నీరు అందక ఎండిపోతున్న పంటలు - ఆవేదనతో పశువుల్ని మేపుతున్న రైతులు

నీరు అందక ఎండిపోతున్న పంటలు - ఆవేదనతో పశువుల్ని మేపుతున్న రైతులు
Suffering of Farmers in Cheepurupalli Without Water for Crops : కంటికి రెప్పలా కాపాడుకున్న పంట కళ్ల ముందే ఎండిపోతుంటే.. అన్నదాతలు గుండెలు బాదుకుంటున్నారు. ఇప్పటి వరకు పెట్టిన పెట్టుబడంతా బూడిదలో పోసిన పన్నీరైదంటూ.. కన్నీరు పెడుతున్నారు. ఇదీ మంత్రి బొత్స సత్యనారాయణ నియోజకవర్గంలోని రైతుల దుస్థితి.
Suffering of Farmers in Cheepurupalli Without Water for Crops : విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు వరప్రదాయిని తోటపల్లి ప్రాజెక్టు. దీని ద్వారా విజయనగరం జిల్లాలో 155 గ్రామాల్లోని 67,912 ఎకరాలు, శ్రీకాకుళం జిల్లాలో 132 గ్రామాల్లోని 64,036 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు పలు చోట్ల పంట డిస్ట్రిబ్యూటరీ, పంట కాల్వలు, కాంక్రీట్ పనులు నిలిచిపోయాయి. ప్రాజెక్టు పరిధిలోని పెండింగ్ పనులకు ప్రభుత్వం ఇటీవల నిధులు మంజూరు చేసింది. దీని కోసం రూ.123.21కోట్లు కేటాయించింది. రూ.59.58 కోట్లు కేటాయించిన ప్యాకేజీ-1 పార్వతీపురం డివిజన్ పనులకు మంత్రి బొత్స సత్యనారాయణ శంకుస్థాపన చేశారు. కానీ పనులు పూర్తికాకపోవడంతో ఆయకట్టు నీరందక రైతులు తీవ్రంగా నష్టపోయారు.
Drought Conditions in Cheepurupalli Constituency : విజయనగరం జిల్లా రాజాం, చీపురుపల్లి, నెల్లిమర్ల.. అదేవిధంగా మన్యం జిల్లాలోని పాలకొండ నియోజవర్గాల పరిధిలో వేలాది ఎకరాలకు శివారు ఆయకట్టు ఉంది. ప్రస్తుతం ఎక్కడా చుక్కనీరు అందని పరిస్థితి నెలకొంది. విజయనగరం జిల్లా గజపతినగరం బ్రాంచి కాలువ ద్వారా 13వేల ఎకరాలకు నీరు ఇవ్వలని నిర్దేశించినా కాలువ పూర్తికాక పోవడంతో నీటి జాడ లేదు. అదేవిధంగా చీపురుపల్లి నియోజకవర్గంలోని చీపురుపల్లి, గరివిడి, గుర్ల మండలాల్లో 26వేల ఎకరాలకు చుక్క నీరు అందని పరిస్థితి నెలకొంది. ఫలితంగా చీపురుపల్లి నియోజకవర్గంలో వర్షధారంగా సాగైన ఖరీఫ్ వరి పంట ఇలా.. పశువులకు మేతగా మారుతోంది.
Current Situation of Thotapalli Project : ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్ పరిధిలోని పెండింగ్ పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 123.21 కోట్లు మంజూరు చేసింది. విజయనగరం జిల్లా పార్వతీపురం డివిజన్లో పెండింగ్ పనులకు ఫ్యాకేజీ-1 కింద రూ. 59.58కోట్లు కేటాయించింది. అదేవిధంగా శ్రీకాకుళంజిల్లా రాజాం డివిజన్లోని పనులకు ఫ్యాకేజీ-2 ద్వారా రూ. 63.63 కోట్లతో పనులు చేపట్టేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఫ్యాకేజీ-1 పనులకు బొబ్బిలి మండలం పిరిడి వద్ద, ఫ్యాకేజీ-2 పనులకు పూసపాటిరేగ మండలం కందివలస వద్ద పనులు ప్రారంభించారు. పార్వతీపురం డివిజన్లోని ప్యాకేజీ-1 పనులకు మంత్రి బొత్స సత్యనారాయణ శంకుస్థాపన చేశారు. అయితే ఈ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయకపోవటంతో ఆయకట్టు పరిధిలోని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
" కాల్వల ఆధునీకరణ పనులు ముందుకు సాగకపోవటం.. వర్షాలు ముఖం చాటేయడంతో చీపురుపల్లి నియోజకవర్గ పరిధిలో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. ఎండిపోయిన పంట ఎందుకీ పనికి రాకపోవడంతో పొలాల్లో పశువుల్ని మేపుతున్నాం. ఎకరానికి రూ. 70 వేలకు పైగా పెట్టుబడి పెట్టాము.. పైసా కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదు. పంటలు ఎండిపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న తమని ఏ అధికారి, ప్రజాప్రతినిధి పట్టించుకోవట్లేదు. ఇప్పటికైనా చీపురుపల్లిని కరవు మండలంగా ప్రకటించి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని.. తమని ఆదుకోవాలి." - బాధిత రైతులు
