మార్చి నెలలో ఎన్నికలు జరిగాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇవాళ జిల్లా వ్యాప్తంగా 16 కేంద్రాల్లో అధికార యంత్రాంగం చేపట్టింది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి వరకు జరిగిన ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అటు ఎంపీటీసీ, జడ్పీటీసీ అత్యధిక స్థానాలను వైకాపా గెలుచుకుంది. జడ్పీటీసి స్థానాల్లో ఏకగ్రీవాలతో కలిపి 49 స్థానాలను వైకాపా కైవసం చేసుకోగా... బద్వేలు నియోజకవర్గంలోని గోపవరం మండలం జడ్పీటీసీ మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. ఇక్కడ జయరామిరెడ్డి అనే తెదేపా అభ్యర్థి 104 ఓట్ల మెజార్టీతో విజయం సాధించాడు.

ఎంపీపీ ఫలితాలివే..

ఇక ఎంపీటీసీ స్థానాలకు వస్తే 554 స్థానాల్లో ఏకగ్రీవాలతో కలిపి ఇవాళ జరిగిన ఓట్ల లెక్కింపులో దాదాపు 500కు పైగానే ఎంపీటీసి స్థానాలను వైకాపా గెలుచుకుంది. ఇవాళ జరిగిన 117 ఎంపీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపులో వైకాపా 93 స్థానాలు గెలుచుకోగా... తెదేపా 11, స్వతంత్రులు 5 చోట్ల, భాజపా 7 చోట్ల విజయం సాధించారు. జమ్మలమడుగు మండలం గొరిగనూరు ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆగిపోయింది. ఇక్కడ వర్షం కారణంగా బ్యాలెట్ బాక్సుల్లో నీరు చేరింది. బ్యాలెట్ పత్రాలు తడిసిపోవడంతో అధికారులు ఓట్ల లెక్కింపు ప్రక్రియ తాత్కాలికంగా నిలిపివేశారు. ఉదయం నుంచి సాయంత్రంలోపు అన్ని ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల ఫలితాలు వెలువడినప్పటికీ ఒక్క జమ్మలమడుగు నియోజకవర్గంలో మాత్రమే చాలా ఆలస్యంగా ఫలితాలు వెలువడ్డాయి. జమ్మలమడుగు నియోజకవర్గంలోని ఐదు మండలాలకు సంబంధించిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు ప్రక్రియను జమ్మలమడుగు డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేయడం వల్ల అధికారులు చాలా నిదానంగా ఓట్ల లెక్కింపు చేపట్టారు. జడ్పీటీసీ ఫలితాలు రాత్రివరకు కూడా కొనసాగాయి. ఇక్కడ భాజపా, వైకాపా పోటీపడగా అన్ని జడ్పీటీసీ స్థానాలను వైకాపా గెలుచుకుంది.

మొత్తం మీద జిల్లావ్యాప్తంగా జరిగిన ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు యంత్రాంగం పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టింది.

ఇదీచదవండి.

appcc: కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు యోచన: మాజీ మంత్రి చింతా మోహన్‌

Last Updated :Sep 19, 2021, 10:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.