HIGH SECURITY: రాష్ట్రంలోనూ అలజడికి వ్యూహం? పోలీసుల అదుపులో 45 మంది అనుమానితులు

author img

By

Published : Jun 19, 2022, 8:06 AM IST

HIGH SECURITY

HIGH SECURITY: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ తరహాలో రాష్ట్రంలోని కొన్ని స్టేషన్లలోనూ భారీ విధ్వంసాలు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతో విశాఖపట్నం, విజయవాడ, విజయనగరం తదితర ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. విశాఖలో పోలీసు ఉన్నతాధికారులు భారీ ఎత్తున బలగాలను రైల్వేస్టేషన్‌కు తరలించి, శనివారం తెల్లవారుజామున 4 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు స్టేషన్లో ఒక్క రైలు కూడా లేకుండా చూశారు. రైల్వేస్టేషన్‌తోపాటు దాని చుట్టూ సుమారు కిలోమీటరు దూరం వరకు జనసంచారం లేకుండా కట్టుదిట్టం చేశారు.

HIGH SECURITY: తెలంగాణలోని సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ తరహాలో రాష్ట్రంలోని కొన్ని స్టేషన్లలోనూ భారీ విధ్వంసాలు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతో విశాఖపట్నం, విజయవాడ, విజయనగరం తదితర ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. రైల్వేస్టేషన్ల ముందు కంచెలు ఏర్పాటు చేసి, వచ్చిన ప్రయాణికులందర్నీ తనిఖీలు చేశాకే స్టేషన్లలోకి అనుమతించారు. విశాఖలో పోలీసు ఉన్నతాధికారులు భారీ ఎత్తున బలగాలను రైల్వేస్టేషన్‌కు తరలించి, శనివారం తెల్లవారుజామున 4 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు స్టేషన్లో ఒక్క రైలు కూడా లేకుండా చూశారు. రైల్వేస్టేషన్‌తోపాటు దాని చుట్టూ సుమారు కిలోమీటరు దూరం వరకు జనసంచారం లేకుండా కట్టుదిట్టం చేశారు.

రైల్వే ఉద్యోగులు, స్టేషన్‌లో గదులు బుక్‌ చేసుకున్న వారిని మినహా ఏ ఒక్కరినీ అక్కడ ఉండనివ్వలేదు. కర్రలు, రాళ్లతో రావాలని.. బెలూన్లలో పెట్రోలు నింపి తీసుకురావాలని.. కొందరి వాట్సప్‌ సందేశాల్లో ఉన్నట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. రైల్వేస్టేషన్‌కు ఎలా చేరుకోవాలో వాట్సప్‌లో కొందరికి లొకేషన్‌ షేర్‌ చేసినట్లు, స్టేషన్‌ లోపలికి ఏయే ప్రవేశమార్గాల ద్వారా చేరుకోవాలో తెలిపేలా మ్యాప్‌లు కూడా కొందరికి పంపినట్లు పోలీసులు గుర్తించారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని స్టేషన్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేశారు.

సుమారు 45 మంది అనుమానితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న పలువురిని ఆరా తీశారు. వారి ఫోన్లను పరిశీలించారు. రైల్వేస్టేషన్‌ ప్రవేశద్వారాల దగ్గర భారీఎత్తున బలగాల్ని, అగ్నిమాపకశాఖ శకటాలను మోహరించారు. పోలీసులతోపాటు ఆర్పీఎఫ్‌, జీఆర్పీ, సీఆర్‌పీఎఫ్‌ తదితర బలగాలన్నీ భద్రత ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. 312 మందిని ముందస్తుగా అరెస్టు చేసి, తర్వాత విడిచిపెట్టారు.

ప్రయాణికులకు తప్పని అవస్థలు: శనివారం తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు విశాఖ రైల్వేస్టేషన్‌కు ఎవరూ వెళ్లడానికి వీల్లేకుండా అన్ని మార్గాలను దిగ్బంధించడంతో ప్రయాణికులు ఎన్నో అవస్థలు పడ్డారు. స్టేషన్‌కు వెళ్లే అన్ని రహదారులను సుమారు కిలోమీటరు ముందే మూసేయడంతో రైలు ఎక్కడానికి వచ్చిన ప్రయాణికులకు ఏం చేయాలో పాలుపోలేదు. రైలు బయలుదేరడానికి అరగంట ముందు అక్కడికి వచ్చినవారికి పోలీసులు సింహాచలం ఉత్తర స్టేషన్‌కుగానీ, దువ్వాడకు గానీ వెళ్లాలని చెబుతుండటంతో ఆందోళనకు గురయ్యారు. విశాఖ నుంచి దువ్వాడ వెళ్లడానికి గంటన్నర, సింహాచలానికి కనీసం 40 నిమిషాలు పడుతుంది. సకాలంలో అక్కడికి చేరుకోలేని వందల మంది ప్రయాణికులు తాము వెళ్లాల్సిన రైళ్లను అందుకోలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరికొంతమంది ప్రయాణంపై ఆశలు వదిలేసుకుని విశాఖ స్టేషన్‌ నుంచే ఇళ్లకు వెళ్లిపోయారు.

అనుమానితులను విచారిస్తున్నాం: ‘సికింద్రాబాద్‌ తరహాలో దాడులు జరుగుతాయని విశ్వసనీయ సమాచారం రావడంతో రైల్వేస్టేషన్‌లోకి ఎవరూ రాకుండా నియంత్రించాం. విధ్వంసాలకు తావు లేకుండా చేశాం. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నాం. విచారణ కొనసాగుతోంది’ అని విశాఖ పోలీస్‌ కమిషనర్‌ సీహెచ్‌ శ్రీకాంత్‌ పేర్కొన్నారు. విశాఖపట్నంలో రైళ్లు రద్దు కావడంతో పలువురు ప్రయాణికులు బస్సులు, ఇతరత్రా వాహనాల్లో విజయనగరం రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. ప్రయాణికుల ముసుగులో ఆందోళనకారులు వస్తున్నారేమోనన్న అనుమానంతో పోలీసులు, ఆర్పీఎఫ్‌ సిబ్బంది ప్రతి ఒక్కర్నీ తనిఖీ చేశాకే లోపలికి విడిచిపెట్టారు.

* శనివారం విశాఖ స్టేషన్‌కు రాకుండా మళ్లించిన రైళ్లు: 13
* రద్దయిన రైలు సర్వీసులు: 16
* కుదించిన సర్వీసులు: 12

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.