తల్లిదండ్రులు దూరమై.. నానమ్మకు భారమై.. చిన్నారుల దీనగాథ

author img

By

Published : Nov 7, 2022, 3:14 PM IST

Requested To Government

Grandmother వాళ్లిద్దరూ చిన్నప్పుడే అమ్మనాన్నలకు దూరమయ్యారు. ఇప్పుడు.. నాయనమ్మకు భారమయ్యారు. ఆనందంగా ఆడుకోవాల్సిన వయసులో.. భవిష్యత్‌పై బెంగ పెట్టుకున్నారు. పింఛన్‌తో మనవడు, మనవరాలిని సాకుతున్న నాయనమ్మను.. వృద్ధాప్య సమస్యలు పట్టి పీడిస్తుండడం పిల్లల భవితను ఆందోళనలో పడేసింది.

తండ్రి మరణంతో నాయనమ్మపై చిన్నారుల భారం

Requested To Government: విజయనగరం దాసన్నపేట గొల్లవీధిలో ఓ పెంకుటిల్లు.. అందులోనే మనవడు, మనవరాలితో కలిసి కాలం వెళ్లదీస్తోంది ఓ వృద్ధురాలు. ఈ పిల్లల్ని ఐదేళ్ల క్రితం.. కోడలు వదిలి వెళ్లిపోయింది. 5 నెలల క్రితం కుమారుడు రమణ కూడా మృతి చెందాడు. ఇప్పుడీ చిన్నారులకు..అమ్మైనా, నాన్నైనా.. లక్ష్మమ్మే.

మాకు డబ్బులు ఇచ్చేవారు ఎవరూ లేరు. వచ్చే పింఛన్​తోనే పిల్లల పుస్తకాలు, నా మందులు కొంటున్నాం. మాకు సహాయం చేసేవారు ఎవరూ లేరు. తల్లి వదిలేసిపోయింది. తండ్రి చనిపోయాడు. నేను చనిపోతే పిల్లలను పోషించేవారు లేరు. దయచేసి మమ్మల్ని ఆదుకోండి. -లక్ష్మమ్మ, పిల్లల నాయనమ్మ

లక్ష్మమ్మకు పింఛనే ఆధారం. సొంతిల్లు కూడా లేదు. శిథిలావస్థకు చేరిన ఈ పెంకుటిల్లుకు.. 500 రూపాయల అద్దె కడుతోంది. మిగతా డబ్బులో కొంత మొత్తాన్ని ఔషధాలకు వెచ్చిస్తుంది. మిగిలిన డబ్బుతోనే పప్పైనా, ఉప్పైనా. పిల్లలకు తిండి, తిప్పలకూ.. పింఛన్‌ సొమ్మే ఆధారం. పిల్లలిద్దరూ బడిలోనే మధ్యాహ్న భోజనం చేస్తారని,. సెలవురోజు తిండి పెట్టే స్థోమత కూడా లేదంటోంది లక్ష్మమ్మ. చిన్నారుల చిన్నచిన్న అవసరాలూ తీర్చలేకపోతున్నానని వాపోతోంది.

"వాళ్లు ఇక్కడ 10 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. ఐదు నెలల క్రితం ఆమె కొడుకు చనిపోయాడు. ఇప్పుడు వాళ్లకి దిక్కు ఎవరూ లేరు. వచ్చే పింఛన్​ డబ్బుతోనే పిల్లలను పెంచుతుంది. ప్రభుత్వం స్పందించి పిల్లల చదువుకు, ఆమెకు సహాయం చేయాలి" -స్థానికులు

లక్ష్మమ్మ ఆరోగ్యం అంతంతమాత్రంగా ఉండటంతో.. స్థానికులు కొంతమేర సాయం చేస్తున్నారు. బంధువులెవ్వరూ వీరిని చేరదీయలేదు. ఆమె తర్వాత పిల్లల భవిష్యత్‌ ఏంటో అర్థం కాని పరిస్థితి. చిన్నప్పుడే తల్లిదండ్రుల ఆలనాపాలనకు దూరమై, నాయనమ్మకు భారమైన ఈ పసిపిల్లలు ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు.


ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.