జగన్ రాజభోగం, క్యాంపు కార్యాలయానికి ఇంత ఖర్చా? ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!
Published: Nov 20, 2023, 10:02 AM


జగన్ రాజభోగం, క్యాంపు కార్యాలయానికి ఇంత ఖర్చా? ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!
Published: Nov 20, 2023, 10:02 AM

Rushikonda CM Camp Office Buildings Cost: విలాసవంతమైన భవనాలు, ఆధునిక సౌకర్యాలతో విశాఖలోని రుషికొండపై గత కొంతకాలంగా ప్రభుత్వం నిర్మాణాలు చేపడుతూ వస్తోంది. కానీ ఆ నిర్మాణాల ఖర్చు ఎంత అనేది చెప్పకుండా.. ఇన్నాళ్లూ గోప్యత పాటించింది. ఇక ఇప్పుడు ఎట్టకేలకు వాటిని బయటపెట్టింది. న్యాయసమీక్ష నుంచి తప్పించుకునేందుకు.. చిన్న పనులుగా విభజించారు.
Rushikonda CM Camp Office Buildings Cost: విశాఖపట్నంలో రుషికొండపై సీఎం క్యాంపు కార్యాలయ నిర్మాణాలకు ఎంత ఖర్చయిందో ఇన్నాళ్లూ సీక్రెట్గా ఉంచిన ప్రభుత్వం.. ఎట్టకేలకు వాటి వివరాలను తెలిపింది. ఏకంగా 433 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని మంచినీళ్లలా ఖర్చుపెట్టింది. అంచనా వ్యయం కంటే 16 శాతం అధిక ధరలకు అడ్డగోలుగా పనులు కట్టబెట్టింది.
రుషికొండ పునర్ అభివృద్ధి ప్రాజెక్టు (Rushikonda Redevelopment Project) పేరుతో ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (Andhra Pradesh Tourism Development Corporation) నుంచి తొలుత 350.16 కోట్ల రూపాయలు కేటాయించింది. తర్వాత వాటికి అదనపు కేటాయింపులు చేసింది. కళింగ, గజపతి, వేంగి, విజయనగర బ్లాకుల పేరుతో నిర్మించిన ఈ ప్రాజెక్టుకు ఎంత ఖర్చు చేశారనే విషయాన్ని ఇప్పటివరకు వెల్లడించలేదు.
జీవోలను ఆన్లైన్లో ఉంచడానికి అభ్యంతరమేంటని హైకోర్టు ప్రశ్నించడంతో.. తప్పనిసరి పరిస్థితుల్లో అన్నిశాఖల జీవోలను ఏపీ గెజిట్ వెబ్సైట్లో ఉంచుతోంది. ఈ క్రమంలోనే సీఎం క్యాంపు కార్యాలయ భవనాలకు కేటాయింపు, ఖర్చు తదితర వివరాల జీవోలు బయటకొచ్చాయి. రుషికొండ ప్రాజెక్టుకు సంబంధించి శనివారం రాత్రి ఒకేసారి 10 జీవోలను ప్రభుత్వం వెబ్సైట్లో అప్లోడ్ చేసింది.
ఇందులో అధికశాతం పనులను చిన్నచిన్న మొత్తాలుగా విభజించి కేటాయించారు. 100 కోట్ల రూపాయలు దాటితే.. న్యాయసమీక్షకు వెళ్తామన్న ఉత్తర్వులను తామే ఉల్లంఘించి ఇష్టారాజ్యంగా పనులు చేయించారు. తొలుత ఇవి పర్యాటక భవనాలంటూ ప్రభుత్వం కల్లబొల్లి మాటలు చెప్పగా.. తర్వాత ఐఏఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటుచేసి.. సీఎం క్యాంపు కార్యాలయ ఏర్పాటుకు అనుకూలమంటూ రిపోర్టు తెప్పించుకుంది.
మూడు దశల్లో పనులు.. ఇబ్బడి ముబ్బడిగా నిధులు: రుషికొండ పునర్ అభివృద్ధి ప్రాజెక్టు పేరుతోనే ప్రభుత్వం అక్కడ పనులకు శ్రీకారం చుట్టింది. ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 3 దశలుగా పనులు చేపట్టాలని నిర్ణయించింది. ప్రాజెక్టు అమల్లో భాగంగా తొలిదశ పనులకు 92 కోట్ల రూపాయలు కేటాయించగా.. తర్వాత వాటిని 159 కోట్ల రూపాయలకు పెంచారు. రెండోదశ పనులకు 94.49 కోట్లను ఖర్చు చేశారు. మూడోదశలో 112.76 కోట్లు ఖర్చు చూపారు. రహదారులు, విద్యుత్తు, తాగునీటి సరఫరా, మురుగునీటి పారుదల తదితర పనులకు 46 కోట్ల రూపాయల వరకు ఖర్చుపెట్టడం గమనార్హం. ల్యాండ్ స్కేపింగ్ పనులకే 21.83 కోట్లను వెచ్చించారు. మూడోదశ పనులకు 77.86 కోట్ల అంచనాతో టెండర్ పిలిచారు. 16.46 శాతం అధిక ధరలకు పెంచి 90.68 కోట్ల రూపాయలకు పనులు అప్పగించడం గమనార్హం.
వేడిని తట్టుకునేలా: గోడలకు ఇంటర్లాకింగ్ రాఫ్టర్స్, వేడిని, నీటిని తట్టుకునేలా 18 మి.మీ. మందంతో కూడిన ప్లైవుడ్, బ్యాక్టీరియా, వేడి, నీరు, రసాయనాలకు దెబ్బతినకుండా ఉండేలా 3, 9 మి.మీ. మందంతో లామినేటెడ్ ప్యానెల్స్తో పాటు పలు అత్యాధునిక సౌకర్యాలను అందుబాటులో ఉంచాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా ఆధునికమైన 138 సింగిల్ సీటర్ సోఫాలు, 42 టూ సీటర్ సోఫాలు, 25 త్రీ సీటర్ సోఫాలు, 721 ఎగ్జిక్యూటివ్ కుర్చీలు, 205 టేబుల్స్, 20 పడకలు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఫర్నిచర్కే 14 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టడం గమనార్హం.
