ఉపాధ్యాయుడు కొట్టడంతో స్పృహ కోల్పోయిన విద్యార్థి

author img

By

Published : Aug 17, 2022, 11:58 AM IST

teacher beat the student

విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే విచక్షణ కోల్పోతున్నారు. సహనంగా ఉంటూ విద్యార్థులకు వినయాన్ని అలవరిచాల్సిన గురువులే దారి తప్పుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థిని చితకబాదాడు. ఉపాధ్యాయుడు తీవ్రంగా కొట్టడంతో విద్యార్థి స్పృహ కోల్పోయాడు.

విచక్షణ కోల్పోయిన ఓ ఉపాధ్యాయుడు స్వాతంత్య్ర దినోత్సవం రోజున విద్యార్థిని చావబాదాడు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరు శ్రీవేణుగోపాల ఉన్నత పాఠశాలలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. విద్యార్థులంతా సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ సందడిలో ఉన్న సమయంలో జీవశాస్త్ర ఉపాధ్యాయుడు రవీంద్ర పదో తరగతి విద్యార్థి బేతి బన్నీని కారణం లేకుండా చెంప పైనా, వీపుపైనా కొట్టారు. గమనించిన తోటి ఉపాధ్యాయులు చూసి అడ్డుకున్నారు. స్పృహ కోల్పోయిన బన్నీకి పాఠశాల సిబ్బంది సపర్యలు చేశారు. అనంతరం స్థానిక పీహెచ్‌సీకి తరలించి ప్రాథమిక వైద్య చేయించి ఇంటికి పంపారు.

ఆ విద్యార్థి సంరక్షకుడు విజయకాంత్‌ మంగళవారం పాఠశాలకు వచ్చి సదరు ఉపాధ్యాయుడిని నిలదీయగా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో హెచ్‌ఎం శివజ్యోతికి ఫిర్యాదు చేశారు. బాధిత విద్యార్థికి మద్దతుగా విద్యార్థులంతా మంగళవారం తరగతులు బహిష్కరించి.. ఉపాధ్యాయుడు రవీంద్ర తమకొద్దంటూ నినాదాలు చేశారు. ఈ ఘటనను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని హెచ్‌ఎం హామీ ఇచ్చారు. గతంలో పనిచేసిన పాఠశాలలోనూ రవీంద్ర వివాదాస్పదుడిగా పేరు తెచ్చుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.